ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అధికార ఆమ్ ఆద్మీ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. అగ్రనేతలు అరవింద్ కేజ్రీవాల్, మనీశ్ సిసోడియా, సత్యేంద్ర జైన్ లు పరాజయం పాలయ్యారు. అటు బీజేపీ ఇప్పటికే భారీ ఆధిక్యంతో ప్రభుత్వ ఏర్పాటు దిశగా దూసుకెళ్తోంది. అయితే, ఆప్కు ఊరటనిచ్చేలా ఢిల్లీ సీఎం అతిశీ మార్లేనా విజయం సాధించారు. కల్కాజీ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆమె తన సమీప ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి రమేశ్ బిధూరీని ఓడించారు.
2020, 2015 అసెంబ్లీ ఎన్నికల్లో కల్కాజీలో ఏం జరిగింది?
2020 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ అభ్యర్థి అతిశీ ఈ స్థానాన్ని 11,393 ఓట్ల ఆధిక్యంతో గెలుచుకున్నారు. ఆమెకు 52.28శాతం ఓట్ల వాటాతో 55,897 ఓట్లు వచ్చాయి. అతిశీ ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి ధరంబీర్ సింగ్కు 41.63 శాతం అంటే 44,504 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్థి శివానీ చోప్రా కేవలం 4,965 ఓట్లతో (4.64శాతం) మూడవ స్థానంలో నిలిచారు.
ఇక 2015 ఎన్నికల్లో ఆప్ అభ్యర్థి అవతార్ సింగ్ ఈ స్థానాన్ని గెలుచుకున్నారు. ఆయనకు 55,104 ఓట్లు (51.7 శాతం) ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థి హర్మీత్ సింగ్ కల్కా 35,335 (33.16 శాతం) ఓట్లు సాధించి రెండవ స్థానంలో నిలిచారు.