అప్రమత్తమైన ప్రభుత్వం..
వ్యాధి సోకిన కోళ్లను చంపిపూడ్చివేయాలని అదేశం
ప్రతి కోడికి రూ.90 నష్ట పరిహారం
రెండు వారాల పాటు చికెన్ కు దూరంగా ఉండాలని సూచన
గత 15 రోజులుగా తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లోని వివిధ పౌల్ట్రీలలో కోళ్లు అనూహ్యంగా మరణిస్తున్నాయి..ఇప్పటికే 20 వేలకు పైగా కోళ్లు మృత్యువాత పడ్డాయి.. ఇక రెండు ప్రాంతాల్లో కోళ్ల మరణాలకు బర్డ్ ఫ్లూ వైరస్ కారణమని ల్యాబ్ టెస్ట్లలో నిర్ధారణయింది. 15 రోజులుగా వణికిస్తున్న వైరస్ ఏవియన్ ఇన్ఫ్లూయెంజా అని భోపాల్లోని యానిమల్ డిసీజెస్ ల్యాబ్ తేల్చింది. పశ్చిమగోదావరి జిల్లా తణుకు, తాడేపల్లిగూడెం, ఉంగుటూరు, భీమడోలు, కొల్లేరు సమీప ప్రాంతాల్లో గత వారం పెద్ద సంఖ్యలో కోళ్లు చనిపోయాయి. కాకినాడ, ఏలూరు పశుసంవర్ధకశాఖ అధికారులు చనిపోయిన కోళ్ల నుంచి రక్తనమూనాలు తీసి భోపాల్లోని ల్యాబ్కు పంపారు. తణుకు మండలం వేల్పూరు, పెరవలి మండలం కానూరు గ్రామాల్లో చనిపోయిన కోళ్లకు హెచ్5ఎన్1 పాజిటివ్గా పరీక్షల్లో నిర్ధారణ అయింది. తూర్పుగోదావరి జిల్లా పెరవలి మండలం కానూరు గ్రామ పౌల్ట్రీల్లో సేకరించిన శాంపిల్స్లో బర్డ్ ఫ్లూ పాజిటివ్ వచ్చినట్లు పూణే ల్యాబ్లో నిర్ధారణ అయిందని జిల్లా అధికారులు వెల్లడించారు. ల్యాబ్ రిపోర్ట్ రావడంతో రాజమండ్రి కలెక్టరేట్లో అత్యవసర సమావేశం నిర్వహించారు జిల్లా కలెక్టర్ ప్రశాంతి. కానూరు గ్రామం పరిధిలో ఒక కిలోమీటర్ రెడ్ జోన్, పది కిలోమీటర్లు సర్వైలెన్స్ జోన్గా ప్రకటించి.. ఆదేశాలు జారీ చేయాలని అన్నారు. దీనిపై పంచాయతీ సిబ్బందిని అప్రమత్తం చేశారు. ఈ ప్రాంతాల పరిధిలో 144, 133 సెక్షన్ అమలు చేస్తున్నారు.