భారత్లో ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు 21 మిలియన్ డాలర్ల నిధులు
జో బైడెన్ నేతృత్వంలోని గత ప్రభుత్వంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్లో ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు ఉద్దేశించిన 21 మిలియన్ డాలర్ల నిధులతో అక్కడున్న మరెవరి గెలుపు కోసమో బైడెన్ పనిచేశారని ఆయన ఆరోపించారు. ఎలాన్ మస్క్ నేతృత్వంలోని డోజ్ (డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషయెన్సీ) ఇటీవల భారత్ సహా పలు దేశాలకు అందించే ఆర్థిక సాయాన్ని నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది. తాజాగా ఈ విషయమై ట్రంప్ మాట్లాడారు. సౌదీ అరేబియా ప్రభుత్వ మద్దతుతో మియామిలో నిర్వహించిన ఎఫ్ఐఐ ప్రియారిటీ సదస్సులో పాల్గొన్న ట్రంప్ గత రాత్రి మాట్లాడుతూ.. భారత్లో ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు 21 మిలియన్ డాలర్లు ఇవ్వాల్సిన అవసరం తమకేంటని ప్రశ్నించారు. భారత్లో మరెవరినో గెలిపించేందుకు వారు (బైడెన్ ప్రభుత్వం) ప్రయత్నించారని ఆరోపించారు. ఈ విషయాన్ని భారత్కు చెప్పాలని, అదే కీలక ముందడుగు అవుతుందని ట్రంప్ పేర్కొన్నారు. మంగళవారం కూడా ట్రంప్ ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. భారత ఆర్థిక స్థితి బాగుందని, ఆ దేశం వద్ద బోల్డంత డబ్బు ఉందని పేర్కొన్న ట్రంప్ తామెందుకు నిధులు ఇవ్వాలని వ్యాఖ్యానించారు.