బెంగళూరులో ఆర్సీబీ ఐపీఎల్ విజయోత్సవ ర్యాలీలో అపశ్రుతి
చిన్నస్వామి స్టేడియం వద్ద తొక్కిసలాట
11 మంది అభిమానులు మృతి, 33 మందికి గాయాలు
ఘటనతో తమకు సంబంధం లేదన్న బీసీసీఐ..ర్యాలీ గురించి తమకు సమాచారం లేదన్న బీసీసీఐ కార్యదర్శి
ఫ్రాంచైజీదే బాధ్యత అని స్పష్టీకరణ
ఐపీఎల్ 2025 సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టు తొలిసారిగా కప్ గెలిచిన ఆనందం అభిమానులకు ఎక్కువసేపు నిలవలేదు. నిన్న బెంగళూరులోని ఎం. చిన్నస్వామి స్టేడియంలో జరిగిన విజయోత్సవ ర్యాలీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఈ కార్యక్రమంలో జరిగిన తొక్కిసలాటలో 11 మంది అభిమానులు ప్రాణాలు కోల్పోగా, మరో 33 మంది గాయపడ్డారు. ఈ దురదృష్టకర ఘటనపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) స్పందిస్తూ ఐపీఎల్ సీజన్ ముగిసిన తర్వాత ఫ్రాంచైజీ తమ సొంత మైదానంలో నిర్వహించే కార్యక్రమాల్లో తమ ప్రమేయం ఉండదని స్పష్టం చేసింది.
బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా మాట్లాడుతూ ఐపీఎల్ ఫైనల్ ముగిసి, బహుమతుల ప్రదానోత్సవం పూర్తయిన తర్వాత ఫ్రాంచైజీ తమ హోమ్ గ్రౌండ్లో ఏం చేస్తుందనే దానితో బీసీసీఐకి ఎలాంటి సంబంధం ఉండదుఁ అని స్పష్టం చేశారు. (ఆర్సీబీ) మాకు సమాచారం ఇవ్వాల్సిన అవసరం లేదు. మా అనుమతి తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. వారిని పర్యవేక్షించాల్సిన బాధ్యత కూడా బీసీసీఐకి లేదుఁ అని ఆయన స్పష్టం చేశారు.
బెంగళూరులో విజయోత్సవ ర్యాలీ లేదా వేడుకలు ప్లాన్ చేసినట్లు మాకు ఎలాంటి సమాచారం లేదు. ఎవరు దీనిని నిర్వహించారో, అంతమంది అభిమానులు ఎలా అక్కడికి వచ్చారో మాకు తెలియదుఁ అని సైకియా తెలిపారు. ఆర్సీబీ యాజమాన్యం కూడా స్టేడియం లోపల ఉండటం వల్ల బయట ఏం జరుగుతుందో వారికి తెలియదు. విషయం తెలిసిన వెంటనే మేము ఆర్సీబీ అధికారులతో మాట్లాడాము. వారు వేడుకలను ముగిస్తున్నట్లు మాకు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక యంత్రాంగం కూడా ఈ ఘటనను గమనిస్తారని నేను కచ్చితంగా నమ్ముతున్నాను అని ఆయన వివరించారు.
సరైన ప్రణాళిక అవసరం
2024 టీ20 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టు విజయోత్సవ ర్యాలీని ముంబైలో విజయవంతంగా నిర్వహించిన తీరును ప్రస్తావిస్తూ అక్కడ అభిమానులు సముద్రంలా తరలివచ్చినా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదని, కానీ బెంగళూరు స్థానిక యంత్రాంగం సరైన ప్రణాళిక చేయడంలో విఫలమైందని, ఫలితంగా ఈ దుర్ఘటన జరిగిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి కార్యక్రమాలను నిర్వహించేటప్పుడు సరైన ప్రణాళిక అవసరమని నొక్కిచెబుతూ ఇటువంటి కార్యక్రమాలను నిర్వహించేటప్పుడు, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా స్థానిక అధికారులతో వారు సరిగ్గా సమన్వయం చేసుకోవాలి అని సైకియా పేర్కొన్నారు.
ఆర్సీబీ సంతాపం
తొక్కిసలాట అనంతరం సంబంధిత ఐపీఎల్ ఫ్రాంచైజీ ఆర్సీబీ ఒక ప్రకటన విడుదల చేసింది. తమ జట్టు తొలి ఐపీఎల్ విజయాన్ని చూడటానికి వచ్చిన అమాయక అభిమానుల మృతికి సంతాపం తెలిపింది.ప్రతి ఒక్కరి భద్రత, శ్రేయస్సు మాకు అత్యంత ముఖ్యం. ఈ విషాదకర ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారికి ఆర్సీబీ సంతాపం తెలుపుతోంది. బాధిత కుటుంబాలకు మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం అని ఫ్రాంచైజీ ఆ ప్రకటనలో పేర్కొంది. పరిస్థితి మా దృష్టికి వచ్చిన వెంటనే మేము మా కార్యక్రమాన్ని సవరించి, స్థానిక యంత్రాంగం మార్గదర్శకత్వం, సలహాలను పాటించాంఁ అని తెలిపింది.