. ఆహ్వాన సంఘ కమిటీ ఏర్పాటు… ఇంటింటికీ ప్రచార కార్యక్రమాలు
. సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని
విశాలాంధ్ర బ్యూరో – మేడ్చల్-మల్కాజిగిరి : భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) తెలంగాణ రాష్ట్ర 4వ మహాసభలను జయప్రదం చేయాలని సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి, శాసన సభ్యులు కూనంనేని సాంబశివరావు పిలుపునిచ్చారు. ఆగస్టు 19-22 వరకు మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్లోని (మహారాజ గార్డెన్) లో ఈ సభలు జరగనున్నట్లు తెలిపారు. రాష్ట్ర మహాసభల సందర్భంగా షాపూర్ నగర్ ఏఐటీయూసీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన ఆహ్వాన సంఘ సమావేశానికి సాంబశివరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వి.ఎస్.బోస్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా కూనంనేని మాట్లాడుతూ రాష్ట్ర మహాసభల నిర్వహణకు ఆతిథ్యం ఇచ్చిన సీపీఐ మేడ్చల్ జిల్లా సమితికి అభినందనలు తెలిపారు. ఈ మహాసభలకు జాతీయ నేతలు, అన్ని జిల్లాల నుంచి దాదాపు 1000 మంది పార్టీ ప్రతినిధులు హాజరవుతారని అన్నారు. ప్రజా సమస్యలపై, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై, రాజ్యాంగం కల్పించిన పౌరుల ప్రాథమిక హక్కులపై చర్చించి, తీర్మానాల రూపంలో భవిష్యత్ పోరాటాలకు మహాసభ వేదిక కానుందని చెప్పారు. కమ్యూనిస్టు కార్యకర్తలందరూ ప్రజల వద్దకు వెళ్లి కరపత్రాలు పంచి మహాసభల విజయవంతానికి హార్ధిక, ఆర్థిక సహాయ సహకారాలు తీసుకుని వారిని భాగస్వామ్యులను చేయాలని పిలుపునిచ్చారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్టులను, అమాయక గిరిజనులను హతమారుస్తోందని విమర్శించారు. తక్షణమే మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని, కాల్పుల విరమణను ప్రకటించాలని సీపీఐ డిమాండ్ చేస్తోందన్నారు. పహల్గాంలో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో 27 మందికి పైగా మరణించారని, అయితే కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఆ నలుగురు ఉగ్రవాదులను పట్టుకోలేకపోయిందన్నారు. అయితే కేంద్రం దేశంలోని పౌరులు, అమాయక గిరిజనులను కాల్చి చంపడం అప్రజాస్వామిక చర్య అని మండిపడ్డారు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తానే యుద్ధాన్ని ఆపానంటూ చెబుతున్న మాటలు వింటుంటే… మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ… ట్రంప్నకు దేశాన్ని తాకట్టు పెట్టడమేనని విమర్శించారు. భారతదేశ సార్వభౌమాధికారాన్ని తాకట్టు పెట్టిన మోదీకి దేశ ప్రధానిగా కొనసాగే నైతిక హక్కు లేదని అన్నారు. మాజీ ఎమ్మెల్సీ, సీపీఐ సీనియర్ నేత పీజే చంద్రశేఖర్ మాట్లాడుతూ రాష్ట్ర మహాసభల నిర్వహణ అంటే పార్టీ నూతనోత్సాహానికి, పార్టీ ఎదుగుదలకు తార్కాణమని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జాతీయ సమితి సభ్యులు ఎండీ యూసుఫ్, ఏఐటీయూసీ రాష్ట్ర డిప్యూటీ జనరల్ సెక్రటరీ ఎం.నర్సింహ, సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డీజీ సాయిలు గౌడ్, సీపీఐ మేడ్చల్ జిల్లా కార్యదర్శి ఈ.ఉమామహేష్, సీపీఐ హైదరాబాద్ జిల్లా సహాయ కార్యదర్శి స్టాలిన్, సీపీఐ రంగారెడ్డి జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య, రాష్ట్ర సమితి సభ్యులు యేసు రత్నం, జి.దామోదర్ రెడ్డి, జె.లక్ష్మీ, ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కె.ధర్మేంద్ర, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి పి.లక్ష్మణ్, సీపీఐ మేడ్చల్ జిల్లా కార్యవర్గ సభ్యులు కె.స్వామి, హరినాధ్ రావు, ఎస్.శంకర్ రావు, శంకర్, టి.సత్య ప్రసాద్, కృష్ణతో పాటు సీపీఐ మేడ్చల్ జిల్లా సమితి సభ్యులు దశరథ్, సహదేవ్, శశిదర్ రెడ్డి, సల్మాన్ బేగ్, యాదయ్య, మాధవి, శ్రీనివాస్, లొట్టి ఈశ్వర్, వెంకట్ రెడ్డి, పరమేశ్వర, నాగరాజు, రవి చంద్ర, ప్రమీల, డీజీ. నరేంద్ర ప్రసాద్, నర్సింహా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.