Tuesday, February 4, 2025
Homeఆదాయం పెరగాలి

ఆదాయం పెరగాలి

సంక్షేమం, అభివృద్ధి అమలుకు ఆర్థిక వనరులే కీలకం

. ఇందుకోసం సరికొత్త మార్గాలు అన్వేషించండి
. సాధారణ లక్ష్యాలకు భిన్నంగా వినూత్న ఆలోచనలు చేయాలి
. అధికారుల పనితీరు ఫలితాల్లో కనిపించాలి
. వేధింపులు లేకుండా పన్ను ఎగవేతలు అరికట్టండి
. అధికారులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం

విశాలాంధ్ర బ్యూరో- అమరావతి : వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆర్థికంగా కుదేలైన రాష్ట్రం మళ్లీ కోలుకుని అభివృద్ధి చెందాలంటే ప్రభుత్వంలోని ఆదాయార్జన శాఖలు ఉత్తమ ఫలితాలు రాబట్టాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ ఖజానాకు రాబడులు పెంచేందుకు సరికొత్త ఆలోచనలు చేయాలని, సమర్థవంత చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. సాధారణ పనితీరుతో, సాధారణ లక్ష్యాలతో పనిచేస్తే ఫలితాలు రావని, వినూత్న ఆలోచనలతో పనిచేయాలని సీఎం మార్గనిర్దేశనం చేశారు. సాంకేతికత వాడకం ద్వారా రెవెన్యూ ఆర్జనలో లోపాలను సరిదిద్ది ఆదాయం పెంచాలని సూచించారు. వాణిజ్య పన్నుల విభాగంలో పన్ను ఎగవేతలపై అధికారులు చెప్పిన అంశాలపై సీఎం స్పందిస్తూ… ఏ ఒక్కరూ పన్ను ఎగవేతకు పాల్పడకుండా చూడాలన్నారు. అలా అని వ్యాపారులను వేధింపులకు గురి చేయవద్దన్నారు. ఆదాయార్జన శాఖలపై మంగళవారం సచివాలయంలో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ సంక్షేమ కార్యక్రమాలకు, అభివృద్ధి పనులకు ఆర్థిక వనరులు ఎంతో కీలకం. అధికారులు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని రోజువారీ ప్రగతి చూపేలా పని చేయాలి. గత ప్రభుత్వ విధానాలతో ప్రజల జీవన ప్రమాణాలు పడిపోయాయి. ఆదాయం కోసం ప్రజలపై అదనంగా భారం మోపలేం. ఆదాయార్జనలో మరింత మెరుగైన ఫలితాలు సాధించడం మినహా మరొక మార్గం లేదని సీఎం స్పష్టం చేశారు. కేంద్రం నుంచి నిధుల విషయంలో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని, 16వ ఆర్థిక సంఘం చైర్మన్‌ అరవింద్‌ పనగారియాను కలిసి గంటా 45 నిమిషాల పాటు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని వివరించానని చెప్పారు. ఈ తపనంతా రాష్ట్రం కోసమేనని, అధికారులు కూడా దీన్ని అర్థం చేసుకుని పని చేయాలని సీఎం కోరారు.
రాష్ట్ర రెవెన్యూ ఆదాయం అంచనా రూ.1,02,154 కోట్లు
రెవెన్యూ రాబడులపై అధికారులు సీఎంకు ప్రజెంటేషన్‌ ఇచ్చారు. 2023-24 సంవత్సరానికి వాణిజ్య పన్నుల విభాగంలో మొత్తం రూ.41,420 కోట్లు రాగా, ఈ ఏడాది ఇప్పటి వరకు రూ.41,382 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ విభాగంలో ఫిబ్రవరి, మార్చి నెలల్లో వృద్ధి ఉంటుందని అధికారులు తెలిపారు. అదే విధంగా గత ఏడాదితో పోల్చితే నూతన ఎక్సైజ్‌ విధానం కారణంగా ఈ శాఖలో ఆదాయం పెరుగుతుందని, అయితే మైనింగ్‌ శాఖలో ఇప్పటి వరకు అనుకున్న స్థాయిలో రెవెన్యూ పెరగలేదని అధికారులు వివరించారు. కోర్టు కేసుల పరిష్కారం, అనుమతుల మంజూరు వంటి చర్యల ద్వారా మైనింగ్‌ శాఖలో ఆదాయాన్ని పెంచాలని సీఎం సూచించారు. రాష్ట్రానికి ఉన్న మైనింగ్‌ వనరుల దృష్ట్యా ఈ విభాగంలో అత్యధిక ఆదాయం రావాలన్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి వ్యాట్‌, జీఎస్‌టీ, ఎక్సైజ్‌, వృత్తి-వాణిజ్య పన్నుల ద్వారా వచ్చే ఆదాయం స్వల్పంగా పెరుగుతుందని అధికారులు అంచనా వేశారు. మొత్తం మీద 2024-25 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వ రెవెన్యూ రూ.1,02,154 కోట్లు ఉండొచ్చని అధికారులు అంచనా వేశారు. ఆదాయార్జన విషయంలో ఇకపై ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తానని, అధికారులు శాఖలను బలోపేతం చేసుకుని ఫలితాలు చూపాలని సీఎం స్పష్టం చేశారు. ఈ సమీక్షలో ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌, సీఎస్‌ విజయానంద్‌తో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు