భారతీయుడు సహా 12 మంది మృతి: జెలెన్స్కీ
కీవ్: ఉక్రెయిన్పై రష్యా భారీ వైమానిక దాడి జరిపింది. మంగళవారం తెల్లవారుజామున కీవ్ సహా అనేక ప్రాంతాలపై బాలిస్టిక్, క్రూయిజ్ క్షిపణులు డ్రోన్లు ప్రయోగించింది. 12 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఒక భారతీయుడు ఉన్నారు. ఈ మేరకు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సామాజిక మాధ్యమం ద్వారా తెలిపారు. మరో 18 మందికిపైగా తీవ్రంగా గాయపడగా, వీరిలో ముగ్గురు చిన్నారులు ఉన్నారన్నారు. మొత్తం 218 డ్రోన్లు, బాలిస్టిక్, క్రూయిజ్ క్షిపణులతో రష్యా విరుచుకుపడినట్లు ఉక్రెయిన్ వాయుసేన పేర్కొంది. జెట్ ఇంజిన్ కలిగిన డ్రోన్లు ఎక్కువగా ప్రయోగించినట్లు తెలిపింది. కీవ్లోని నివాస భవనాలు, రైల్వే సదుపాయాలు దెబ్బతిన్నాయని, బోరిస్పిల్లో ఐదంతస్తుల భవనం ధ్వంసమైందని అధికారులు తెలిపారు.
దాడి అనంతరం 350 మంది సిబ్బంది కీవ్, చుట్టుపక్కల ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టారు. ఈ దాడులతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. కొన్ని ప్రాంతాల్లో రవాణా, మౌలిక వసతులు దెబ్బన్నాయి. పౌరుల ప్రాణాలు కాపాడేందుకు బాలిస్టిక్ క్షిపణి నిరోధక వ్యవస్థలు అవసరమని, తమకు అస్త్రసాయం అందించాలని ప్రపంచ దేశాలకు జెలెన్స్కీ విజ్ఞప్తి చేశారు. ఇదిలావుంటే, రష్యా సైన్యంలో 227 మంది భారతీయులు చేరారని, వారిలో 51 మంది ప్రాణాలు కోల్పోయారని, 139 మందిని విధుల నుంచి తొలగించారని భారత విదేశాంగ శాఖ వెల్లడించింది. రష్యా సైన్యం నుంచి భారతీయులను బయటకు రప్పించి, స్వదేశానికి తీసుకువచ్చేందుకు సంప్రదింపులు జరుగుతున్నట్లు తెలిపింది.
ఉక్రెయిన్పై రష్యా వైమానిక దాడి
- Advertisement -
RELATED ARTICLES


