. ఆర్థిక ఇబ్బందులున్నా… మొదటి తారీకునే జీతాలు
. ప్రజలపై రూపాయి భారం పడకుండా పాలన
. త్రిమెన్ కమిటీ నివేదిక క్యాబినెట్కు అందజేస్తాం: భట్టి
విశాలాంధ్ర – హైదరాబాద్ : ఉద్యోగుల సమస్యల పరిష్కారం తమ ప్రభుత్వ బాధ్యత అని, సమస్యలను సానుకూలంగా పరిష్కరించేందుకు సీఎం రేవంత్ రెడ్డి … మంత్రుల సబ్ కమిటీ, అధికారుల కమిటీలను నియమించారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. డాక్టర్ అంబేద్కర్ సచివాలయంలో బుధవారం సబ్ కమిటీ సభ్యులైన మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ సలహాదారు కేశవరావు తదితరులతో కలిసి సమావేశమయ్యారు. అందరితో చర్చించి సాధ్యమైనంత త్వరగా సమస్యల పరిష్కారానికి సానుకూల నిర్ణయం తీసుకునే విధంగా మంత్రుల కమిటీకి సీఎం సూచించారని భట్టి తెలిపారు. త్రీమెన్ కమిటీ ఉద్యోగ సంఘాలతో పలుమార్లు సమావేశమై విజ్ఞప్తులను స్వీకరించినట్టు చెప్పారు. ఉద్యోగుల సమస్యలకు సత్వర పరిష్కారం చూపాలన్నదే తమ అభిమతమన్నారు. క్యాబినెట్ సమావేశం నేపథ్యంలో గురువారం అధికారుల నివేదికతో పాటు నేరుగా ఉద్యోగ సంఘాలతో చర్చించాలని నిర్ణయించినట్టు తెలిపారు. ఉద్యోగులు ప్రభుత్వంలో భాగస్వాములన్నారు. ప్రజలకు, ఉద్యోగులకు ఇబ్బందులు కలగకూడదన్న ఆలోచనతోనే క్యాబినెట్ సమావేశానికి ముందు ఉద్యోగ సంఘాలతో సమావేశమైనట్టు డిప్యూటీ సీఎం వివరించారు. గత పదేళ్ల పాలనతో ఆర్థిక ఇబ్బందులు తలెత్తినా ఉద్యోగులకు సాధ్యమైనంత మేరకు మేలు చేయాలన్న ఆలోచనతో మొదటి తారీకునే జీతాలు చెల్లిస్తున్నట్టు తెలిపారు. గత ప్రభుత్వ పథకాలను కొనసాగిస్తూనే, కొత్త పథకాలు విజయవంతంగా అమలు చేస్తున్నామన్నారు. వనరులు సమకూర్చుకొని ప్రజలపై అదనంగా రూపాయి భారం పడకుండా పాలన సాగిస్తున్నట్టు చెప్పారు. ప్రభుత్వ ఆదాయం … ఖర్చు బేరీజు వేసుకొని ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని సీఎం సూచించారని, ఉద్యోగ సంఘాలకు భరోసా ఇచ్చారు. ఈ అంశంపై ఎవరికీ భిన్నాభిప్రాయం లేదని తెలిపారు. త్రీ మెన్ కమిటీ, ఆర్థిక శాఖ, ఇతర అధికారులతో చర్చించి ఒక నివేదిక రూపొందించి క్యాబినెట్ కు నివేదిస్తామన్నారు. అధికారులు నవీన్ మిట్టల్, లోకేశ్ కుమార్, కృష్ణభాస్కర్, సందీప్ కుమార్ సుల్తానియా, మహేశ్ దత్ ఎక్కా తదితరులు పాల్గొన్నారు.