Sunday, June 22, 2025
Homeవిశ్లేషణకార్మికహక్కుల రద్దుపై కన్నెర్ర

కార్మికహక్కుల రద్దుపై కన్నెర్ర

వెలుగూరి రాధాకృష్ణమూర్తి ఏఐటియుసి రాష్ట్ర గౌరవాధ్యక్షులు

నరేంద్రమోదీ కార్మిక,కర్షక,ప్రజావ్యతిరేక విధానాలను ప్రతిఘటించాలని కేంద్ర కార్మికసంఘాలు నిర్ణయించాయి. దేశ సరిహద్దులలో నెలకొన్న పరిస్థితులవల్ల మే నెల 20వ తేదీ జరగాల్సిన సమ్మెను జులై 9వ తేదీకి వాయిదా వేశారు. నాలుగు కార్మిక కోడ్ల రద్దుతోపాటు రూ.26000 కనీసవేతనం, 8గంటల పనిదినం, కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌, ఆశా, అంగన్వాడి తదితర స్కీం వర్కర్ల రెగ్యులరైజేషన్‌, ఇండియన్‌ లేబర్‌ కాన్ఫరెన్స్‌ సమావేశ నిర్వహణ, మరికొన్ని డిమాండ్ల సాధనకోసం ఈ సమ్మె జరగనుంది. వందలాది రైతు సంఘాలకు నాయకత్వం వహిస్తున్న సంయుక్త కిసాన్‌ మోర్చా కూడా ఈ కార్యాచరణలో పాల్గొనాలని నిర్ణయించటమేగాక, అదేరోజున గ్రామీణ బంద్‌కు పిలుపునివ్వటం ముదావహం. మోదీ అనుసరించిన ఆర్థికవిధానాల కారణంగా, పేదరికం, అసమానతలు, ఆకలి, నిరుద్యోగం పెరిగాయి. 10 సంవత్సరాలలో పేదరికం17శాతం పెరిగింది. కార్మికుల వేతనాలు 2017-18 స్థాయి కంటే పడిపోయాయి. మరొకవైపు, కార్పొరేట్‌ కుటుంబాల ఆస్తులు, సంపద ఇబ్బడి ముబ్బడిగా పెరిగాయి.
మోదీ మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కార్పొరేట్‌ ఏజెండాను మరింత నిర్దాక్షిణ్యంగా అమలు జరుపుతున్నారు. ఈ సంవత్సరం ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి 4 కార్మిక కోడ్‌లను అమలుచేయాలని ప్రయత్నించారు. పోరాడి, అనేక త్యాగాలు చేసి సాధించుకున్న హక్కులన్నిటినీ రద్దు చేయాలని భావించారు. రాజ్యాంగ స్ఫూర్తినీ, సుప్రీం కోర్టుతీర్పులనూ, అంతర్జాతీయ కార్మికసంస్థ (ఐఎల్‌ఓ) మార్గదర్శకాలన్నిటిని భూస్థాపితం చేయ సంకల్పించారు. కార్మికుల్ని కట్టుబానిసలుగా మార్చాలనుకున్నారు. కార్మిక కోడ్‌ల అమలులోకి వస్తే 8 గంటల పనిదినం, కనీస వేతనాలు, సామాజిక భద్రత, సంఘం పెట్టుకునే హక్కు, సంఘాల రిజిస్ట్రేషన్లు, సంఘాల గుర్తింపు, సమిష్టి బేరసారాల హక్కు, సమ్మె హక్కు, ఆందోళనలు చేసే హక్కులు అన్నీ తీవ్రమైన ప్రమాదంలో పడిపోతాయి. గతంలో వంద మంది కార్మికులు పనిచేస్తున్న ఏ సంస్థకైనా కార్మిక చట్టాలు వర్తించేవి. ఇప్పుడు ఆ సంఖ్యను 300కు పెంచారు. దీనివల్ల దాదాపు 70 శాతం పారిశ్రామిక సంస్థలకు ఏ కార్మిక చట్టమూ వర్తించదు. లేబర్‌ కోర్టులను రద్దుచేస్తున్నారు. కనీస వేతనం నిర్ణయించటానికి అమలులోగల షెడ్యూల్స్‌ విధానాన్ని రదు ్దచేస్తున్నారు. మొత్తం కార్మిక శక్తిలో అసంఘటిత రంగ కార్మికులు 90శాతంఉన్నారు. జీడీపీి లో వీరి వాటా 45శాతం ఉంది. అయినప్పటికీ, కార్మికకోడ్లలో అసంఘటిత కార్మికులకు సంబంధించిన ఊసేలేదు. గతంలో, ఒక కాంట్రాక్టర్‌ దగ్గర 20మంది కార్మికులు పని చేస్తుంటే లైసెన్స్‌ తప్పనిసరిగా ఉండాలి. ఇప్పుడు ఈ సంఖ్యను 50కి పెంచారు. దీనివల్ల ఎటువంటి లైసెన్స్‌ లేకుండానే కాంట్రాక్టర్‌ తన హవా’ కొనసాగించే పరిస్థితి ఏర్పడుతుంది. ఈ దాడి ప్రాథమిక హక్కులపై జరిగేదే తప్ప మరొకటికాదు. అందుకే నాలుగు కార్మిక కోడ్లను రద్దు చేయాలని కార్మికసంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి.
దేశంలో మొత్తం పౌరహక్కులపైనే తీవ్రమైన దాడి జరుగుతోంది. కార్మికవర్గ హక్కులపై జరుగుతున్న దాడిని దీనిలో భాగంగానే చూడాల్సి ఉంటుంది. భావప్రకటనా స్వేచ్ఛ, అసమ్మతిగళం వినిపించే హక్కులపై జరుగుతున్న దాడులను ప్రభుత్వ ఫాసిస్టు విధానంలో భాగంగానే పరిగణించాలి. యుఏపీఏ(న్యాయ విరుద్ధకార్యకలాపాల నిరోధక చట్టం), పీిఎంఎల్‌ఏ ( డబ్బు దుర్వినియోగ నిరోధక చట్టం)తోపాటు, నూతనంగా అమలులోకి వచ్చిన బీఎన్‌ఎస్‌ (భారతీయ న్యాయ సంహిత) చట్టాలను పౌర హక్కులపై దాడికి ప్రయోగిస్తున్నారు. ఈ చట్టాల క్రింద ఇప్పటికే, ఎటు వంటి విచారణలేకుండా వేలాదిమంది జైళ్లలో మగ్గుతున్నారు. బీఎన్‌ఎస్‌ చట్టంలోని 111వ సెక్షన్‌ ప్రకారం, కార్మికులు సంఘటితంగా తమ హక్కులను డిమాండ్‌ చేస్తే, దాన్ని సంఘటిత నేరంగా పరిగణించి, తీవ్రమైన జైలు శిక్షలు, పెనాల్టీలు విధించవచ్చు. ఇప్పటికే బీజేపీ పాలిత కొన్ని రాష్ట్రాలలో దీన్ని అమలు జరుపుతున్నారు. రైతాంగ హక్కులపై ప్రయోగించటానికి మూడు వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చారు. రైతు సంఘాల సుదీర్ఘ, సమరశీల పోరాటాల ఫలితంగా వాటిని రద్దుచేస్తున్నట్లు ప్రకటించారు. కానీ, తిరిగి ‘‘నేషనల్‌ పాలసీ ఫ్రేమ్‌ వర్క్‌ ఆన్‌ అగ్రికల్చరల్‌ మార్కె టింగ్‌’’ ‘‘నేషనల్‌ కో-ఆపరేటివ్‌ పాలసీ’’ లాంటి రైతాంగ వ్యతిరేక చట్టాలను తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు. పంటల గిట్టుబాటు ధరకు చట్టబద్ధ హామీకల్పించాలని రైతాంగం చేస్తున్న డిమాండ్‌ పట్ల తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారు. అందుకే రైతు సంఘాలు కూడా ఈ సమ్మెలో పాల్గొంటున్నాయి. ప్రభుత్వ ఈచర్యలన్నీ, గుప్పెడు మంది కార్పొరేట్ల ప్రయోజనాల కోసమే! ప్రజాస్వామ్య హక్కులన్నిటినీ బుల్డోజింగ్‌ చేయటం అందుకోసమే. మోదీ ప్రభుత్వం, కార్పొరేట్ల ప్రయోజనాలకోసం, ‘‘ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌’’ పేరుతో ‘‘జన్‌ విశ్వాస్‌’’ అనేచట్టాన్ని తీసుకు వచ్చింది. కార్మికచట్టాల ఉల్లంఘనలకు విధించే శిక్షల నుంచి, ఈ చట్టంద్వారా పారిశ్రామిక యాజమాన్యాలకు మినహాయింపునిచ్చారు. ఆ విధంగా, చట్టబద్ధ కార్మికహక్కులపై యధేచ్చగా, దాడికి పాల్పడేందుకు పారిశ్రామిక యాజమాన్యాలకు స్వేచ్ఛను ప్రసాదించారు. గతంలో 41చట్టాలకింద 180 చర్యలు చట్టప్రకారం నేరాలుగా పరిగణించేవారు. ఇప్పుడు వీటన్నిటిని ‘‘నేరం’’ అనే నిర్వచనం నుంచి తొలగించారు. ఇది చాలదన్నట్లు, ఇటీవల మరో100 నేరాలను ‘‘నేరం’’ నుంచి మినహా యించేందుకు చట్టసవరణలకు అనుమతించారు. ఆ విధంగా మార్పులకు గురైన చట్టాలలో అనేక కార్మిక చట్టాలతోపాటు, బాయిలర్‌ యాక్ట్‌, ఫారెస్ట్‌ యాక్ట్‌, తేయాకు తోటల చట్టం, తదితర చట్టాలు ఉన్నాయి. పునః రూపకల్పనపేరుతో, ‘‘శ్రమ్‌ సమాధాన్‌’’, ‘‘శ్రమ్‌ సువిధ’’ పోర్టల్సును నిర్వీర్యం చేస్తున్నారు. తద్వారా, ఫ్యాక్టరీలు, పరిశ్రమలు, ఇతర సంస్థలపై కార్మికశాఖ అధికారుల అజమాయిషి రద్దును పూర్తిగావిస్తున్నారు. కార్మికకోడ్ల అమలుకు ముందే ఈ చర్యలకు పాల్పడటం గమనార్హం. దీనితో యాజమాన్యాల దాష్టికం పరాకాష్టకు చేరటానికి మార్గం సుగమం చేశారు.
చట్టాల సంస్కరణలతోపాటు, అనేక భారాలువేసి, ప్రజల నుంచి కొల్లగొట్టి వసూలు చేస్తున్న పన్నుల నుంచి ఇటీవల కార్పొరేట్లకు మరికొన్ని ప్రోత్సాహకాలు ఇచ్చారు. ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకం క్రింద వస్తు తయారీరంగంలోనే 14 రకాల పరిశ్రమలకు రూ 1.97 లక్షలకోట్ల రూపాయలు, సెమీ కండక్టర్ల తయారీ రంగానికి క్యాపెక్స్‌ ప్రోత్సాహం క్రింద రూ76వేలకోట్లు, ఉపాధి ఆధారిత పరిశ్రమలకు 2లక్షల కోట్ల రూపాయల ప్రోత్సాహకాలు ప్రకటించారు. ఇటువంటి ప్రోత్సాహకాల వల్ల గత 2, 3 సంవత్సరాల కాలంలో ఉత్పత్తి, ఉపాధి అవకాశాలు మెరుగుపడిన అనుభవాలులేవు. పెట్టుబడులు గణనీయంగా పెరిగిన దాఖలాలు కూడా లేవు. కానీ ప్రభుత్వం మాత్రం ‘‘కార్మికుల్నికొట్టి’’ ‘‘కార్పొరేట్లకు పెడుతున్న’’ విధానాలను బరితెగించి అమలు చేస్తోంది. కార్మికులకు మాత్రం తీవ్రమైన శిక్షలు తప్ప ఎటువంటి ప్రోత్సాహకాలు ఉండవు. పాతపెన్షన్‌ విధానాన్ని (ఓపీిఎస్‌) తిరిగి ప్రవేశపెట్టాలని లక్షలాదిమంది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగులు, ఉపాధ్యాయులు డిమాండ్‌ చేస్తున్నారు. కానీ పాలకులు పట్టించుకోవటం లేదు. పైగా, యూనిఫైడ్‌ పెన్షన్‌ పథకాన్ని ప్రత్యామ్నాయంగా ముందుకు తీసుకొస్తున్నారు. ఎంప్లాయీస్‌ పెన్షన్‌ స్కీం (1995) క్రింద కనీస పెన్షన్‌ పెంచాలనీ, ఈ పథకాన్ని మెరుగుపరచాలని గత పది సంవత్సరాలుగా వస్తున్న డిమాండ్‌ను పట్టించు కోవడంలేదు. బడ్జెట్లో కేటాయింపులు తగ్గించివేస్తూ, గ్రామీణ ఉపాధిహామీ పథకానికి తూట్లు పొడుస్తున్నారు. కార్మికవర్గంపై ఫాసిస్ట్‌ తరహా, నిరంకుశ విధానాలకు పాల్పడుతున్న పాలక వర్గాల తీరును ప్రతిఘటించడం తప్ప కార్మిక వర్గానికి మరో మార్గం ఏముంది?

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు