. 15 శాతం వృద్ధి రేటు సాధనే ధ్యేయం
. ప్రతి శాఖ పనితీరులో పురోగతి స్పష్టంగా కనపడాలి
. ఆర్థిక అంశాలు తప్ప మిగతా ఫైళ్ల క్లియరెన్స్ వేగవంతం
. కేంద్ర నిధులు రాబట్టుకోవడంలో శ్రద్ధ చూపాలి
. మంత్రులు, కార్యదర్శులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : ముఖ్యమంత్రిగా మూడుసార్లు చూడనన్ని సవాళ్లు ఇప్పుడు చూస్తున్నామని, దెబ్బతిన్న వ్యవస్థలన్నింటినీ సరిచేసి పాలనలో వేగం పెంచి వృద్ధి రేటు లక్ష్యం సాధించేందుకు చిత్తశుద్ధి, కార్యదక్షతతో పనిచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. సచివాలయంలోని ఐదవ బ్లాక్లో మంత్రులు, వివిధ ప్రభుత్వ శాఖల కార్యదర్శులతో మంగళవారం సీఎం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఆయా శాఖల పనితీరు, ఫలితాలు, లక్ష్యాలు, ప్రణాళికలపై ముఖ్యమంత్రి ఉదయం నుంచి రాత్రి వరకు సమగ్రంగా, విస్తృతంగా చర్చించారు. కార్యదర్శులు శాఖల వారీ జరుగుతున్న ప్రగతిని పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించగా… వాటిల్లో చేర్పులు, మార్పులపై సీఎం దిశానిర్దేశం చేశారు. శాఖల పనితీరును మెరుగుపర్చుకోవాలని, ప్రతి సమావేశానికి పురోగతి స్పష్టంగా కనిపించాలని, అప్పుడే మనం లక్ష్యంగా పెట్టుకున్న 15 శాతం వృద్ధి రేటు సాధన సాధ్యపడుతుందన్నారు. కేంద్ర బడ్జెట్ను మంత్రులు, కార్యదర్శులు అధ్యయనం చేసి, ఆయా శాఖల వారు కేంద్రం నుంచి అధికంగా నిధులు రాబట్టుకోవడంపై దృష్టి పెట్టాలన్నారు. కేంద్ర బడ్జెట్లో ఆయా శాఖలు ఒక్కశాతం నిధులు తెచ్చుకోగలిగినా మార్పు చూపించవచ్చు. మార్చిలోపు అన్ని విభాగాలు శాఖలకు చేయాల్సిన ఖర్చులు చేయడంతో పాటు యూసీలు సమర్పించడం కీలక బాధ్యతగా పేర్కొన్నారు. ఉత్తమ పాలసీల రూపకల్పన, అమలు బాధ్యత మనదేనన్నారు. కూటమికి ఘన విజయం అందించిన ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. ప్రతి 3 నెలలకు ఒకసారి కలెక్టర్లతో సమావేశం పెడుతున్నాం. పాలసీలు తయారు చేస్తాం… వాటిని సక్రమంగా అమలు చేయాల్సిన పాలకులుగా మనపై బాధ్యత ఉందన్నారు. ఇతరులపై ఆధారపడితే కొత్త ఆలోచనలు రావు. నేను ప్రతి గంటా లెక్కిస్తున్నాను. 90 కేంద్ర ప్రాయోజిత పథకాలను గత ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. ఆ పథకాల అమలతో ఇచ్చిన నిధులను పక్కదారి పట్టించారని గుర్తు చేశారు.
15 శాతం వృద్ధి రేటు సాధనే లక్ష్యం
స్వర్ణాంధ్ర విజన్-2047ను మీ సహకారంతో విడుదల చేశాం. వికసిత్ భారత్ 2047 ద్వారా ఏం చేయబోతోందో కేంద్రం తెలియజేసింది. 2047 నాటికి రాష్ట్రం అగ్రభాగాన ఉండేందుకు చేపట్టాల్సిన కార్యక్రమాలను వివరిస్తూ మనం కూడా డాక్యుమెంట్ విడుదల చేశాం. 15 శాతం వృద్ధి రేటు లక్ష్యంగా పెట్టుకున్నాం. దానిని సాధించడమే ధ్యేయంగా పనిచేయాలని చంద్రబాబు అన్నారు. సమర్ధవంతమైన నాయకత్వంలో ప్రభుత్వం కొనసాగిత వృద్ధిరేటులో మార్పు ఉంటుంది. స్వర్ణాంధ్ర విజన్లో 10 ప్రధాన సూత్రాలతో ముందుకెళ్తున్నాం. టెక్నాలజీని విరివిగా ఉపయోగించుకోవాలి. ప్రతి కుటుంబాన్ని యూనిట్గా తీసుకుని ఇల్లు, నీళ్లు, గ్యాస్, టాయిలెట్, ఇంటిపై సోలార్ వంటి సదుపాయాలు కల్పించాలి. గ్రామాన్ని యూనిట్గా తీసుకుని వీధిలైట్లు, రోడ్లు, డ్రైనేజ్, చెత్త సేకరణ చేసి హెల్తీ, వెల్తీ, హ్యాపీ సొసైటీ లక్ష్యంగా ముందుకెళ్తున్నాం. అయినప్పటికీ గత పాలన విధ్వంసం వల్ల రెవెన్యూ పెరగడం లేదు. రాష్ట్రంలో ఇండస్ట్రియల్ గ్రోత్ రేట్ మైనస్ 2.94గా ఉంది. ప్రతి సమస్య పరిష్కారానికి పాతపద్ధతుల్లో కాకుండా ఇన్నోవేటివ్గా ఆలోచించాలి. ప్రతి ఒక్కరూ నిత్యం నేర్చుకోవడం అవసరమని సీఎం ఉద్బోధించారు.
దస్త్రాల పరిష్కారంలో వేగం పెరగాలి
దస్త్రాల పరిష్కారంలో కొందరు 6 నెలలకు పైగా సమయం తీసుకుంటున్నారని, ఇది ఏ విధంగా సమర్ధనీయం కాదని సీఎం స్పష్టం చేశారు. ఆర్థిక అంశాలకు సంబంధించిన ఫైల్స్ మినహా మిగిలిన వాటికి సంబంధించిన దస్త్రాల పరిష్కారంలో వేగం పెంచాలన్నారు. ఇటీవల విడుదల చేసిన ఫైళ్ల క్లియరెన్స్ స్థానాలు వ్యక్తులను ఎత్తి చూపడానికి కాదు…మరింత సమర్ధవంతంగా పని చేసేందుకు ఈ ర్యాంకులు విడుదల చేశామని తెలిపారు. కేంద్ర బడ్జెట్లో వ్యవసాయానికి ప్రాధాన్యం ఇచ్చింది. ఆ అవకాశాలను మనం అందిపుచ్చుకోవాలి. ప్రపంచంలో చోటుచేసుకుంటున్న మార్పుల కారణంగా రైతులు కూడా సాగు పద్ధతులు మార్చుకుంటున్నారు. ఆక్వా, హార్టికల్చర్, పామాయిల్, కాఫీ వంటి వాణిజ్య పంటల సాగులో ముందుకెళ్తున్న వారికి ప్రోత్సాహకాలు అందించాలి. ఏఐ, టెక్నాలజీని అన్ని శాఖలు అనుసంధానం చేసుకోవాలి. 1995లో ఐటీని ఉపయోగించుకున్నాం. ఇప్పుడు ఏఐని అందిపుచ్చుకోవాలని సూచించారు.
1995 నుంచి 2024 వరకు ఉన్న సమాచారాన్ని తీసుకుంటే…నాటి ఆలోచనా విధానం, అమలైన పాలసీలతోనే మెరుగై ఫలితాలు వచ్చాయి. రాబోయే రోజుల్లో భావితరాలు గుర్తించుకునేలా మన పాలసీలు, అమలు విధానం ఉండాలి. ఈ యేడాది మీ శాఖల్లో ఏం చేయబోతున్నారనేది ముందుగానే నిర్ధేశించుకోవాలి. ప్రజల ఆకాంక్షలు నెరవేరేలా ప్రతి శాఖ పనిచేయాలి. గ్రామ, మండల స్థాయిలో కూడా ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నాం. నా నుంచి గ్రామస్థాయి నాయకుడి వరకు, సీఎస్ నుంచి గ్రామ సచివాలయ సిబ్బంది వరకూ ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా పని చేయాలి. తెలుగుజాతి నెంబర్ వన్ కావాలన్నది నాతో పాటు డిప్యూటీ సీఎం పవన్, ఎన్డీయే ఆలోచన. మాటలు చెప్పి ప్రజలను ఏమార్చే పాలకులు కనుమరుగువతున్నారు.