. రాబోయే 40 ఏళ్లకు కార్యాచరణ సిద్ధం చేశాం
. ప్రభుత్వమంటే పాలకులు కాదు, సేవకులని చాటిచెప్పిన ఎన్టీఆర్
. కార్యకర్తలే పార్టీకి సుప్రీం, వారి సంక్షేమం నా బాధ్యత
. నేరస్థులతో రాజకీయం చేస్తున్నాం… అనుక్షణం అప్రమత్తంగా ఉండాలి
. మహానాడులో చంద్రబాబు
విశాలాంధ్ర బ్యూరో – కడప : మహానాడులో ప్రవేశపెట్టిన ఆరు శాసనాల ద్వారా తెలుగు జాతిని 2047 నాటికి ప్రపంచంలో నంబర్ 1 చేయాలనే ఏకైక సంకల్పంతో ముందుకు వెళుతున్నామని టీడీపీ జాతీయ అధ్యక్షులు, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఇందుకోసం రాబోయే 40 ఏళ్లకు కార్యాచరణ సిద్ధం చేసుకున్నామని చెప్పారు. ఎన్టీఆర్ అంటే మూడు అక్షరాలు కాదని, తెలుగువారి ఆత్మగౌరవం, పేదవారి గుండెల్లో తీపి జ్ఞాపకమని అన్నారు. పేదరికం లేని సమాజం టీడీపీతోనే సాధ్యమని స్పష్టం చేశారు. ఎన్టీఆర్ 102వ జయంతి సందర్భంగా రెండవ రోజు బుధవారం మహానాడులో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి చంద్రబాబు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ ఆశయ సాధనకు కృషి చేద్దామని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. అనంతరం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తొలిరోజు మహానాడులో ప్రవేశపెట్టిన ఆరు శాసనాలపై చంద్రబాబు ప్రసంగించారు. మళ్లీ జన్మంటూ ఉంటే తెలుగు జాతి కోసం ఇదే గడ్డపై పుట్టి రుణం తీర్చుకుంటానని అన్నారు. కార్యకర్తే పార్టీకి అధినేత, సుప్రీం అని, వారి సంక్షేమం బాధ్యత తనదని అభయమిచ్చారు. నేరస్థులతో మనం రాజకీయం చేస్తున్నామని, అనుక్షణం ప్రమత్తంగా ఉండాలని పార్టీ శ్రేణులను హెచ్చరించారు. ఎవరైనా మహిళల జోలికొస్తే అదే వారికి చివరిరోజు అవుతుందని స్పష్టం చేశారు.
పాతతరం విలువలు, కొత్తతరం ఆలోచనలే 6 శాసనాలు
నందమూరి తారక రామారావు ‘సమాజమే దేవాలయం… ప్రజలే దేవుళ్లు’ అనే నినాదంతో పార్టీ పెట్టారని చంద్రబాబు అన్నారు. ఆ మూల సిద్దాంతం నుంచి స్ఫూర్తితో మారుతున్న కాలానికి అనుగుణంగా పార్టీలో, పాలనా విధానాల్లో నూతనత్వం కోసం 6 శాసనాలను మహానాడు సభలో చర్చించుకుంటున్నాం. పాత తరం విలువలు… కొత్త తరం ఆలోచనలు… అవసరాలకు కలిపి నా తెలుగు కుటుంబం పేరుతో 6 శాసనాలను ప్రతిపాదించాం. తెలుగు జాతిని ప్రపంచంలో నంబర్ 1 చేయడానికి కార్యాచరణే ఈ ఆరు శాసనాలు. ‘నాలెడ్జ్, టెక్నాలజీ, డాటాతో ఎంటర్ ప్రెన్యువర్ షిప్ కలిగిన యువత ప్రపంచ విజయాలను సాధిస్తుందనేది నా నమ్మకం. దీనికి అవసరమైన గ్రౌండ్ ప్రిపేర్ చేస్తాం. నా తెలుగు జాతిని ప్రపంచంలో నంబర్ 1 చేస్తాం’ అని అన్నారు. ఇది నా సంకల్పం, లక్ష్యమని చంద్రబాబు స్పష్టం చేశారు.
కార్యకర్తే సుప్రీం
రాజకీయ, పాలనా అంశాల్లో స్టేట్ ఫస్ట్. పార్టీ విషయంలో కార్యకర్తే ఫస్ట్. కార్యకర్తే అధినేత. నాకు మీరే హైకమాండ్. మీరే సుప్రీం. ఇది నా సిద్ధాంతమని చంద్రబాబు తెలిపారు. ఒక ప్రాంతీయ పార్టీగా పుట్టిన టీడీపీలో సభ్యత్వాల సంఖ్య నేడు కోటికి చేరింది. ఇదీ మన బలం. తొలి సారి అసెంబ్లీకి వచ్చిన వాళ్లు మన పార్టీ నుంచి 61 (65 మందికి టికెట్లు) మంది ఉన్నారు. యువతకు అవకాశం ఇచ్చాం. నూతన నాయకత్వాన్ని తెచ్చాం. ఎన్టీఆర్ ఇచ్చిన వారసత్వాన్ని కాపాడి… మళ్లీ భవిష్యత్ నాయకత్వాన్ని సిద్దం చేస్తున్నాను. పార్టీ చిరస్థాయిగా ఉండాలి. తెలుగు కుటుంబం నంబర్ 1 కావాలి. అది జరగాలంటే లోకేశ్ ప్రతిపాదించిన 6 శాసనాల్లో కార్యకర్తే అధినేత అనేది చాలా కీలక అంశమన్నారు. మన పార్టీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టడానికి ప్రత్యర్ధి పార్టీ అనేక పన్నాగాలు పన్నుతోంది. తెలుగుదేశం ముసుగేసుకుని తప్పులు చేస్తే వారిని ఏం చేయాలో అది చేస్తామని హెచ్చరించారు.
స్త్రీ శక్తి గేమ్ ఛేంజర్
స్త్రీ శక్తి గేమ్ ఛేంజర్ అవుతుంది. ఆడబిడ్డలను గుర్తించి గౌరవించింది ఎన్టీఆర్. వారికి సాధికారత కల్పించి బలోపేతం చేశాం. అనేక పథకాలు అమలు చేశామని చంద్రబాబు అన్నారు. ఆడబిడ్డ పుడితే భారం అని భావించే రోజుల నుంచి ఆడపిల్ల పుడితే మహాలక్ష్మి పుట్టిందనే భావన కల్పించేలా సమాజంలో మార్పులు తెచ్చాం. దీనికి మన విధానాలే కారణమన్నారు. రాజకీయ, సోషల్ మీడియా ముసుగులో మహిళల వ్యక్తిత్వాన్ని కించపరిస్తే వదిలేది లేదు. చాలా కఠిన చర్యలు ఉంటాయి. లక్ష మంది డ్వాక్రా మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతున్నాం. జూన్ 12న తల్లికి వందనం కింద రూ.15 వేల చొప్పున ఇస్తాం. ఆగస్టు 15 నుంచి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణంతో పాటు చెప్పిన అన్ని హామీలు అమలు చేస్తాం. రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా మగవారితో సమానంగా మహిళలు ఉండాలన్నదే నా సంకల్పమని చంద్రబాబు స్పష్టం చేశారు.
అన్నదాతకు అండగా…
తెలుగు రైతుకు గుర్తింపు తెచ్చేలా అగ్రిటెక్ పాలసీని అమలు చేస్తున్నామని చంద్రబాబు చెప్పారు. ఉత్తరాంధ్రలో, ఏజెన్సీలో గిరిజన ఉత్పత్తులు, కాఫీ, కోస్తాలో ఆక్వా, రాయలసీమలో హార్టికల్చర్తో రైతుల జీవితాలు మారుస్తాం. ఉత్తరాంధ్ర ప్రాజెక్టులు, పోలవరం పూర్తిచేస్తాం. సీమలో ఉన్న ప్రాజెక్టులన్నింటినీ పూర్తిచేయడమే కాదు… పోలవరం`బనకచర్ల మొదలు పెట్టి కొత్తచరిత్రకు నాంది పలుకుతాం. ప్రకృతి సేద్యంపై భారీ లక్ష్యాలు పెట్టుకున్నాం. వీటిని చేరుకుంటే తిరుగుండదు. జూన్ 12న ప్రతి రైతుకు అన్నదాత పథకం ఏడాదికి రూ.20 వేలు అందించబోతున్నామని చెప్పారు.
యువకులకు అవకాశం
యువశక్తి మనబలం. వారికి అవకాశాలు కల్పిస్తే అద్భుతాలు సృష్టిస్తారు. దీనికి అనుగుణంగానే యువశక్తికి ప్రాధాన్యమిస్తూ, యువగళం దశ దిశలా మార్మోగేలా చేయాలనేది టీడీపీ సంకల్పం తీసుకుందని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చెప్పారు. మనది పాజిటివ్ పాలిటిక్స్ చేసే పార్టీ. దూసుకెళ్లే యువతరానికి మార్గనిర్దేశం చేసి… వారి ద్వారానే భవిష్యత్లో మంచి సమాజాన్ని నిర్మించాలనేది నా ఆలోచన. నాలెడ్జ్ ఎకానమీలో ఏపీని గ్లోబల్ సర్వీసెస్కు హబ్గా మారుస్తాం. క్రియేటివ్ ఎకానమీకి రెండు సిటీలను ఎంపిక చేస్తే ఒకటి అమరావతి, రెండోది ముంబై. 20 లక్షల మంది యువతకు ఉపాధి, ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చాం. ఇప్పటికే రూ.4.95 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు చేసుకున్నామని చంద్రబాబు వివరించారు.
లోకేశ్కు అభినందనలు
ఆరు శాసనాలు ప్రవేశపెట్టిన మంత్రి లోకేశ్ను మనస్పూర్తిగా అభినందిస్తున్నట్లు చంద్రబాబు నాయుడు చెప్పారు. సాధారణంగా జరిగే మహానాడును నూతనంగా ముందుకు తీసుకెళ్లేందుకు ఆయన శాసనాలు ప్రవేశపెట్టారు. లోకేశ్ బాగా చదువుకున్నారు. టెక్నాలజీని ఉపయోగిస్తూ నూతన విధానానికి శ్రీకారం చుట్టారు. 45 రోజుల్లో కోటి మందికి పైగా సభ్యత్వాలు ఒక్క టీడీపీకే సాధ్యమైందని లోకేశ్ను కొనియాడారు. మహానాడులో కేంద్ర మంత్రులు కింజరాపు రామ్మోహన్నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర మంత్రులు రామానాయుడు, గొట్టిపాటి రవికుమార్, బీసీ జనార్దన రెడ్డి, పార్టీ సీనియర్ నేతలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, వివిధ కార్పొరేషన్ చైర్మన్లు ప్రసంగించారు.