Friday, June 6, 2025
Homeవిశ్లేషణదేవుడు అందరి వాడేనా?

దేవుడు అందరి వాడేనా?

దేవుడు అందరివాడా లేక కొందరివాడ. అందరి వాడయితే సమాజంలో అసమానతలు ఎందుకుంటాయి. ఇక నుంచి నేను దేవుణ్ణి నమ్మను బావ. రావయ్యా రోడ్డు మీదే మొదలుపెట్టావేంటి ఈరోజు. మొదలుపెట్టక ఏం చెయ్యాలయ్యా. ఉన్నవాడు లేనివాడు ప్రతి మనిషి దేవుణ్ణి నమ్ముతున్నాడు. కాని ఒక మనిషి చేతిలో మరో మనిషి మోసపోతున్నాడు. కాని ఆ యిద్దరూ దేవుణ్ణి నమ్ముతున్నారు. పూజలు చేస్తున్నారు. అపుడప్పుడు తిరుపతి వెళ్లి తలనీలాలు ఇచ్చి, ముకుళిత హస్తాలతో మొక్కి వారి స్థాయికి తగినట్టు హుండీలో కొంత నగదో, బంగారమో వేసి వస్తున్నారు. కాని వారిద్దరు బతుకుల్లో మాత్రం మార్పు రావడం లేదు. ఉన్నవాడు మరింత సంపాదిస్తే లేనివాడు మరింత దారిద్య్రానికి దగ్గరవుతున్నాడు. నిజమేనయ్యా అసలు దేవుడంటే ఆయన సర్వాంతర్యామి. అణువణువున ఉంటాడు. ప్రహ్లాదుడన్నట్లు ఇందుకలడందు లేడని సందేహం అవసరం లేదు. ప్రతి ఇంట్లో ప్రతి మనిషిలో ఉన్నాడు. నమ్మిన వారికి ప్రతిచోట ఉంటాడు. ఎవరింట్లో వారు ధ్యానించుకోవచ్చు. ఒక్క తిరుమల కొండపైనే ఉండడు. అయినా ప్రతి పట్టణంలో ప్రతి గ్రామంలో దేవాలయాలు ఉన్నాయి కదా. పేదలు అప్పుచేసి తిరుపతి వెళ్లడం అప్పుతీర్చలేక బాధలు పడడం దేనికో అర్థం కాదు.
మోసం చేసి సంపాదించే వాడు దేవుని హుండీలో సంపాదించిన దాంట్లో కొంత నగదు వేసి తృప్తి పడతాడు. లేనివాడు ఇక నుంచైనా కష్టాల నుంచి గట్టెక్కించమని కోరుతాడు. కాని ఉన్నవారి కోరికలు తీర్చి మరింత సంపాదించే మార్గం చూపెడతాడు గాని లేనివాడి బతుకులో మార్పు రావడం లేదు. అందుకేనయ్యా దేవుడు అందరివాడు కాదు కొందరివాడే అంటున్నా. అసలు దేవుడు అనే పదం తప్పయ్యా. నిరాకారుడు, నిర్గుణుడు, నిర్వికల్పుడు అన్నారు. అంటే దేముడికి పక్కాగా ఒక ఆకారమంటూ లేదు. ఎవరు ఎలా ఊహించుకుంటే అలా కనపడతాడు. అలాగె నిర్గుణుడు. అంటే ఒకే గుణంతో ఉండడు. అంటే ఆస్తికులు భక్తుల రక్షణ కోసం దశావతారాలుగా మారాడంటారు. ఇకపోతే నిర్వికల్పుడు. అంటే ఆయనకు కోరికలు కల్పన ఉండవని భక్తుల అవసరార్థం కల్పనలు మారతాయని అవి తీర్చటమే ఆయన పని.
అది సరేనయ్యా ఆయన ఏ ఆకారంలో ఉంటే నాకెందుకుగాని దేవుడు అసలు లేడని అంటాను. ఒకవేళ ఉంటే ఆయన ఉన్నవారి వాడే గాని అందరివాడు కాదంటానే. అందరి వాడయితే నాకు ఈ దరిద్రం ఎందుకు చెప్పు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా వారికి అమ్ముడు పోతున్నాడు తప్ప పేదలకు అన్యాయం చేసే ప్రభుత్వంలో మార్పు తెచ్చే పని చేయడం లేదు. సంవత్సరాలు గడుస్తున్నా పేదల బతుకుల్లో మార్పు రాదు. అలాంటపుడు అందరి వాడని ఎలా చెబుతాం. ఖచ్చితంగా ఆయన కొందరివాడే.
అది కాదయ్యా ఏకాగ్రతతో దేవున్ని పూజించడానికో, దర్శించుకోవ డానికో నిశ్శబ్ద వాతావరణంలో నదీతీరానో, కొండల పైనో దేవాలయాలు నిర్మించేవారు. ప్రస్తుతం నాలుగు రోడ్ల జంక్షన్లో, ట్రాఫిక్‌ ఎక్కువగా ఉన్న చోట్ల కూడ నిర్మాణం చేస్తున్నారు. ట్రాఫ్రిక్‌కు అంతరాయం కలగడంతో పాటు యాక్సిడెంట్లు జరిగినా దేవాలయం కాబట్టి దాన్ని తొలగించరు. అసలు నిర్మాణం జరిగేటప్పుడే ఆపవచ్చు. కాని ఆ పని చేయరు. దేవుడంటే అందరికీ భయమే ఒక్క నాస్తికులకు తప్ప. నిత్యం సమాజంలో జరిగే మంచి చెడులు చూడటం వరకే భగవంతుని పని అంటారు. సమాజంలో ఉన్న చెడ్డవారికి మరు జన్మలో మానవ జన్మ ఇవ్వకుండా తగిన ఫలితం అనుభవిస్తాడని వేదాంతుల ఉవాచ. అసలు మరు జన్మలేదని, మానవ జన్మ చివరిదని, జంతువులుగానో, క్రిమికీటకాదు లుగానో పుట్టి న తరువాత ఏవరికీ హాని చేయకపోతే మానవ జన్మ లభిస్తుందని కూడ చెబుతారు. మరణాల కంటే జననాలు ఎక్కువగా ఉన్నప్పుడు పునర్‌జన్మ ఉందని ఎలా చెప్పగలం. కనుక మనిషికి మరుజన్మ లేదనే సంగతి శంకరుడు కూడా అంగీకరించి అద్వైతగా మారాడు. ఏదిఏమైనా మరు జన్మలేదని ఉన్నది మనిషికి ఒక జన్మేనని మంచి చెడులకు అన్నింటికి ప్రస్తుతమున్న మనిషే కారకుడని నాస్తికులంటారు. ఈ జన్మలో బాధలు అనుభవించి మంచి పనులు చేసి ఇతరులకు ఉపయోగ పడితే మరుజన్మలో జంతువులగానో, క్రిమి కీటకాదులుగానో పుట్టకుండా మానవ జన్మ లభిస్తుందనిఅధ్యాత్మిక వాదుల చెప్పేవన్ని బూటకమని నాస్తికులంటారు. పునర్జన్మ లేదని ఆదిశంకరుడే చెప్పినపుడు ప్రస్తుతం ఆధ్యాత్మిక వాదులు ఉండరని చెప్పడం ప్రజలను మభ్యపెట్టడమేనని హేతువాదులంటారు.
అసలు సమాజంలో మనుగడ సాగించడం దానికి కులం, మతం, దేవునితో పనిలేదు. అయితే నిత్యం జరిగే ప్రతి చర్యకు మనిషే కారణం. మంచి జరిగినా చెడు జరిగినా అది మనిషి వలనే. అయితే కొందరిలో ఒక పని చేసేటప్పుడు అవుతుందో లేదో అనే సందేహం భయం కలుగుతుంది. అప్పుడే దేవుడు గుర్తుకొస్తాడు, మనిషికి అతీతమైన శక్తి ఏదో ఒకటి ఉందని భయం పోగొట్టుకోవడానికి దేవున్ని తలచుకోవడం సహజంగా జరిగిపోతోంది. నిజానికి మనిషి భ్రమల్లో బతుకుతున్నాడు. అలాకాక మనిషి తనకు ఇతరంగా ఏమీలేదని ప్రతి చర్యకు తానే కారణమని నమ్మిననాడు ఆ భ్రమల నుంచి బయటపడి ముందుకు సాగగలడు. భయంలో పుట్టి భ్రమల్లో సాగుతున్న దేవుడు వాస్తవ జగత్తులో సమాజానికి అవసరం లేదు. మంచి చెడుకు మనిషే కారణమని మానవుడు ముందుకు సాగడం అవశ్యంగా భావించాలి. అందుకే దేవుడు అందరివాడా, కొందరివాడా అనే మీమాంసకు స్వస్తి పలికి ఉన్నాడని అన్నా లేడని అనేది మనిషే కనుక సమాజానికి కేంద్ర బిందువు మనిషేనని గుర్తించాలి..
సెల్‌: 9885569394

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు