Monday, June 9, 2025
Homeఆంధ్రప్రదేశ్పది సూత్రాలతో స్వర్ణాంధ్ర-2047

పది సూత్రాలతో స్వర్ణాంధ్ర-2047

. జిల్లా, నియోజకవర్గ కేంద్రాల్లో కార్యాలయాలు
. ఎమ్మెల్యే అధ్యక్షుడిగా యాక్షన్‌ ప్లాన్‌ యూనిట్‌
. ఒక్కో కార్యాలయ నిర్వహణకు రూ.10 లక్షలు
. 175 నియోజకవర్గాల్లో విజన్‌ యాక్షన్‌ ప్లాన్‌ యూనిట్లు
. వర్చువల్‌గా ప్రారంభించిన సీఎం చంద్రబాబు

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి:జిల్లా, నియోజకవర్గాల విజన్‌ యాక్షన్‌ ప్లాన్‌ యూనిట్‌ కార్యాలయాల ఏర్పాటుతో స్వర్ణాంధ్ర-2047 విజన్‌ సాకారానికి శ్రీకారం చుట్టామని ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. పేదరికం లేని సమాజం, ఉద్యోగ కల్పన, నైపుణ్యం-మానవ వనరుల అభివృద్ధి, నీటి భద్రత, వ్యవసాయ సాంకేతికత, అంతర్జాతీయ స్థాయి లాజిస్టిక్స్‌, ఇంధన వనరుల సమర్థ వినియోగం, నాణ్యమైన ఉత్పత్తులు-బ్రాండిరగ్‌, స్వచ్ఛాంధ్ర, డీప్‌ టెక్‌..ఇలా 10 ప్రధాన సూత్రాలతో కార్యాచరణ నిర్దేశించుకున్నామని ముఖ్యమంత్రి చెప్పారు. సోమవారం సచివాలయం నుంచి రాష్ట్రంలోని 26 జిల్లాలు, 175 నియోజకవర్గాల్లో విజన్‌ యాక్షన్‌ ప్లాన్‌ యూనిట్‌ కార్యాలయాల్ని వర్చువల్‌గా ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. వీడియా కాన్ఫరెన్స్‌ ద్వారా విజన్‌ అమలుపై దిశానిర్దేశం చేశారు. నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యేలకు ఇప్పటివరకు ప్రభుత్వ కార్యాలయం లేదని, ఇప్పుడు విజన్‌ యాక్షన్‌ ప్లాన్‌ యూనిట్ల ఏర్పాటుతో ఆ లోటు తీరిందని సీఎం అన్నారు. కార్యాలయం ఏర్పాటుతో పాటు 9 మందితో టీమ్‌ కూడా ఇస్తున్నామని, ఇక విజన్‌ అమలును తర్వాత స్థాయికి తీసుకువెళ్లాల్సింది మీరేనని ఎంపీలు, ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్లు, అధికారులను ఉద్దేశించి ముఖ్యమంత్రి అన్నారు. ఎమ్మెల్యేలకు ఇది ఒకమంచి అవకాశమని, దీనిని సద్వినియోగం చేసుకోవాలని, ప్రజల్ని భాగస్వాముల్ని చేయాల్సిందిగా సూచించారు. జిల్లా, నియోజకవర్గంలో విజన్‌ యాక్షన్‌ ప్లాన్‌ యూనిట్‌ కార్యాల యాలు పూర్తిస్థాయిలో పనిచేస్తాయని, ఒక్కో కార్యాలయ నిర్వహణకు రూ.10 లక్షలు అందిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. ‘నియోజకవర్గ యాక్షన్‌ ప్లాన్‌ యూనిట్‌కు ఎమ్మెల్యే అధ్యక్షుడిగా ఉంటారు. నియోజకవర్గ స్పెషల్‌ ఆఫీసర్‌ కార్యనిర్వహణ ఉపాధ్యక్షులుగా వ్యవహరిస్తారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ, మున్సిపాలిటీ / నగర పంచాయతీ ఛైర్మన్‌, ఆర్డీఓ/సబ్‌ కలెక్టర్‌, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, మున్సిపల్‌ కమిషనర్లు సభ్యులుగా ఉంటారు. నియోజకవర్గ కేంద్రానికి చెందిన ఎంపీడీవో కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. ఎమ్మెల్యే, జిల్లా నోడల్‌ ఆఫీసర్‌ , అకడెమిషియన్‌ , యువ ప్రొఫెషనల్‌ , విజన్‌ స్టాఫ్‌ 5… ఇలా 9 మంది టీమ్‌తో పనిచేస్తారని సీఎం తెలిపారు. అన్ని జిల్లాలు సమానంగా అభివృద్ధి చేస్తామని, ఇప్పటికే వాట్సప్‌ గవర్నన్స్‌ ద్వారా 400కి పైగా ప్రభుత్వ సేవలు అందిస్తున్నామని తెలిపారు.
ఆగస్ట్‌ 15 కల్లా 15 లక్షల బంగారు కుటుంబాల దత్తత
ప్రతి నియోజకవర్గంలో ఎంఎస్‌ఎంఈ పార్కు, అలాగే అమరావతిలో రతన్‌ టాటా హబ్‌లు ఏర్పాటు చేస్తున్నాం. సేవల రంగంపై ఎక్కువ దృష్టి పెడుతున్నాం. ఆదాయం పెరిగితే మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయగలం. టెక్నాలజీని అనుసంధానం చేస్తున్నాం. మానవతా దృక్పధంతో పరిపాలన సాగాలి. తల్లికివందనం ఈ నెలలో ప్రారంభిస్తున్నాం. ఆగస్ట్‌ 15న ఫ్రీ బస్‌ ఇస్తాం. జీరోపావర్టీ-పీ4 కార్యక్రమం కింద ఆగస్ట్‌ 15 కల్లా 15 లక్షల బంగారు కుటుంబాలను… మార్గదర్శులు దత్తత తీసుకునేలా ప్రయత్నం చేస్తున్నాం. ఇందులో రిఫరల్‌ విధానం తీసుకొచ్చి ఎక్కువ మంది మార్గదర్శులను పరిచయం చేసే అధికారులకు అవార్డులు ఇస్తామని తెలిపారు.
డయాఫ్రమ్‌ కాపాడకపోవడం వల్లే పోలవరం ఆలస్యం
‘గత ప్రభుత్వంలో డయాఫ్రమ్‌ వాల్‌ పరిరక్షించి ఉంటే పోలవరం ఎప్పుడో పూర్తయ్యేది. అయినా 2027 కల్లా పూర్తిచేస్తాం. అమరావతిని 2028 నాటికి నిర్మిస్తాం. విశాఖను ముంబైలా తీర్చిదిద్దేలా ప్రయత్నిస్తున్నాం. 2026కి భోగాపురం విమానశ్రయం సాకారం అవుతుంది. పోలవరం-బనకచర్ల అనుసంధానం, విశాఖ-విజయవాడలో మెట్రోరైళ్లు, విశాఖ రైల్వే జోన్‌, పోర్టులు, ఫిషింగ్‌ హార్బర్ల నిర్మాణం సాధ్యమైనంత త్వరగా పూర్తి చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. విజన్‌ యాక్షన్‌ ప్లాన్‌ యూనిట్‌ కార్యాలయాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్రమంత్రి రామ్మోహన్‌ నాయుడు… జీరో పావర్టీ పీ4 కార్యక్రమం కింద 10 బంగారు కుటుంబాలను దత్తత తీసుకుంటానని తెలియజేయగా, చంద్రబాబు ఆయనను అభినందించారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు