విచారణ కమిషన్ ప్రశ్నలన్నింటికీ సమాధానమిచ్చా: హరీశ్రావు
విశాలాంధ్ర-హైదరాబాద్: మహారాష్ట్ర, సీడబ్ల్యూసీ అభ్యంతరాల వల్లే కాళేశ్వరం రీ డిజైన్ చేశామని బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్రావు విచారణ కమిషన్కు వివరించారు. కాళేశ్వరం కమిషన్ ఎదుట సోమవారం హరీశ్రావు విచారణ ముగిసింది. 40 నిమిషాలకుపైగా ఆయన్ను జస్టిస్ పీసీ ఘోష్ ప్రశ్నించారు. ప్రాజెక్టు రీడిజైనింగ్కు కారణాలను హరీశ్రావు వివరించారు. కాళేశ్వరం ప్రాజెక్టు లేఅవుట్ను చూపించి వివరణ ఇచ్చారు. మహారాష్ట్ర, సీడబ్ల్యూసీ అభ్యంతరాల వల్లే రీడిజైనింగ్ చేసినట్లు చెప్పారు. తమ్మిడిహట్టి వద్ద నీటి లభ్యత సమస్య వల్ల రీడిజైనింగ్ చేసినట్లు తెలిపారు. వాస్కోప్ ద్వారా సర్వే చేయించిన తర్వాతే ప్రాజెక్టు స్థలం మార్చినట్లు కమిషన్కు తెలిపారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలపై జస్టిస్ పీసీ ఘోష్ ప్రశ్నించగా… అన్ని ఆనకట్టల నిర్మాణానికి మంత్రివర్గ ఆమోదం ఉందని హరీశ్రావు తెలిపారు. ఇంజినీర్ల సూచన మేరకే అన్నారం, సుందిళ్ల బ్యారేజీల మార్పు జరిగిందన్నారు. స్థలాల మార్పు గతంలోనూ కొన్ని ప్రాజెక్టుల విషయంలో జరిగిందని గుర్తు చేశారు. మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లికి నేరుగా నీరు తరలించవద్దని విశ్రాంత ఇంజినీర్లు చెప్పారని, వారి సూచన మేరకే స్థలం మార్చినట్లు తెలిపారు. ప్రాజెక్టుకు రుణ సేకరణ కోసమే కాళేశ్వరం కార్పొరేషన్ ఏర్పాటు చేశామని, మంత్రి వర్గ ఆమోదం, ప్రభుత్వ గ్యారెంటీతోనే కార్పొరేషన్ ఏర్పాటు జరిగిందని కమిషన్కు వివరించారు. కేంద్రప్రభుత్వ సంస్థలు, బ్యాంకుల నుంచే రుణాలు తీసుకున్నట్లు తెలిపారు. కార్పొరేషన్ నుంచి కాకుండా బడ్జెట్ నుంచి నిధులు ఎందుకు కేటాయించారని పీసీ ఘోష్ ప్రశ్నించారు. జలాశయాల నుంచి ఎత్తిపోసిన నీటి వివరాలను అడిగారు. ఆనకట్టల్లో నీరు నిల్వ చేయాలని ఎవరు ఆదేశించారని ప్రశ్నించగా… ప్రాజెక్టుల్లో నీటి నిల్వ ఇంజినీర్లు చూసుకునే అంశమని చెప్పారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని హరీశ్రావు వివరించారు. ‘కమిషన్ అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానమిచ్చా. అన్ని ఆధారాలు సమర్పించా. తమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు ఎందుకు మార్చారని ప్రశ్నించారు. తమ్మిడిహట్టి వద్దే కట్టడానికి అన్ని ప్రయత్నాలు చేశామని చెప్పాను. దీనిపై అనాడే అప్పటి మహారాష్ట్ర కాంగ్రెస్ మంత్రిని కోరాం. మీకు మీరుగా నిర్ణయించుకొని పనులు ప్రారంభిస్తే ఖర్చు వృథాగా మారే అవకాశం ఉందని చెప్పారు. తెలంగాణ, మహారాష్ట్ర మధ్య ఐదారు సమావేశాలు జరిగాయి. కేసీఆరే స్వయంగా మహారాష్ట్ర వెళ్లి సీఎం ఫడ్నవీస్కు చెప్పే ప్రయత్నం చేశారని హరీశ్రావు తెలిపారు. మహారాష్ట్రలో కాంగ్రెస్ ప్రభుత్వం పోయి… బీజేపీ ప్రభుత్వం వస్తే… మళ్లీ సంప్రదించాం. తమ్మిడిహట్టి వద్ద అనుమతించాలని… ఎంత నష్టపరిహారమైనా ఇస్తామని స్పష్టంగా చెప్పాం. ఏడేళ్లు కాంగ్రెస్ ప్రభుత్వం ఒప్పుకోనప్పుడు మేమెలా ఒప్పుకుంటామని మహారాష్ట్ర సీఎం చెప్పారు. ఏడేళ్లు మహారాష్ట్ర, దిల్లీ, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా తమ్మిడి హట్టి వద్ద బ్యారేజ్ ఒప్పించడంతో తీవ్రంగా విఫలమయ్యారు. ఈ సమయంలోనే తమ్మిడిహట్టి వద్ద నీళ్లు లేవని సెంట్రల్ వాటర్ కమిషన్ రెండు లేఖలు రాసింది. నీటి లభ్యత తక్కువ ఉందని… ప్రత్యామ్నాయం చూసుకోవాలని లేఖలో పేర్కొంది. అందుకే ప్రాజెక్టు రీ డిజైన్ చేయాల్సి వచ్చింది. సీడబ్ల్యూసీ నుంచి వచ్చిన మూడు లేఖలు కమిషన్కు ఇచ్చాం అని హరీశ్రావు అన్నారు.
న్యాయ వ్యవస్థపై గౌరవం ఉంది
తొలుత హరీశ్రావు కాళేశ్వరం కమిషన్ విచారణకు తెలంగాణ భవన్ నుంచి బీఆర్కే భవన్కు భారీ కాన్వాయ్తో వెళ్లారు. బీఆర్ఎస్ లీగల్ టీమ్ కూడా అక్కడకు చేరుకుంది. ఓపెన్ కోర్టులో కూర్చున్న సమయంలో పోలీసులు వారి వద్దకు వెళ్లి.. ఇక్కడ అనుమతి లేదని, బయటకు వెళ్లాలని సూచించారు. లీగల్ టీమ్ స్పందిస్తూ.. ఓపెన్ కోర్టులో ఎవరైనా ఉండవచ్చు… రాకూడదని గెజిట్ ఇవ్వాలని పోలీసులకు తెలిపారు. దీంతో వాగ్వాదం చోటుచేసుకుంది. అంతకుముందు హారీశ్ రావు మీడియాతో మాట్లాడుతూ… కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు అన్యాయం చేస్తోందని, రాజకీయాల కోసం రాష్ట్ర నీటి హక్కులను కాలరాస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ దురుద్దేశంతో కాంగ్రెస్ పార్టీ కమిషన్ వేసినా… న్యాయ వ్యవస్థ, రాజ్యాంగంపై పూర్తి గౌరవం, విశ్వాసం ఉందన్నారు. కమిషన్ ముందు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న దుష్ప్రచారాలు వివరించి, మా దగ్గర ఉన్న పూర్తి సమాచారం, అన్ని విషయాలను కమిషన్ దృష్టికి తీసుకెళ్తానన్నారు.