అమెరికాకు ఇరాన్ హెచ్చరిక
టెహ్రాన్/వాషింగ్టన్: పశ్చిమాసియాలో యుద్ధమేఘాలు కమ్ముకొంటున్నాయి. అణు చర్చల క్రమంలో ఉద్రిక్తత నెలకొంటోంది. చర్చలు విఫలమై తమపై దాడులు జరిగితే మాత్రం విదేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలే లక్ష్యంగా దాడులు చేస్తామని అగ్రరాజ్యాన్ని ఇరాన్ హెచ్చరించింది. ఈ మేరకు ఎక్స్లో ఇరాన్ రక్షణ మంత్రి అజీజ్ నసీర్జాదా పేర్కొన్నారు. ‘మేము సిద్ధం’ అంటూ పోస్టు పెట్టారు. ఈ పరిణామంతో అప్రమత్తమైన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెంటనే ఇరాన్లోని తమ దౌత్య సిబ్బంది, సైనిక కుటుంబాలను వెనక్కి పలిపించారు. ఇప్పటికే గాజాను నామరూపాలు చేసేందుకు భీకర దాడులు కొనసాగిస్తున్న ఇజ్రాయిల్ ఇక ఇరాన్పై కన్నేసింది. ఆ దేశంపై దాడులకు సిద్ధమవుతోంది. ఇదే అంశాన్ని అమెరికా అధికారులు ఓ వార్తా సంస్థకు చెప్పారు. దీంతో ఇరాక్లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ దాడి చేసేందుకు అవకాశం ఉందన్నారు. ఈ పరిణామాల క్రమంలో పశ్చిమాసియాలోని పరిస్థితులను నిశితంగా గమనిస్తున్నట్లు ట్రంప్ ఓ కార్యక్రమంలో తెలిపారు. అమెరికా`ఇరాన్ మధ్య అణు చర్చలు కొనసాగుతున్నాయి. ఆరో దఫా చర్చలకు అమెరికా తరపున స్టీవ్ విట్కాఫ్ హాజరు కానున్నారు. అయితే ఇరాన్తో ఒప్పందంపై ఇజ్రాయిల్ విముఖంగా ఉన్నట్లు సమాచారం. ఇదే క్రమంలో ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యాహును గాజాలో దాడులు ఆపాలని ట్రంప్ సలహా ఇచ్చినట్లు తెలిసింది. వీరిద్దరు ఇటీవల ఫోన్ చర్చలు జరిపారని అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఇరాన్పై దాడి గురించి ప్రకటనలు చేయొద్దని, ఆ దిశగా ఎలాంటి వ్యూహాలు, ప్రణాళికలు రూపొందించవద్దని కూడా నెతన్యాహుకు ట్రంప్ సూచించినట్లు సమాచారం. అయితే నెతన్యాహు విముఖంగా ఉండటం, అణు చర్చలు విఫలం కాగానే ఇరాన్పై దాడికి తమకు ట్రంప్ నుంచి అనుమతి లభిస్తుందని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలావుంటే, ఇరాన్పై దాడికి ఇజ్రాయిల్ సిద్ధం చేసుకొన్న రహస్య ప్రణాళికను లీక్ చేసిన సీఐఏ మాజీ విశ్లేషకుడు ఆసీఫ్ రెహ్మన్కు అమెరికా కోర్టు 37 నెలల శిక్ష విధించింది. 2016 నుంచి సీఐఏలో ఉన్న రెహ్మాన్ 2024లో సమాచారం లీక్ చేశారు.