14మంది మృతి
కీవ్: ఉక్రెయిన్పై రష్యా మరోసారి భీకర దాడి చేసింది. కీవ్ లోని నివాస ప్రాంతంపై క్షిపణులు, డ్రోన్లలను ప్రయోగించింది. ఈ దాడిలో 10 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. రష్యా ప్రయోగించిన డ్రోన్ ఓ గృహ సముదాయాన్ని తాకింది. దీంతో అక్కడ పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. నివాస సముదాయం రెండుగా చీలిపోయింది. ఈ దాడిలో 14 మంది మరణించారు. మృతుల్లో 62 ఏళ్ల అమెరికా పౌరుడు కూడా ఉన్నట్లు ఉక్రెయిన్ అధికారులు తెలిపారు. వెంటనే అక్కడికి చేరుకున్న అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం గాలిస్తున్నారు. ఈ దాడిలో దాదాపు 40 మందికిపైగా గాయపడ్డారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. రష్యా దాడికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.మరోవైపు రష్యా డ్రోన్ దాడులను అడ్డుకునేందుకు ఉక్రెయిన్ కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ మేరకు ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. శత్రు దేశం నుంచి వస్తున్న డ్రోన్లను కూల్చేందుకు సైన్యం ప్రమేయం లేకుండా కొంత నగదు ఇచ్చి వలంటీర్లను ఉపయోగించుకోవాలని భావిస్తోంది. ఇందుకోసం ఓ పథకాన్ని ప్రకటించింది. ఈ పథకం కింద శత్రుదేశ డ్రోన్లను గుర్తించి, నేలకూల్చే పౌరులకు నెలకు సుమారు రూ. 2.2 లక్షల వరకు జీతం అందించనున్నట్లు వెల్లడిరచింది. ఉక్రెయిన్ రక్షణ శాఖ ప్రతిపాదించిన ఈ కార్యక్రమానికి మంత్రివర్గం ఆమోదముద్ర వేసినట్లు ప్రభుత్వ ప్రతినిధి తారాస్ మెల్నిచుక్ టెలిగ్రామ్లో ప్రకటించారు. ఈ పథకం కింద, ప్రత్యేకంగా శిక్షణ పొందిన వాలంటీర్లను, డ్రోన్ ఆపరేటింగ్ నైపుణ్యాలు కలిగిన పారామిలిటరీ సభ్యులను నియమించనున్నారు. వీరు మానవరహిత విమానాలు, ఆయుధాలు వంటి అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి రష్యా డ్రోన్లను పసిగట్టి, వాటిని కూల్చివేయాల్సి ఉంటుంది. ఇందుకు అయ్యే ఖర్చును స్థానిక బడ్జెట్ నుంచి కేటాయించనున్నారు.