. 2.90 లక్షల మందికి రూ.436 కోట్లు
. నేడు సీఎం చేతుల మీదుగా ‘ఆటో డ్రైవర్ సేవలో’ ప్రారంభం
విశాలాంధ్ర – సచివాలయం: రాష్ట్ర ప్రభుత్వం ‘ఆటో డ్రైవర్ సేవలో’ పథకానికి శ్రీకారం చుట్టింది. సొంత ఆటో, మోటార్ క్యాబ్, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు ఆర్థికంగా అండగా నిలబడేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ పథకం రూపొందించింది. అర్హులైన డ్రైవర్లకు ఏడాదికి రూ.15 వేల చొప్పున ఇవ్వనున్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ పరిధిలో శనివారం ఉదయం జరగనున్న ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ హాజరుకానున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 2,90,669 మంది లబ్ధిదారులను అర్హులుగా గుర్తించారు. వీరి కోసం రూ.436 కోట్లు కేటాయించారు. నిధులను నేరుగా డ్రైవర్ల ఖాతాలో ప్రభుత్వం జమ చేయనుంది. అంతేకాకుండా పాతవాహనాలపై గత ప్రభుత్వం భారీగా వేసిన గ్రీన్ ట్యాక్స్ను కుదించింది. నాడు రూ.20 వేలు ఉన్న గ్రీన్ ట్యాక్స్ను రూ.మూడు వేలకు తగ్గించి వాహనదారులకు పెద్దమొత్తంలో ఉపశమనం కల్పించింది. అర్హత ఉండి కూడా జాబితాలో పేరు లేకుంటే… వీరి కోసం ప్రత్యేకంగా ఫిర్యాదులు స్వీకరించేందుకు ప్రభుత్వం ఓ వ్యవస్థను ఏర్పాటు చేసింది. వాట్సాప్ ద్వారా ఒక ప్రత్యేక గ్రీవెన్స్ హ్యాండ్లింగ్ సిస్టమ్ను అందుబాటులోకి తెచ్చింది. లబ్ధిదారులు తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్లో చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ కలిగి ఉండాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ పథకాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు.


