డా öö అరుణ్మిత్ర
విద్యార్థులు తమ హక్కుల కోసం జంతర్మంతర్ దగ్గర చేసిన నిరసనలు, దీక్షలు చూశాక ఒక్కసారిగా పాత జ్ఞాపకాలు గుర్తొచ్చాయి. నలభై ఆరు సంవత్సరాల క్రితం అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్ఎఫ్) ఆధ్వర్యంలో జరిగిన ‘ఉద్యోగం లేదా జైలు’ ఉద్యమంలో పాల్గొన్నాను. నాటి జ్ఞాపకాలన్నీ జూలై 19న దిల్లీలోని జంతర్మంతర్ విద్యార్థుల నిరసనలు చూశాక మళ్లీ కళ్ల ముందు నిలిచాయి. అక్కడ ఏఐఎస్ఎఫ్ ఏర్పాటుచేసిన నిరసన శిబిరంలో నలుగురు విద్యార్థులు నిరాహార దీక్ష చేస్తున్నారు. వారితో దాదాపు నాలుగు గంటలు గడిపాను. విపరీతమైన ఎండ, ఉక్కపోత, జనసమ్మరœం మధ్య ఒక యువతికి సరిగా ఊపిరందక ఒక్కసారిగా కుప్పకూలింది. వెంటనే విద్యార్థులు ఆమెను శిబిరానికి తీసుకొచ్చారు. పరీక్షించిన తర్వాత ప్రాణాపాయం లేదని చెప్పాను. స్పృహలోకి వచ్చాక ఓఆర్ఎస్ ఇస్తే కోలుకుంటుందని చెప్పాను. కొద్దిసేపటికే వైద్య బృందం వచ్చి పరీక్షించి ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని నిర్ధారించింది. కాసేపటికి ఆమె స్పృహలోకి వచ్చి నీళ్లు తాగింది. తాను బాగానే ఉన్నానని చెప్పినా కూడా ఆసుపత్రికి వెళ్లాలని సూచించాను. పరీక్షలు చేయించుకుని గంట తర్వాత ఆమె తిరిగి నడుచుకుంటూ నిరసన శిబిరానికి చేరుకుంది. ఈ సంఘటనను ప్రత్యేకంగా ప్రస్తావించడానికి కారణం ఉంది.
కేవలం 18-19 ఏళ్ల వయసు, బలహీనమైన శరీరం, కానీ అసాధారణమైన ధైర్యం, సంకల్పం ఉన్న ఆ యువతి నన్ను ఎంతో ప్రభావితం చేసింది. ఆమెతో పాటు అక్కడ వేలాది మంది విద్యార్థులను చూసినప్పుడు ఒక ఆశ కలిగింది. “ఇప్పటి తరం ఎందుకు మౌనంగా ఉంది?” అనే ప్రశ్నకు ఆ రోజు సమాధానం దొరికింది. యువత మౌనంగా లేదు…వారి గొంతును అణచివేశారు. సరైన సమయం వచ్చినప్పుడు ఆ స్వరం మరింత బలంగా బయటపడుతుంది. నీట్ ప్రశ్నపత్రం లీక్ దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల, వారి కుటుంబాల కలలను ఛిన్నాభిన్నం చేసింది. సంవత్సరాల తరబడి శ్రమించి వైద్య విద్య సాధించాలని కలలు కన్న యువత నిరాశకు గురైంది. ఆ మానసిక వేదనను తట్టుకోలేక దాదాపు 15 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. సమాజానికి వైద్యులుగా సేవలందించాల్సిన పిల్లల మరణాన్ని తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోయారు. అంతకంటే విషాదకరం మరొకటి లేదు. ఆ ఘటన ఒక తరం మనసుల్లో లోతైన గాయాన్ని మిగిల్చింది. ఆ ఆగ్రహం భారత ప్రధాన న్యాయమూర్తి విద్యార్థులను, నిరుద్యోగ యువతను ‘బొద్దింకలు’ గా పోల్చి చేసిన వ్యాఖ్యలతో యువతరం ఒక్కసారిగా కదిలింది. ‘కాక్రోచ్ జనతా పార్టీ’ పేరుతో ఒక నిరసన రూపం ఆవిర్భవించింది. విద్య, ఉద్యోగాల కోసం పోరాడుతున్న యువతను కాలితో నలిపేసే బొద్దింకలతో పోల్చడం కంటే అవమానకరమైన వ్యాఖ్య మరొకటి ఉండదు. సాధారణంగా బొద్దింకలు మురికి, నిర్మూలనకు ప్రతీకగా భావిస్తారు. అంటే అధికార వర్గాల్లో తామంటే ఎంత నిర్లక్ష్యం, చిన్న చూపు ఉందో అర్థం చేసుకున్నారు. జంతర్ మంతర్కు తరలిరావాలని పిలుపునిచ్చినప్పుడు అక్కడికి వందల మంది మాత్రమే వస్తారని చాలామంది భావించారు. ప్రధాన మీడియా, సామాజిక మాధ్యమాల్లోని కొందరు ఈ నిరసనను పెద్దగా పట్టించుకోలేదు. అయితే ప్రముఖ సామాజిక కార్యకర్త, ఆవిష్కర్త సోనం వాంగ్చుక్ విద్యార్థులకు సంఘీభావంగా నిరాహార దీక్ష ప్రారంభించడంతో ఉద్యమానికి కొత్త ఊపు వచ్చింది. కానీ ఆయనను అదుపులోకి తీసుకునేసరికి పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. జంతర్మంతర్తో పాటు దిల్లీ వీధుల్లో యువత ఆగ్రహం ఉప్పొంగింది. జూలై 20న లక్షలాది మంది యువత రాజధానికి చేరుకుని మండుటెండలను లెక్కచేయకుండా, శాంతియుతంగా పోలీసు చర్యలను ఎదుర్కొంటారని ప్రభుత్వం, ప్రజలు, ఉద్యమ నిర్వాహకులు కూడా ఊహించలేదు. స్వాతంత్ర్య పోరాటంలో స్వాతంత్ర్య సమరయోధులు లాఠీ దెబ్బలను భరిస్తూ వెనక్కి తగ్గనట్లే నేటి యువత కూడా భరించింది. మొబైల్ ఫోన్లు, సోషల్ మీడియాకే పరిమితమైన తరంగా కొందరు ముద్ర వేసిన నేటి యువత కూడా లాఠీ దెబ్బలను తట్టుకుని అసాధారణ ధైర్యసాహసాలను ప్రదర్శించింది. ఈ భారీ సమీకరణ ఒక్క సంస్థ కృషి ఫలితం కాదు.
అనేక విద్యార్థి, యువజన సంఘాల సమిష్టి కృషి ఫలితమే. నినాదాలు, పోస్టర్లు, వీడియోలు, సామాజిక మాధ్యమ ప్రచారం, పాటలు, డప్పుల నాదాలతో నిరసనను ప్రజాస్వామ్య ఉద్యమంగా మలిచారు. విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని, ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు 1 కోటి పరిహారం ఇవ్వాలని, సోనం వాంగ్చుక్ను విడుదల చేయాలని, దేశ విద్యా వ్యవస్థలో సమగ్ర సంస్కరణలు చేపట్టాలని వారు ప్రధానంగా డిమాండ్ చేశారు. అధికారాన్ని ప్రశ్నించడానికి వెనుకాడని ఈ విద్యార్థులు విశేష ధైర్యాన్ని ప్రదర్శించారు. అంత పెద్ద సంఖ్యలో యువత పాల్గొన్నప్పటికీ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోలేదు. పగలు-రాత్రి అన్న తేడా లేకుండా యువతీయువకులు కలిసి ఉద్యమంలో పాల్గొన్నా ఒక్క అసభ్య ప్రవర్తన ఘటన కూడా వెలుగులోకి రాలేదు. ఇది ఉద్యమ క్రమశిక్షణకు నిదర్శనం. రైతు ఉద్యమాన్ని అపఖ్యాతి పాలుచేయడానికి గతంలో చేసినట్లే, ఈ ఉద్యమాన్ని కూడా దారి మళ్లించే ప్రయత్నాలు జరిగాయి. అయితే అవి ఫలించలేదు. రైళ్ల రద్దు, మెట్రో స్టేషన్ల మూసివేత, మార్గాల మళ్లింపు, భారీ బారికేడ్లు వంటి ఆంక్షలు ఉన్నప్పటికీ దేశం నలుమూలల నుంచి లక్షలాది మంది యువత దిల్లీకి చేరుకుని పార్లమెంట్ వైపు కదిలారు. ఒక దశలో జంతర్ మంతర్ వద్ద నిరసనను పోలీసులు చెదరగొట్టారని అనిపించినా, పెల్లెట్ గన్స్, షాక్ బాటన్లు, టియర్ గ్యాస్, లాఠీచార్జ్ వంటి కఠిన చర్యలు కూడా వారిని ఏమీ చేయలేకపోయాయి. చరిత్రను తిరగేస్తే, సైమన్ కమిషన్ భారతదేశానికి వచ్చినప్పుడు లాలాలజపత్ రాయ్పై పోలీసులు అమానుషంగా లాఠీచార్జ్ చేశారు. ఆ గాయాల కారణంగా ఆయన మరణించారు. ఆ ఘటన బ్రిటీష్ పాలన పతనానికి ఆరంభ ఘట్టంగా చరిత్రకారులు పేర్కొంటారు. జూలై 20 ఘటనలు కూడా అలాంటి చారిత్రక ఘట్టానికి పోలికగా చెప్పొచ్చు. అయితే ఈ పరిణామాలు అదే స్థాయిలో చరిత్రను మలుపుతిప్పుతాయా లేదా అన్నది కాలమే నిర్ణయించాలి. అదే సమయంలో, అధికారంలో ఉన్నవారు రాజకీయంగా ఎంతో వ్యూహాత్మకంగా వ్యవహరించగలరో అందరికీ తెలుసు. ప్రజాభిప్రాయాన్ని ప్రభావితం చేయగల స్థాయిలో ఉన్నారు అంతేకాదు తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేసే శక్తులు వారికి అండగా ఉన్నాయనే వాస్తవాన్ని ప్రజలెవ్వరూ మర్చిపోకూడదు. ఇలాంటి సమయంలోనే అప్రమత్తంగా ఉండటం అత్యంత అవసరం. లౌకికవాదం, ప్రజాస్వామ్యం, కుల వివక్ష నిర్మూలన, సామాజిక సమానత్వం, లింగ సమానత్వం వంటి రాజ్యాంగ విలువలపై ప్రశ్నలు లేవనెత్తినప్పుడల్లా అధికార వర్గాలు అసౌకర్యంగా భావిస్తున్నాయనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. ప్రస్తుత విద్యార్థి ఉద్యమం మాత్రం ఈ రాజ్యాంగ స్ఫూర్తి ఇప్పటికీ సజీవంగా ఉందని మరోసారి చాటిచెప్పింది. ఇకపై ఈ ఉద్యమం విద్యా విధానం, పరీక్షల పారదర్శకత, విద్యావ్యవస్థలో జవాబుదారీతనం, విద్యార్థుల హక్కులు వంటి అంశాలపై దేశవ్యాప్తంగా చర్చలు జరగాల్సిన అవసరం ఉంది. అప్పుడు ఉద్యమ అసలు ప్రయోజనం నెరవేరుతుంది. ఈ చర్చలు పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాల వరకు విస్తరించాలి. ఎందుకంటే నేటి విద్యార్థులు కేవలం వినడమే కాదు, ఆలోచిస్తున్నారు, సంఘటితమవుతున్నారు, తమ హక్కుల కోసం ప్రజాస్వామ్యబద్ధంగా పోరాడడానికి కూడా సిద్ధంగా ఉంటున్నారన్న విషయం జంతర్మంతర్ ఉద్యమం స్పష్టం చేస్తోంది.


