900 కోట్ల ప్రజాధనం దుర్వినియోగం
సీమ ప్రాజెక్ట్లపై అసెంబ్లీలో చర్చకు సిద్ధమా
వైఎస్ జగన్కు మంత్రుల సవాల్
విశాలాంధ్ర – సచివాలయం : అమరావతి రాజధాని, రాయలసీమ ప్రాజెక్టులు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యల్ని రాష్ట్ర మంత్రులు తీవ్రంగా ఖండిరచారు. రాష్ట్ర అభివృద్ధికి దోహదపడే ఏ అంశం జగన్మోహన్రెడ్డికి నచ్చదని…ఆయనకు రాష్ట్ర అభివృద్ధి కంటే తన స్వప్రయోజనాలే ముఖ్యమని మండిపడ్డారు. వాస్తవాల్ని కూడా అవాస్తవాలుగా చిత్రీకరించడంలో జగన్ కు సాటి ఎవరూ రారని విమర్శించారు. గురువారం రాష్ట్ర సచివాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మంత్రులు పీ నారాయణ, పయ్యావుల కేశవ్, అచ్చెన్నాయుడు, బీసీ జనార్దన్రెడ్డి, పార్థసారథి, మాజీ మంత్రి కాలువ శ్రీనివాసులు మాట్లాడారు. అమరావతి రాజధాని విస్తరణ కోసం ల్యాండ్ పూలింగ్ ప్రారంభమైన వేళ మాజీ సీఎం జగన్ మోహనరెడ్డి విష ప్రచారం చేస్తున్నారని మంత్రి నారాయణ ఆరోపించారు. రైతులను భయపెట్టేలా అమరావతి పై తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. అసలు అమరావతిని నదిలో ఎక్కడ కడుతున్నామనీ ప్రశ్నించారు. జగన్ ముందుగా రివర్ బేసిన్ కి, రివర్ బెడ్ కి తేడా తెలుసుకోవాలని సూచించారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కాదు, అది రాయలసీమ తెఫ్ట్ ఇరిగేషన్ లిమిటెడ్ అంటూ అని పయ్యావుల కేశవ్ విమర్శించారు. ఈ ప్రాజెక్ట్ లో 900 కోట్లు అవినీతి జరిగిందని… ప్రతిపక్షం లో ఉన్నపుడు తాను మీడియా సాక్షిగా చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు. అమరావతి మీద ఉన్న అక్కసును మరోసారి జగన్ వెలిబుచ్చారన్నారు. రాయలసీమ లిఫ్ట్ స్కీమ్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాదు కేవలం చెన్నైతోపాటు సీమ కి తాగునీటి కోసమని జీఓ విడుదల చేసింది మీ ప్రభుత్వం కాదా అని ప్రశ్నించారు. గత టీడీపీ ప్రభుత్వం లో నిర్మించిన పట్టిసీమ ప్రాజెక్టు వల్ల ప్రభుత్వానికి ఆదాయం వచ్చిందని.. రాయలసీమ లిఫ్ట్ స్కీమ్ వందల కోట్లు నష్టం తెచ్చిందన్నారు. జీఓ నెంబర్ 365 తో 189 ప్రాజెక్ట్ పనులు రద్దు చేశారని అందులో 102 ప్రాజెక్ట్ లు రాయలసీమవి అని గుర్తించాలన్నారు. రాయలసీమ మేధావులు అందరూ వాస్తవాలు తెలుసుకోవాలని,జగన్ మోహన్ రెడ్డి మాటలు నమ్మవద్దని మనవి చేశారు. మాజీ మంత్రి కాలువ శ్రీనివాసులు మాట్లాడుతూ… రాయలసీమ అభివృద్ధి చంద్రబాబు తో నే సాధ్యం అని నమ్మి ప్రజలు ఏకపక్షంగా మద్దతు ఇచ్చారన్నారు. చేశారన్నారు.ఇప్పటి వరకు రాయలసీమ అభివృద్ధి కి 8 వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన ఘనత కూటమి ప్రభుత్వదేనని తెలిపారు.
మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి మాట్లాడుతూ…రాయలసీమ ప్రజలపై జగన్ మోహన్ రెడ్డి కపట ప్రేమ ను చూపిస్తున్నారని మండిపడ్డారు. గతం లో కర్నూలు లో పర్యటించిన జగన్ కుందూ ను వెడల్పు చేస్తానని హామీ ఇచ్చి… తన అనుయాయులకు పనులు కేటాయించుకున్నారని విమర్శించారు. అవుకు టన్నెల్, గోరుకల్లు,గాలేరు నగరి ప్రాజెక్ట్ పూర్తి చేసింది కూటమి ప్రభుత్వమేనన్నారు. నిజంగా రాయలసీమ మీద ప్రేమ ఉంటే అసెంబ్లీ సాక్షిగా తేల్చుకుందామని సవాల్ విసిరారు. మంత్రి పార్థసారథి మాట్లాడుతూ… జగన్ సీఎం గా ఉండగా రాయలసీమ లిఫ్ట్కి ఎన్జీటీ స్టే ఇచ్చిందని తెలిపారు. ఇప్పుడు అమరావతి నదీ గర్భం లో ఉందని జగన్ చెప్తున్నారని, వేల కోట్లు అమరావతి కి ఇస్తున్న కేంద్రానికి, అంతర్జాతీయ ఆర్థిక సంస్థలకు రాజధాని నదీ గర్భంలో ఉందని తెలియదా అని ప్రశ్నించారు. మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ… అమరావతిపై జగన్ ద్వంద్వ వైఖరి బట్టబయలైందన్నారు. జగన్ ఒక మానసిక రోగి అని రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం అనే పదాలు విన్నా, చూసినా అతనిలోని మృగం బయటకు వస్తుందని మండిపడ్డారు.
అమరావతిపై కుట్రలు చేయడం జగన్కు అలవాటుగా మారిందని,ఉద్దేశపూర్వకంగా విష ప్రచారం చేస్తున్నారన్నారు. నదీ గర్భంలో రాజధాని నిర్మిస్తున్నారంటూ కుట్ర రాజకీయాలకు జగన్ తెరలేపి, అమరావతి రైతులపై మానసిక దాడి చేస్తున్నారని విమర్శించారు. అమరావతి రాష్ట్ర రాజధాని అనేది నిర్ణయం కాదు… చట్టమని జగన్ మాటలతో మారేది కాదని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు.


