. 24 గంటల్లో 423 మిల్లీమీటర్ల వర్షపాతం, వరదలు
. 30 మంది మృతి`300 మందికి గాయాలు
. 125కుపైగా ఇళ్లు ధ్వంసం
రావల్పిండి : పాకిస్థాన్లోని పంజాబ్లో రెయిన్ ఎమర్జెన్సీ ప్రకటించారు. 24 గంటల్లో 423 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో మెరుపు వరదలు సంభవించాయి. 30 మంది చనిపోయారు. మరో 300 మంది గాయపడ్డారు. 125కుపైగా ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఈ పరిస్థితుల్లో పంజాబ్ ముఖ్యమంత్రి మరియం నవాజ్ ప్రావిన్స్లోని వివిధ ప్రాంతాల్లో అత్యవసర పరిస్థితిని గురువారం ప్రకటించారు. లాహోర్కు 300కిమీల దూరంలోని సాల్ట్ రేంజ్లోని చక్వల్ వరద గుప్పిట్లో చిక్కుకున్నది. గత 24 గంటల్లో అక్కడ 423 ఎంఎంల వర్షం కురవగా వరదలొచ్చాయని, ప్రజలను కాపాడేందుకు సహాయక చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. సైన్యం కూడా రంగంలోకి దిగిందని ప్రావిన్షియల్ విపత్తు నివారణ యంత్రాంగం (పీడీఎంఏ) ప్రకటన పేర్కొంది. మరో 24 గంటలు భారీ వర్షాలు కురుస్తాయని, పంజాబ్లోని నదులు, వాగులు ఉప్పొంగుతాయని, అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీచేశారు. జూన్ 26 నుంచి వర్షాలకు సంబంధించిన వేర్వేరు ఘటనల్లో పాకిస్థాన్ వ్యాప్తంగా 170 మరణాలు సంభవించినట్లు తెలిపారు. లాహోర్, ఫైసలాబాద్, ఒకారా, సహివాల్, పాక్పట్టం, చక్వల్ ప్రాంతాల్లో ఎక్కువగా మరణాలు సంభవించినట్లు పీడీఎంఏ తెలిపింది. పంజాబ్ ముఖ్యమంత్రి మరియం నవాజ్ రావల్పిండి సహా వివిధ ప్రాంతాల్లో రెయిన్ ఎమర్జెన్సీ ప్రకటించారు. అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు. ఆసుపత్రులను హై అలర్ట్లో ఉంచారు. ఫీల్డ్ హాస్పిటల్స్ సిద్ధం చేశారు. అత్యవసర పరిస్థితుల కోసం అన్ని ఏర్పాట్లు చేసినట్లు సీఎం వెల్లడిరచారు.