కృష్ణ ఘా
డిప్యూటీ ఎడిటర్ న్యూయేజ్
ఆర్ఎస్ఎస్ అజెండాకు అనుగుణంగా నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎన్సీఈఆర్టీ) ఎనిమిదవ తరగతి పాఠ్యపుస్తకాలలో భారత పూర్వ చరిత్రను వక్రీకరించేందుకు తీవ్రంగా యత్నిస్తోంది. వాస్తవాలను పాతరపెట్టే ప్రయత్నం చేస్తోంది. పక్షపాత ధోరణిలో అసలు చరిత్రను మరుగున పరచి కొంగొత్త కోణంలో తిరిగి రాయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. పాఠ్యపుస్తకాలలో వాస్తవాలను విస్మరించి చరిత్రను తమకు అనుకూలంగా విద్యార్థుల మెదళ్లలోకి చొప్పించేందుకు కేంద్ర ప్రభుత్వం నిరంకుశంగా ప్రవర్తిస్తోంది. తాజాగా ఎన్సీఈఆర్టీ 8వ తరగతి సామాజిక శాస్త్ర పాఠ్య పుస్తకాన్ని విడుదల చేసింది. సమాజాన్ని విశ్లేషిస్తూ ‘‘ఇండియా అండ్ బియాండ్’’ అనే పుస్తకంలో మొఘలులు, దిల్లీ సుల్తానుల పాలనలో ‘‘క్రూరత్వం’’, ‘‘మతపరమైన అసహనం’’ ను ప్రధానంగా వ్యక్తంచేసింది. దీనికి విరుద్ధంగా, మరాఠాలను మరింత సానుకూల దృక్పథంలో చిత్రీకరించే ప్రయత్నం చేస్తోంది. ఈ పుస్తకం జాతీయ పాఠ్య ప్రణాళిక చట్రంలో భాగంగా జాతీయ విద్యా విధానం(ఎన్ఈపీ) 2020కి అనుగుణంగా ఉందని ఎన్సీఈఆర్టీ బుకాయించే ప్రయత్నం చేస్తోంది. 8వ తరగతి పాఠ్యపుస్తకంలో ప్రవేశపెట్టిన మార్పులు ఆర్ఎస్స్ సిద్దాంతానికి అనుగుణంగా చారిత్రాత్మక వ్యక్తులను ప్రత్యేకంగా కించపరుస్తున్నట్లు స్పష్టంగా తెలుస్తుంది.
తాజాగా సవరించిన 8వ తరగతి పాఠ్యపుస్తకంలో 17వ శతాబ్దంలో పశ్చిమ భారత దేశాన్ని పాలించిన మరాఠాలను ‘‘సార్వభౌమత్వం గల రాజులుగా కీర్తించింది. వారి వ్యవస్థాపకుడు ఛత్రపతి శివాజీని ‘‘నిజమైన దార్శనికుడు’’గా అభివర్ణించింది. ఈ పుస్తకంలో సర్జికల్ స్ట్రైక్ గురించి ప్రస్తావించారు. మరాఠా సామ్రాజ్య స్థాపకుడు ఛత్రపతి శివాజీ షాయిస్తా ఖాన్ శిబిరంపై రాత్రిపూట దాడి చేసి, ఆయనను ప్రస్తుతం మహారాష్ట్రగా ఉన్న ప్రాంతాన్ని విడిచి వెళ్ళమని బలవంతం చేయడాన్ని ఈ పాఠ్యాంశంలో ఉదహరించింది. దానిని ‘‘ఆధునిక సర్జికల్ స్ట్రైక్’’తో పోల్చింది. యుద్ధాలలో శివాజీ మతపరమైన ప్రదేశాలపై దాడి చేయకుండా ‘‘జాగ్రత్తగా’’ ఉండేవాడని కూడా ఈ పుస్తకంలో పేర్కొనడమైంది. అయితే, వాస్తవంగా మరాఠాల హింసాత్మత చర్యలు, రాజ్పుత్లపై దాడులు, బెంగాల్, బీహార్, ఒడిశాల ఆక్రమణ, కర్నాటకలో దేవాలయాలను నాశనం చేయడం, వంటివి ఈ పాఠ్యపుస్తకంలో ఎక్కడా పేర్కొలేదు.. మొఘలుల మతపరమైన అసహనం గురించి మాత్రం ప్రస్తావించే ప్రయత్నంచేసింది.
ఆపరేషన్ సిందూర్ అంశాన్ని 3వ తరగతి నుంచి 12 తరగతుల వరకు ఎన్సీఈఆర్టీ పాఠ్యపుస్తకాలలో భాగం చేయడానికి కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా చేసుకుంది.. తాజా నివేదికల ప్రకారం, భారతదేశ సైనిక శక్తి గురించి విద్యార్థులకు అవగాహన కల్పించే లక్ష్యంతో, ఆపరేషన్ సిందూర్ కింద పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలపై భారత్ చేపట్టిన దాడులకు రెండు ప్రత్యేక కొలప్రమాణాలను పుస్తకాలలో పాఠ్యాంశంగా చేసేందుకు యత్నిస్తోంది. ఈ రెండు కొలప్రమాణాలను త్వరలో పుస్తకాలలో చొప్పించేందుకు రంగం సిద్ధమవుతోంది. ‘‘ఆపరేషన్ సిందూర్’’ పై మొదటి ప్రత్యేక మాడ్యూల్ 3వ తరగతి నుంచి 8వ తరగతి విద్యార్థుల కోసం కేటాయించడమైంది. రెండవ మాడ్యూల్లో భాగంగా 9వ తరగతి నుంచి 12 తరగతుల విద్యార్థులకు ఆయా పాఠ్యాంశాలలో భాగం చేయనున్నారు. భారతదేశ సాయుధ సైనిక దళాలు సాధించిన విజయాలను 8 నుండి 10 పేజీలలో వివరించడమైంది. భారతదేశ సైనికుల పోరాటపటిమ, వారి చేతిలో పాకిస్థాన్ ఓటమి విద్యార్థులకు అవగాహన కల్పించడం ఈ పాఠ్యాంశాల ప్రధాన లక్ష్యంగా ఎన్సీఈఆర్టీ పేర్కొంది.
పుస్తకాలలో చారిత్రక వాస్తవాలను వక్రీకరించే ప్రక్రియను ఎన్సీఈఆర్టీ వేగవంతం చేస్తోంది. ఈ ప్రయత్నానికి సంబంధించిన ఘట్టం గత ఏడాది ఏప్రిల్లో జరిగింది, ఎన్సీఈఆర్టీ అయోధ్య వివాదానికి సంబంధించి 12వ తరగతి రాజకీయ శాస్త్ర పాఠ్యపుస్తకాన్ని మార్చడానికి ప్రయత్నించింది. బాబ్రీ మసీదు కూల్చివేత కంటే రామ జన్మభూమి ఉద్యమానికి ప్రాధాన్యత ఇవ్వడానికి ఈ సవరణ చేయాలని సంకల్పించింది. ఈ మార్పును అమలు చేయడానికి ఎన్సీఈఆర్టీ ఉదహరించిన కారణం నవంబర్ 2019లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు, బాబ్రీ మసీదు మొత్తం ప్రాంగణంలో రామాలయం నిర్మించవచ్చునని, మసీదు నిర్మాణం కోసం ఐదు ఎకరాల స్థలాన్ని కేటాయించాలని కూడా సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది. అయితే పాఠ్యపుస్తకాలలో బాబ్రీ మసీదు ప్రస్తావనను తొలగించాలని కోరింది.
అయోధ్యలో బాబ్రీ మసీదు స్థానంలో రామాలయం నిర్మాణం కోసం జరిగిన ఈ మెగా ఈవెంట్ ప్రాథమిక వాస్తవాల్ని మరచిపోయేలా చేయకూడదు. సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసినప్పటికీ, మసీదు ఉన్న స్థలంలో ఆలయం ఉందన్న వాదనకు చారిత్రక పునాది లేకపోగా, 1949 వరకు అది హిందు ఆలయం కూడా కాదు. 1855 నాటికే, హనుమాన్గఢలోి నివసిస్తున్న బైరాగీలకు, ముస్లింలకు మధ్య వైరం ఉంది. హనుమాన్గఢ ఎపిసోడ్ (1855)లో ప్రధాన కోణం ఏమిటంటే, ఆ సమయంలో కూడా హిందువుల మనస్సులో బాబ్రీ మసీదు, జన్మస్థాన్కి మధ్య ఎటువంటి సంబంధాలు లేవని అది సూచిస్తుంది. అయితే ముస్లింలు ఆశ్రయం పొందిన మసీదును బైరాగీలు స్వాధీనం చేసుకున్నప్పటికీ, వారు దానిని ఆక్రమించలేదు సరికదా దానిపై ఎటువంటి దావా వేయలేదు. అవధ్ కోర్టు విచారణ సమయంలో, మసీదు ఉన్న స్థలంలో గతంలో ఆలయం ఉందని ఏ హిందువు కూడా పస్తావించకపోవడం కూడా ఇక్కడ గమనించదగ్గ విషయం.
బ్రిటిష్ కాలం నాటి స్థానిక కోర్టు రికార్డులు కూడా బాబ్రీ మసీదును రాముడి జన్మస్థలంగా ఎన్నడూ పరిగణించలేదని చెబుతున్నాయి. ఉదాహరణకు, 1903 నాటి కోర్టు ఉత్తర్వులో బాబ్రీ మసీదుకు దూరంగా ఆవరణ బయటి గోడ లోపల రాముడి జన్మస్థలం) ఉందని ప్రస్తావించారు. ‘‘జన్మస్థాన్’’ వద్ద సైన్ బోర్డును ఉంచే ప్రయత్నాలను నిలిపివేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్కు ప్రతిస్పందనగా ఫైజాబాద్ జిల్లా మేజిస్ట్రేట్ ఈ ఉత్తర్వు ఇచ్చారు. పిటిషన్ను తిరస్కరించిన మేజిస్ట్రేట్, అటువంటి స్థలం బాబ్రీ మసీదు ‘‘బయటి గోడ’’ లోపల ఉంది కానీ, మసీదు లోపల కాదు కాబట్టి ఈ చర్యలో తప్పు లేదని పేర్కొన్నారు. రాముడు జన్మించిన ప్రదేశం ఈ ప్రత్యేక మసీదు బయటి గోడ లోపల ఉంది, కాబట్టి పేరు స్లాబ్ దాని సరైన స్థలంలో మాత్రమే ఉంచబడుతోంది దానిని అక్కడ ఉంచడానికి ఇది అభ్యంతరం చెప్పడానికి కారణం కాదు…. ఎందుకంటే అలాంటి స్థలం వాస్తవానికి ఉంది. అయితే నేమ్ బోర్డు కేవలం అపరిచితులకు మార్గనిర్దేశం చేయడానికి మాత్రమే’’ అని ఆర్డర్ పేర్కొంది. బాబ్రీ మసీదు లోపలి ప్రాంగణం వెలుపల ఉన్న ఎత్తైన వేదిక మీద ఈ పేరు ఉంది, కానీ దాని బయటి గోడ లోపల ఉంది. ‘రామ్ చబుతారు’ అని కూడా పిలిచే ఈ స్థలం మసీదు నుంచి దాదాపు 100 అడుగుల దూరంలో ఉంది. 1949లో రాముడి జన్మస్థలంగా బాబ్రీ మసీదు లోపల విగ్రహాన్ని ప్రతిష్టించి పూజలు చేసేవారు. అయితే ఇనుప రెయిలింగ్లు ఎత్తైన వేదికను లోపలి ప్రాంగణం నుండి వేరు చేశాయి. ఎన్సీఈఆర్టీ తన పాఠ్యపుస్తకాల్లో ఎన్ని మార్పులు చేపడుతుందో, అంత ఎక్కువ అబద్ధాలతో పుస్తకాలను నింపే ప్రయత్నం చేస్తోంది. చరిత్ర పేరుతో విద్యార్థులకు వాస్తవాలను విస్మరించి అబద్ధాలను ప్రబోధించే ప్రయత్నాలు మాత్రం చేయకూడదు.


