ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏ1
విశాలాంధ్ర-హైదరాబాద్ : రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు విచారణ ముగింది. సిట్ అధికారులు ఆయన్ను దాదాపు ఎనిమిది గంటల పాటు విచారించారు. డీసీపీ విజయ్, ఏసీపీ వెంకటగిరి ఆయనపై ప్రశ్నల వర్షం కురిపించారు. తిరుపతన్న, రాధాకిషన్రావు, ప్రణీత్రావు, భుజంగరావు ఇచ్చిన వాంగ్మూలాల ఆధారంగా పోలీసులు వివిధ రకాలుగా ప్రశ్నలు అడిగారు. ఇప్పటివరకు సేకరించిన ఆధారాలను ఆయన ముందు ఉంచి ప్రశ్నించినట్లు తెలిసింది. సోమవారం విచారణ ముగియగా… ఈ నెల 11న మరోసారి విచారణకు రావాలని పోలీసులు ప్రభాకర్రావుకు సూచించారు. గతంలో ఫోన్ట్యాపింగ్ కేసులో ప్రభాకర్రావుపై పంజాగుట్ట పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. ఈ కేసులో ఆయన ఏ1గా ఉన్నారు. ప్రభాకర్రావు నుంచి కీలక సమాచారం రాబట్టడమే లక్ష్యంగా సిట్ అధికారులు ఆయన్ను ప్రశ్నించారు. ఈ కేసులో ఇప్పటికే ప్రణీత్రావు, రాధాకిషన్రావు, భుజంగరావు, తిరుపతన్నను సిట్ అధికారులు అరెస్టు చేశారు. వారు ఇచ్చిన సమాచారం ఆధారంగా ప్రభాకర్రావును ప్రశ్నించినట్లు సమాచారం. ఈ కేసు నమోదైన సమయంలోనే ప్రభాకర్ రావు అమెరికా వెళ్లిపోయారు. ఆ తర్వాత తిరిగి రాకపోవడంతో పోలీసులు ఆయన పాస్పోర్టు రద్దు చేయించారు. ఈ క్రమంలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు విచారణకు సహకరించేందుకు ఎమర్జెన్సీ ట్రావెల్ డాక్యుమెంట్తో ఆదివారం రాత్రి 8.20 గంటల సమయంలో ఎమిరేట్స్ విమానంలో దుబాయ్ మీదుగా హైదరాబాద్ చేరుకున్నారు. ఐజీ స్థాయిలో పదవీ విరమణ చేసిన అధికారి పోలీసు విచారణకు హాజరు కావడం రాష్ట్ర చరిత్రలో ఇదే ప్రథమం.