Tuesday, June 10, 2025
Homeభారత్‌ గౌరవం అమెరికాకు తాకట్టు

భారత్‌ గౌరవం అమెరికాకు తాకట్టు

. భారతీయుల కాళ్లకు బేడీలు వేసినా మోదీ మౌనం దారుణం
. దేశ సంపద కార్పొరేట్లకు ధారాదత్తం
. ప్రజల్లోకి సీఆర్‌ సిద్ధాంతాలు తీసుకెళ్లాలి
. సీపీఐ జాతీయ కార్యదర్శి వినయ్‌ విశ్వం

విశాలాంధ్ర- హైదరాబాద్‌ : స్వాతంత్య్ర పోరాటకాలంలో గాంధీజీ నినదించిన ‘స్వరాజ్యం’ అంటే ప్రజలందరికీ కూడు, గూడు, నీడ అని, 77 ఏళ్ల స్వాతంత్య్రానంతరం ఆ స్వరాజ్యం ఎక్కడుందని ప్రజలు ప్రశ్నిస్తున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి, మాజీ ఎంపీ వినయ్‌ విశ్వం అన్నారు. ప్రధాని మోదీ నినదిస్తున్న ‘సబ్‌ కా సాత్‌ సబ్‌ కా వికాస్‌’ పూర్తిగా అబద్దమని, పేదలు, కార్మికులు, ఉద్యోగులు, రైతులు ఎవరితోనూ ప్రధాని గానీ, కేంద్ర ప్రభుత్వం గానీ లేరని, వారు బడా పెట్టుబడిదారులతో, కార్పోరేట్‌ సంస్థలు, వ్యక్తులతో అంటకాగుతున్నారని విమర్శించారు. దేశంలో ఉన్న సమస్యలు, చోటుచేసుకుంటున్న పరిణామాలపై వామపక్షాలు సైద్ధాంతిక ఆలోచన, శిక్షణ, కార్యాచరణతో మరింత క్రియాశీలకంగా వ్యవహరించాలని అన్నారు. సీపీఐ అగ్ర నాయకుడు చండ్ర రాజేశ్వరరావు (సీఆర్‌) 111వ జయంతి కొండాపూర్‌ సీఆర్‌ ఫౌండేషన్‌లో సోమవారం ఘనంగా జరిగింది. ఫౌండేషన్‌ గౌరవ అధ్యక్షుడు డాక్టర్‌ కె.నారాయణ అధ్యక్షతన జరిగిన సభలో ముఖ్యఅతిథి విచ్చేసిన వినయ్‌ విశ్వం ప్రసంగిస్తూ దేశంలో ప్రస్తుత పరిస్థితులు, రానున్న జాతీయ, అంతర్జాతీయ మార్పులు, కూర్పులను వామపక్షాలు నిశితంగా పరిశీలించాల్సిన అవసరం ఉందన్నారు. దేశంలో రాజకీయ, సామాజిక, ఆర్థిక సవాళ్లు ఉన్నాయని, ఫాసిజం ఎత్తుగడలో భాగంగా మతోన్మాదం పేరుతో ప్రజలను చీల్చి రెండు వర్గాలనూ దోచుకునే ఎత్తుగడ కొనసాగుతోందని విమర్శించారు. రాజ్యాగాన్ని అపహాస్యం చేస్తున్నారని, ప్రజాస్వామ్య వ్యవస్థను, లౌకిక విధానాలన్నింటినీ నిర్వీర్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మనిషికి, మానత్వానికి, సమానత్వానికి, ప్రజా స్వామ్యానికి విలువను ఇచ్చే వామపక్షాలు ఒక వైపు ఉంటే, మరోవైపు ప్రజాస్వామ్యాన్ని , మతాన్ని దుర్వినియోగం చేసి సంపదను కార్పొరేట్‌ శక్తులకు దోచిపెట్టేందుకు ఫాసిస్టు శక్తులు ఉన్నాయని, ఈ రెండిరటికి మధ్య సామరస్యం, ఏకీభావం కుదరడం అసాధ్యమని గుర్తుంచుకోవాలని చెప్పారు. చండ్ర రాజేశ్వరరావు ప్రసంగాలు, సైద్ధాంతిక కృషి నేటితరం కమ్యూనిస్టులకు ఎంతో ఉపయోగపడుతాయని, దీన్ని ప్రజల వద్దకు తీసుకెళ్లి కార్యాచరణకు పూనుకోవాలని, వామపక్షాలన్నీ కలిసి ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. సుంకాల పేరుతో ట్రంప్‌ చేస్తున్న దాడిని ప్రపంచం తిరస్కరిస్తుందని, ఆ విధానాన్ని తిరస్కరించనిది కేవలం భారతదేశం మాత్రమేనని, తద్వారా భారతదేశ గౌరవాన్ని ప్రదాని మోదీ అమెరికాకు తాకట్టు పెట్టారని విమర్శించారు. ప్రపంచ రాజకీయాలు ఆర్థిక వ్యవస్థను కుదేలు చేస్తున్నాయని అన్నారు. వలసలు, అక్రమ కార్మికుల పేరుతో అమెరికా ఎంటున్న భారతీయులను నేరస్తుల మాదిరిగా కాళ్లకు బేడీలు వేసి ఇక్కడ వదిలిపెట్టినా మోదీ ఒక బానిస మాదిరిగా నోరు విప్పకపోవడం అన్యాయమన్నారు. ఆర్థికవేత్త ప్రొఫెసర్‌ నరసింహారెడ్డి మాట్లాడుతూ భారతదేశంలో పేదరికం తగ్గిందని ప్రపంచబ్యాంకు పేర్కొనడం సరైంది కాదన్నారు. ప్రజల కొనుగోలు శక్తి ఆధారంగా పేదరికాన్ని అంచనా వేయడం తగదన్నారు. ప్రపంచ బ్యాంకు పేర్కొన్నట్లు దేశంలో పేదరికం తగ్గితే ప్రజలకు విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు ఎందుకు లభించడంలేదని ప్రశ్నించారు. భారతదేశం జీడీపీ వృద్ధిలో జపాన్‌ను దాటిపోయామని చెబుతున్న ప్రధాని మరి తలసరి ఆదాయంలో ప్రపంచంలో భారత్‌ 136వ స్థానంలో ఎందుకు ఉందని ఆయన నిలదీశారు. దేశంలో ఆరుశాతం నిరుద్యోగం ఉందన్నారు. దేశంలో పది శాతం ఉన్న సంపన్న వర్గాలకు రూపాయి ఆదాయంలో 64 పైసలు చేరుతుండడం, 90 శాతం ఉన్న ప్రజలకు 36 పైసలు చేరుతుందన్నారు. తొలుత ఫౌండేషన్‌ ప్రాంగణంలో ఉన్న సీఆర్‌, తెలంగాణ సాయుధపోరాట యోధులు నీలం రాజశేఖర రెడ్డి విగ్రహాలకు బినయ్‌ పూలమాలు వేసి నివాళులు అర్పించారు. ఫౌండేషన్‌ అధ్యక్షుడు ముప్పాళ్ల నాగేశ్వరరావు, ఉపాధ్యక్షుడు జల్లి విల్సన్‌, ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకట రెడ్డి, కార్యదర్శులు చెన్నమనేని వెంకటేశ్వర రావు, పి.జె.చంద్రశేఖర రావు, సీఆర్‌ పోలిక్లినిక్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ కె.రజని, నీలం రాజశేఖర రెడ్డి పరిశోధన కేంద్రం డైరెక్టర్‌ డాక్టర్‌ టి.సురేష్‌, ఎన్‌ఎఫ్‌ఐడబ్ల్యూ జాతీయ నాయకులు డాక్టర్‌ బి.వి.విజయలక్ష్మి, పి.ప్రేమ్‌ పావని, ఫౌండేషన్‌ కోశాధికారి వి.చెన్నకేశవ రావు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు