కీవ్: ఉక్రెయిన్పై యుద్ధానికి స్వస్తి చెప్పేలా ప్రపంచ దేశాలు రష్యాపై తీవ్ర ఒత్తిడి తేవాల్సిన అవసరం ఉందని ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ అన్నారు. రష్యా నుంచి చమురు కొనుగోళ్లు చేసే భారత్ వంటి దేశాలపై సుంకాలు విధించడం సరైన చర్యేనని ఆయన సమర్థించారు. ఇటీవల షాంఘై సహకార సంస్థ సదస్సు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధినేత జిన్పింగ్, రష్యా అధ్యక్షుడు పుతిన్తో కలిసి వేదిక పంచుకోవడంపై ఓ ఇంటర్య్వూలో జెలెన్స్కీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్పై రష్యా జరిపిన అతిపెద్ద డ్రోన్ల దాడిపై జెలెన్స్కీ మండిపడ్డారు. రష్యాపై కఠిన ఆంక్షలను విధించాల్సిన సమయం అసన్నమైందని పశ్చిమ దేశాలకు పిలుపునిచ్చారు. ‘‘మనం పుతిన్పై ఒత్తిడి తీసుకురావడం అవసరం. ఈ విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సరిగానే ఉన్నారని నేను అనుకుంటున్నా. కొన్ని దేశాలు ఇంకా రష్యా నుంచి చమురును కొనుగోలు చేస్తున్నాయి. ఇది అన్యాయం. రష్యా నుంచి ఏదీ కొనుగోలు చేయకూడదు. యుద్ధాన్ని పరిష్కరించాలంటే రష్యాతో అన్ని రకాల డీల్స్ ఆపేయాలి. ట్రంప్ ఒత్తిడి తెస్తారని నేను నమ్ముతున్నా. పుతిన్ వద్ద ఉన్న ఆయుధం ‘చమురు’. పుతిన్ను ఆపాలంటే ఆ ఆయుధాన్ని తీసేయాలి. ప్రపంచ దేశాలు రష్యాపై ప్రకటనలు చేయకుండా ఆంక్షలు పెట్టాల్సిన అవసరం ఎంతో ఉంది. రష్యా దాడులు మాటలతో ఆగవు. ఆర్థికంగా, రాజకీయంగా ఒత్తిడి పెంచితేనే పుతిన్ వెనక్కి తగ్గుతారు’’ అని జెలెన్ స్కీ పేర్కొన్నారు. కాగా, రష్యాపై రెండో దశ ఆంక్షలు విధించేందుకు అమెరికా సిద్ధమవుతోంది. మాస్కోపై అదనపు టారిఫ్లు వేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని అధ్యక్షుడు ట్రంప్ పేర్కొన్నారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న దేశాలపై అమెరికాతో పాటు ఐరోపా సమాఖ్య దేశాలు ద్వితీయ సుంకాలు విధిస్తే మాస్కో ఆర్థిక వ్యవస్థ కూప్పకూలిపోతుందని అమెరికా ఆర్థికమంత్రిగా స్కాట్ బెసెంట్ చెప్పిన చేసిన కొద్ది గంటలకే ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇటీవల కాలంలో రష్యా`ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలకాలని భారత్ కూడా ప్రయత్నాలు చేస్తోంది. ప్రధాని మోదీ అటు పుతిన్, ఇటు జెలెన్స్కీతో చర్చలు జరుపుతున్నారు. పుతిన్తో భేటీకి ముందు కూడా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీతో ఫోన్లో మాట్లాడారు.
భారత్, రష్యాపైసుంకాల విధింపు సబబే: జెలెన్స్కీ
- Advertisement -
RELATED ARTICLES


