Tuesday, June 24, 2025
Homeయుద్ధానికి తెర?

యుద్ధానికి తెర?

కాల్పుల విరమణ మొదలైందని ఇరాన్‌, ఇజ్రాయిల్‌ ప్రకటన

. గంటల వ్యవధిలోనే దాడులు`ప్రతిదాడులు
. ట్రంప్‌ ఆగ్రహం
. యుద్ధ విమానాలు వెనక్కి రప్పించాలని టెల్‌అవీవ్‌కు ఆదేశం
. దాడుల తీవ్రత తగ్గించినట్లు నెతన్యాహు ప్రకటన

తెహ్రాన్‌/టెల్‌ అవీవ్‌: ఇరాన్‌-ఇజ్రాయిల్‌ మధ్య 12రోజుల భీకర యుద్ధం ముగిసింది. మంగళవారం తెల్లవారుజాము నుంచి యుద్ధవిరమణకు ఇరాన్‌-ఇజ్రాయిల్‌ అంగీకరించినట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ప్రకటించగా ఇరాన్‌ ధ్రువీకరించింది. ఈ మేరకు ఇరాన్‌ అధికారిక ఛానల్‌ ప్రకటించింది. మరోవైపు ఇజ్రాయిల్‌ సైతం ట్రంప్‌ కాల్పుల విరమణ ప్రకటనను ఆమోదించింది. ఈ మేరకు ఇజ్రాయిల్‌ ప్రధానమంత్రి బెంజిమన్‌ నెతాన్యాహు ప్రకటించారు. ఇరాన్‌ కాలమానం ప్రకారం ఉదయం ఏడున్నర గంటలకు యుద్ధ విరమణ అమల్లోకి వచ్చినట్లు అధికారిక ఛానల్‌ వెల్లడిరచింది. గ్రాఫిక్స్‌తో కథనం ప్రసారం చేసింది. యుద్ధ విరమణపై ఇరాన్‌ ప్రకటన తర్వాత ఇజ్రాయిల్‌ కూడా ధ్రువీకరించింది. ఆ తర్వాత అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ కూడా కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చిందని సామాజిక మాధ్యమం ట్రూత్‌ ద్వారా ప్రకటించారు. దయచేసి దాన్ని ఎవరూ ఉల్లంఘించవద్దని సూచించారు. కానీ యుద్ధ విరమణ ప్రకటన వెలువడిన కొన్నిగంటల వ్యవధిలోనే మళ్లీ ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ట్రంప్‌ మధ్యవర్తిత్వంతో కుదిరిన యుద్ధ విరమణ ఒప్పందాన్ని కొన్ని గంటల వ్యవధిలోనే ఇరాన్‌, ఇజ్రాయిల్‌ పరస్పరం ఆరోపించుకున్నాయి. పరస్పరం క్షిపణిదాడులకు పాల్పడ్డాయి. కాల్పుల విరమణ ఉల్లంఘనపై ట్రంప్‌ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఇరాన్‌-ఇజ్రాయిల్‌ దేశాలు మళ్లీ కాల్పుల విరమణ ఉల్లంఘిస్తున్నాయన్నారు. ముఖ్యంగా ఇజ్రాయిల్‌ తీరుపై ట్రంప్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. యుద్ధ విమానాలను తక్షణమే వెనక్కి రప్పించమని ఆదేశించారు. ఇప్పటికప్పుడు దాడులు ఆపలేమని, కాల్పుల విరమణను ఉల్లంఘించిన ఇరాన్‌కు బుద్ధి చెప్పాల్సిందేనని ఆయనతో ఇజ్రాయిల్‌ ప్రధాని నెతన్యాహు వాదించారు. దీంతో ట్రంప్‌ చీవాట్లు పెట్టారు. బాంబులు వేయొద్దని, కాల్పుల వివరణను ఉల్లంఘించవద్దని, శాంతించాలని సూచించారు. ట్రంప్‌ సూచన మేరకు ఇరాన్‌పై జరపాల్సిన దాడుల తీవ్రతను తగ్గించినట్లు నెతన్యాహు అనంతరం వెల్లడిరచారు. ఇజ్రాయిల్‌కు మిత్రుడిగా, ఇరాన్‌కు శుత్రువుగా ఉన్న ట్రంప్‌ వైఖరిలో మార్పు, ఇజ్రాయిల్‌, ఇరాన్‌ను కలిపి తిట్టడం అంతర్జాతీయ వేదికపై చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా ఇజ్రాయిల్‌ను ట్రంప్‌ ఆక్షేపించారు. కాల్పుల విరమణను అమల్లో ఉందని, దాన్ని ఉల్లంఘించవద్దని తేల్చిచెప్పారు. ఇరాన్‌పై ఇజ్రాయిల్‌ ఇక దాడి చేయదని కూడా ట్రంప్‌ ప్రకటించారు. మరోవైపు కాల్పుల విరమణను ఉల్లంఘించలేదని ఇరాన్‌ తెలిపింది. ఇజ్రాయిల్‌ మాత్రం తమ దేశంపై ఇరాన్‌ క్షిపణి దాడి చేసినట్లు ఆరోపించింది. బీర్‌షేవాపై దాడిలో నలుగురు చనిపోయారని తెలిపింది. ఇందుకు ఇరాన్‌పై తీవ్రస్థాయిలో దాడి చేస్తామని హెచ్చరించింది. ఈ క్రమంలో ఇరాన్‌ రాజధానిలో రెండు చోట్లు పేలుళ్లు వినిపించినట్లు తెహ్రాన్‌ మీడియా పేర్కొంది. ఇదిలావుంటే, ఇజ్రాయిల్‌ దాడుల్లో ఇప్పటివరకు 610 మంది చనిపోయినట్లు ఇరాన్‌ ఆరోగ్యశాఖ ప్రకటించింది. మరో 4,746 మందికి గాయాలయ్యాయని తెలిపింది. వీరిలో 687 మందికి శస్త్రచికిత్సలు జరిగాయని, 971 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని ఇరాన్‌ అధికారి హుస్సేన్‌ వెల్లడిరచారు. మృతుల్లో రెండు నెలల చిన్నారి సహా 13 మంది పిల్లలు, ఇద్దరు గర్భిణులు సహా 49 మంది మహిళలు ఉన్నట్లు తెలిపారు. వైద్య సిబ్బంది ఐదుగురు చనిపోగా, 20 మందికి గాయాలయ్యాయన్నారు. ఏడు ఆసుపత్రులు దెబ్బతిన్నట్లు చెప్పారు. ఆరు అత్యవసర ప్రతిస్పందన స్థావరాలు, నాలుగు క్లినిక్‌లు, తొమ్మిది అంబులెన్సులు ధ్వంసమయ్యాయాని హుస్సేన్‌ తెలిపారు.
ఇజ్రాయిల్‌, అమెరికాపై గెలిచాం: ఇరాన్‌ ఉపాధ్యక్షుడు
ఇజ్రాయిల్‌, అమెరికాపై విజయం సాధించినట్లు ఇరాన్‌ అధికారులు ప్రకటించారు.సంక్లిష్ఠ పరిస్థితులను అధిగమించినట్లు పేర్కొన్నారు. కాల్పుల విరమణను ట్రంప్‌ ప్రకటించడమే తమ గెలుపును సూచించిందన్నారు. ‘అమెరికా, పశ్చిమ దేశాలు వెనక్కు తగ్గేలా చేయడంతోనే మేము గెలిచాం. ఇది ఇరాన్‌ శక్తిని ప్రదర్శిస్తుంది’ అని ఇరాన్‌ ఉపాధ్యక్షుడు మహమ్మద్‌ రెజా ఆరెఫ్‌ వెల్లడిరచారు. ఐఆర్‌జీసీ మాజీ కమాండర్‌ మహమ్మద్‌ బాఘెర్‌ గలీబా, పార్లమెంటు ఉన్నతాధికారి మహదీ మహమ్మదీ కూడా హర్షం వ్యక్తంచేశారు. ఇరాన్‌ చారిత్రక విజయం సాధించిందన్నారు.
ఇక గాజా వంతు…
ఇజ్రాయిల్‌ఇరాన్‌ మధ్య కాల్పుల విరమణను ప్రకటించడంతో ఇక గాజాలోనూ అందుకు సమయం ఆసన్నమైందన్న వాదన వినిపిస్తున్నది. కాల్పుల విరమణ ప్రకటించాలని పలస్తీనా కోరింది. జర్మనీ కూడా ఇందుకు సూచన చేసింది. గాజా స్ట్రిప్‌లో కాల్పుల విరమణ సాధనతో పూర్తిగా తెర దించాలని రామల్లాకు చెందిన పలస్తీనియన్‌ అథారిటీ డిమాండ్‌ చేసింది. కాల్పుల విరమణపై ట్రంప్‌ ప్రకటనను స్వాగతిస్తున్నట్లు అధ్యక్షుడు మపమూద్‌ అబ్బాస్‌ కార్యాలయం ఒక ప్రకటన చేసింది. గాజాలో ఇజ్రాయిల్‌ పోరు ముగించేందుకు సమయం ఆసన్నమైందని జర్మన్‌ ఛాన్సలర్‌ ఫెడ్రిక్‌ మెర్జ్‌ సూచించారు. ఇజ్రాయిల్‌హమాస్‌ మధ్య కూడా పోరు ముగియాలని, పూర్తిస్థాయి కాల్పుల విరమణ ఒప్పందం జరగాలన్నారు. ఆత్మరక్షణ హక్కు ఇజ్రాయిల్‌కు ఉన్నప్పటికీ, గాజా స్ట్రిప్‌లో ఇజ్రాయిల్‌ సాధించాలనుకున్నదని ఏమిటని జర్మనీ ప్రశ్నించగలదన్నారు. గాజా స్ట్రిప్‌లో మానవతా చర్యలను డిమాండ్‌ చేశారు. ప్రత్యేకించి మహిళలు, పిల్లలు, వృద్ధుల విషయంలో ఇజ్రాయిల్‌ మానవతా దృక్పధంతో వ్యవహరించాలని మెర్జ్‌ కోరారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు