న్యూదిల్లీ : వామపక్ష, ప్రగతిశీల, లౌకిక శక్తుల ఐక్యతకు సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా పునరుద్ఘాటించారు. అనేక రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నందున బీజేపీని గద్దె దించేందుకు ఏకం కావాలని వామపక్ష, ప్రగతిశీల, లౌకిక శక్తులకు పిలుపునిచ్చారు. న్యూదిల్లీలోని సీపీఐ కేంద్ర కార్యాలయం అజయ్ భవన్లో సోమవారం సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా, కార్యదర్శి గిరీశ్ చంద్ర శర్మతో లోకతాంత్రిక్ జనతా దళ్ (ఎల్జేడీ) జాతీయ అధ్యక్షుడు జావేద్ రజా నేతృత్వ బృందం భేటీ అయి తాజా రాజకీయ పరిణామాలపై సమాలోచనలు జరిపింది. ఎల్జేడీ ఉపాధ్యక్షులు జుబేర్ అహ్మద్ ఖురేషి, నడర్డౌడ, కార్యదర్శి సరితాతో పాటు వేర్వేరు రాష్ట్రాల నాయకులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం రాజాకు చిరు సత్కారం చేశారు.