అమరవీరుల సంస్మరణ సభలో చలసాని
విశాలాంధ్ర – చల్లపల్లి : దేశంలో విప్లవాత్మకమైన మార్పులకు నాంది పలికింది కమ్యూనిస్టులే అని సీపీఐ రాష్ట్ర సమితి సభ్యుడు చలసాని రాఘవేంద్రరావు అన్నారు. కృష్ణాజిల్లా చల్లపల్లి మండలం వక్కలగడ్డలో సీపీఐ శతవసంతోత్సవాల ముగింపు సందర్భంగా శనివారం అమరవీరుల సంస్మరణ సభ నిర్వహించారు. ముఖ్యవక్తగా విచ్చేసిన రాఘవేంద్రరావు మాట్లాడుతూ… కాంగ్రెస్ కంటే ముందు సంపూర్ణ స్వాతంత్య్రం కోసం పోరాడిరది కమ్యూనిస్టులేనన్నారు. దున్నేవాడికే భూమి దక్కాలనే నినాదంతో వేలాది ఎకరాల భూమిని పేదలకు పంచిన ఘనత కమ్యూనిస్టు పార్టీదేనన్నారు. నేడు పేదప్రజలకు దక్కుతున్న సంక్షేమ పథకాల రూపకల్పన వెనుక కమ్యూనిస్ట్టుల కృషి, పోరాటం ఎంతో ఉందని పేర్కొన్నారు. పార్టీ వందేళ్ల చరిత్రలో ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేసిందన్నారు. ప్రజావ్యతిరేక విధానాలపై రాజీలేని పోరాటం చేశామని తెలిపారు.
ఎరుపెక్కిన వక్కలగడ్డ
అమరవీరుల సంస్మరణ సభను పురస్కరించుకుని వక్కలగడ్డ గ్రామం ఎరుపెక్కింది. పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు ఎర్ర జెండాలు చేతబట్టి భారీ ర్యాలీ నిర్వహించారు. డప్పు వాయిద్యాలతో పుర వీధులలో ప్రదర్శన నిర్వహించారు. పార్టీ జెండాను సీపీఐ కృష్ణా జిల్లా కార్యదర్శి నార్ల వెంకటేశ్వరరావు ఆవిష్కరించారు. సీపీఐలో ఉంటూ అమరులైన ముఖ్య నేతల కుటుంబాలను సత్కరించారు. ప్రజా నాట్యమండలి రాష్ట్ర నాయకులు ఆర్. పిచ్చియ్య అధ్వర్యంలో కళాకారులు ఆలపించిన విప్లవ గేయాలు ఆకట్టుకున్నాయి. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర నాయకులు హనుమానుల సురేంద్రనాథ్ బెనర్జీ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో నార్లతో పాటు సీపీఐ కృష్ణాజిల్లా సహాయ కార్యదర్శి అడ్డాడ ప్రసాద్ బాబు, రైతు సంఘం నాయకులు వెలగపూడి అజాద్, ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య జిల్లా కార్యదర్శి మల్లు పెద్ది రత్నకుమారి, సీపీఐ వక్కలగడ్డ గ్రామ శాఖ కార్యదర్శి నక్క శ్రీనివాసరావు ప్రసంగించారు. గుత్తికొండ రామారావు, మల్లుపెద్ది బోసు, హనుమానుల జగన్మోహనరావు, కొర్రపాటి ముఖర్జీ, చండ్ర సుబ్బారావు, పాలడుగు రత్న బాబు, కొల్లూరి శ్రీధర్, కంఠంనేని జోత్స్నా దేవి, మల్లుపెద్ది రాణి కుమారి, మల్లుపెద్ది రాజా, లెనిన్, హేమార్జున తదితరులు పాల్గొన్నారు.
విప్లవాత్మక మార్పులకు కమ్యూనిస్టులే నాంది
- Advertisement -
RELATED ARTICLES


