. మిర్చియార్డు పర్యటనపై మరో కేసు
. పిలిచినప్పుడు విచారణకు రావాలని సూచన
విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : పల్నాడు జిల్లాలో పర్యటన సందర్భంగా సింగయ్య అనే వ్యక్తి మృతి చెందిన కేసులో వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్కు పోలీసులు నోటీసులు ఇచ్చారు. పల్నాడు జిల్లా రెంటపాళ్లలో జగన్ పర్యటన సందర్భంగా కారు కింద పడి సింగయ్య ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ కేసులో పోలీసులు జగన్ను ఏ2 నిందితుడిగా చేర్చారు. నల్లపాడు పోలీసులు మంగళవారం తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయానికి చేరుకుని నోటీసులను కార్యాలయ కార్యదర్శి అప్పిరెడ్డికి అందజేశారు. ప్రమాదానికి కారణమైన ఏపీ 40 డీఎస్ 2349 వాహనాన్ని నల్లపాడు పోలీసులు తమ వెంట తీసుకెళ్లారు. కాగా గుంటూరు మిర్చియార్డు పర్యటనపై కూడా జగన్పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు వైసీపీ నేతలకు నల్లపాడు పోలీసులు నోటీసులిచ్చారు. ఫిబ్రవరి 19వ తేదీన మిర్చి రైతుల పరామర్శ కోసం జగన్ యార్డుకు వచ్చారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉన్నప్పటికీ…దానిని ఖాతరు చేయకుండా వైపీపీ నేతలు అనుమతి లేకుండా వచ్చారన్న ప్రచారం ఉంది. మార్కెటింగ్ శాఖ అధ్వర్యంలో నడిచే యార్డులో జగన్ రాజకీయ ప్రసంగం చేశారు. దీనికి సంబంధించి జగన్తో పాటు వైసీపీ నేతలు అంబటి రాంబాబు, లేళ్ల అప్పిరెడ్డి, కావటి మనోహర్నాయుడు, మోదుగుల వేణుగోపాల్రెడ్డి తదితరులపై కూడా కేసు నమోదైంది. ఇప్పటికే పోలీసులు వారికి 41ఏ నోటీసులు ఇచ్చారు. పిలిచినప్పుడు నల్లపాడు పీఎస్కు విచారణకు రావాలని సూచించారు. సత్తెనపల్లి నియోజకవర్గంలోని రెంటపాళ్ల పర్యటనలో సింగయ్య అనే వైసీపీ కార్యకర్త మృతిపై ఇప్పటికే జగన్పై కేసు నమోదైన విషయం తెలిసిందే. ప్రమాదం జరిగినప్పుడు జగన్ కారు డ్రైవర్గా ఉన్న ఒంగోలు ఏఆర్ కానిస్టేబుల్ రమణారెడ్డిని నల్లపాడు పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. ప్రమాదం జరిగిన సమయంలో వాహనం కింద వ్యక్తి పడినట్లు గుర్తించారా?, ఆ సమాచారాన్ని జగన్కు తెలియజేశారా?, ఘటన జరిగిన వెంటనే వాహనం ఆపకుండా ఎందుకు వెళ్లిపోయారు? తదితర విషయాలపై పోలీసులు ఆరా తీసినట్లు సమాచారం. మరోవైపు జగన్ పర్యటనకు సంబంధించి వీడియోలను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించిన విషయం విదితమే. దీంతో జగన్పై టీడీపీ నుంచి పెద్దఎత్తున విమర్శలు వచ్చాయి. సొంత పార్టీ కార్యకర్త చనిపోయినా పట్టించుకోకుండా వెళ్లిపోయారని టీడీపీ నేతలు ధ్వజమెత్తారు. జగన్పై రెండు కేసులు నమోదుతో కావడంతో…జగన్కు వస్తున్న ప్రజాదరణను చూసి ఓర్వలేకే తప్పుడు కేసులు బనాయిస్తున్నారంటూ వైసీపీ నేతలు మండిపడుతున్నారు.