. 2047 నాటికి 50 శాతం పచ్చదనం
. సుందర నగరంగా అమరావతి
. గతంలో సీఎం హెలీకాఫ్టర్లో వస్తే చెట్ల నరికివేతా?
. ప్రపంచ పర్యావరణ దినోత్సవంలో చంద్రబాబు
. రాజధానిలో పవన్తో కలిసి మొక్కలు నాటిన సీఎం
విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : ఒక్కరోజే కోటి మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం ఎంతో ఆనందానిస్తోందని, వచ్చే పర్యావరణ దినోత్సవం నాటికి రాష్ట్రంలో 5.58 కోట్ల మొక్కలు పెంచాలని సంకల్పిం చామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. ‘రాష్ట్రంలో 37,421 చదరపు కిలోమీటర్ల పరిధిలో అడవులున్నాయి. రాష్ట్ర విస్తీర్ణంలో ఇది 23 శాతం. అటవీయేతర ప్రాంతంలోని పచ్చదనంతో కలిపి రాష్ట్రంలో 30.05 శాతం పచ్చదనముంది. దీన్ని 2047 నాటికి 50 శాతానికి తీసుకెళ్లడం లక్ష్యంగా పెట్టుకున్నాం. పచ్చదనంలో మనం దేశానికే ఆదర్శంగా నిలవాలి. గత పాలకులు ఫొటోల కోసమే మొక్కలు నాటేవారు. ప్రస్తుతం గ్లోబల్ వార్మింగ్ ప్రపంచానికి సవాలు విసురుతోంది. వర్షాలు కురవడం తగ్గిపోయింది. భూగర్భ జలాలు ఇంకిపోతున్నాయి. సాగు ప్రమాదంలో పడుతోంది. ఫ్లోరైడ్ పెరిగి ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారు. ఈ ప్రమాదం నుంచి బయటపడేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి’ అని సీఎం పిలుపునిచ్చారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా గురువారం రాజధాని ప్రాంతం తుళ్లూరు మండలం అనంతవరంలో చేపట్టిన వన మహోత్సవం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏడీసీఎల్ పార్కులో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్తో కలిసి మొక్కలు నాటారు. సభా వేదిక వద్ద పర్యావరణ పరిరక్షణ నిమిత్తం కాలుష్య మండలి ఏర్పాటు చేసిన స్టాళ్లను చంద్రబాబు, పవన్ కల్యాణ్ పరిశీలించారు. ఈ సందర్భంగా పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేస్తామని సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు నారాయణ, కందుల దుర్గేష్, ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రమాణం చేశారు. చంద్రబాబు మాట్లాడుతూ పర్యావరణాన్ని పరిరక్షించడం అందరి బాధ్యత కావాలని, స్వచ్ఛాంద్ర లక్ష్య సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. చెట్లను పెంచని వారు స్వచ్ఛమైన గాలిని ఆశించడం సమంజసమా? అని ప్రశ్నించారు.
గత ముఖ్యమంత్రి హెలికాప్టర్లో వస్తున్నాడంటే కింద రోడ్ల పక్కనున్న చెట్లు నరికేసేవారని, మేం పర్యటనలకు వస్తుంటే ఎక్కడైనా చెట్లు నరుకుతున్నారా? అని ప్రశ్నించారు. ప్రభుత్వ అనుమతి లేకుండా చెట్లు నరకకూడదని, వనజీవి రామయ్య నా దగ్గరకు ఎప్పుడు వచ్చినా మొక్క తెచ్చేవారని, ఆయన జీవితమంతా ఊరూరా తిరిగి మొక్కలు పెంపకంపై అవగాహన కల్పించారని, ఆయన మనందరికీ స్ఫూర్తిదాయకమని సీఎం అన్నారు. నా మనసుకు దగ్గరయిన పర్యావరణ శాఖను ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నిర్వహించడం సంతోషాన్నిస్తోందని ప్రశంసించారు. ప్లాస్టిక్ చాలా ప్రమాదకరమని, ప్రకృతిని నాశనం చేస్తోందన్నారు. పశువులు ప్లాస్టిక్ తింటే… వాటి పాలు మనం తాగుతున్నామని, కుళ్లిన చికెన్ను చేపలకు మేతగా వేస్తున్నారని, అందుకే పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా స్వచ్చాంధ్ర కార్యక్రమం నిర్వహిస్తున్నామని, చెత్త నుంచి సంపద సృష్టించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని వివరించారు. గుంటూరు, విశాఖలో చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే ప్లాంట్లు ఏర్పాటు చేశామని చెప్పారు. గత ప్రభుత్వం దీనిపైన నిర్లక్ష్యంగా వ్యవహరించగా, తమ ప్రభుత్వ హయాంలో పట్టణాలలో 90 శాతం పొడి చెత్తను ఎనర్జీకి ఉపయోగిస్తామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వేస్ట్ కంపోస్టు కేంద్రాలు నెలకొల్పామని, రీ సైక్లింగ్ కింద ఇప్పటికే 87 మునిసిపాలిటీల్లో 157 రెడ్యూస్, రీ యూజ్, రీ సైకిల్ సెంటర్లు ఏర్పాటు చేశామని చెప్పారు.
ఈ ఏడాది అక్టోబరు 2 నాటికి 17 కార్పొరేషన్లు, వచ్చే ఏడాది జూన్ 5 నాటికి మొత్తం రాష్ట్రాన్ని సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ రహితంగా మార్చుతామని, 175 నియోజకవర్గాల్లోనూ నగర వనాలు ఏర్పాటు చేస్తామని సీఎం వెల్లడిరచారు. అమరావతి రాజధాని భవిష్యత్ తరాలకు దిక్సూచిగా మారుతుందన్నారు. ఈ నెల 21న ప్రధాని మోదీ అధ్వర్యంలో విశాఖలో అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుగుతుందని తెలిపారు. ఒకేరోజు 5 లక్షల మంది యోగా చేసేలా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 2 కోట్ల మంది లక్ష కేంద్రాల్లో యోగా సాధన చేసి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, యోగా మన జీవితంలో భాగం కావాలన్నారు.
కోటి మొక్కలు నాటి… వాటిని సంరక్షించడమే లక్ష్యం: ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్
కోటి మొక్కలు నాటి… వాటిని సంరక్షించడమే తమ లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. అడవిలో కార్చిచుల నివారణకు, పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేస్తానన్నారు. మానవ జీవితంలో ప్రకృతికి ఎంతో ప్రాధాన్యం ఉందని తెలిపారు. ఒకప్పుడు ఇంటి చిరునామాకు మొక్కలు, చెట్లు ఆనవాళ్లుగా ఉన్నాయని వెల్లడిరచారు. ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవు కానీ, ప్రకృతిని ప్రేమించే వ్యక్తి మనకు సీఎంగా ఉన్నారని చెప్పారు. పర్యావరణ పరిరక్షణ కోసం చిత్తశుద్ధితో కృషి చేద్దామని పిలుపునిచ్చారు.