Wednesday, May 28, 2025
Homeఅడ్మిన్‌ భవనం ముట్టడి

అడ్మిన్‌ భవనం ముట్టడి

. విశాఖ ఉక్కు కార్మికుల సమ్మె ఉధృతం
. అడ్డుకున్న పోలీసులు… ఉద్రిక్తం
. మరో 1500 మంది తొలగింపునకు రంగం సిద్ధం

విశాలాంధ్ర – గాజువాక : ఉక్కు ప్రైవేటీకరణ నిలుపుదల చేయాలని, తొలగించిన కాంట్రాక్టు కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ ఉక్కు కర్మాగారం కాంట్రాక్టు కార్మికుల నిరావధిక సమ్మె మంగళవారం ఉధృతంగా మారింది. వారం రోజులుగా విధులు బహిష్కరించి సమ్మె చేస్తున్న ఉక్కు కాంట్రాక్టు కార్మికులు ఉదయం ఉక్కు అడ్మిన్‌ భవనాన్ని ముట్టడిరచారు. వందలాదిమంది ఉక్కు కాంట్రాక్టు కార్మికులు అడ్మిన్‌ బిల్డింగ్‌ ముట్టడికి ప్రయత్నం చేయడంతో పోలీసులు అడ్డుకున్నారు. కార్మికులు, పోలీసులకు మధ్య తోపులాట జరగడంతో కార్మిక నాయకుడు భాస్కర్‌ అస్వస్థతకు గురయ్యారు. దీంతో అతనిని ఆస్పత్రికి తరలించారు. కాగా విశాఖపట్నం స్టీల్‌ ప్లాంటు యాజమాన్యం కార్మికులను రెచ్చగొట్టే ధోరణితో వ్యవహరిస్తోంది. ప్లాంటులో మొత్తం 13,250 మంది కాంట్రాక్టు కార్మికులు ఉండగా… వారిలో 33 శాతం మందిని తొలగించాలని యాజమాన్యం లక్ష్యంగా పెట్టుకుంది. అందులో భాగంగా ఏప్రిల్‌ నెలలో 1,731 మందిని తొలగించింది. కాంట్రాక్టు కాలం పూర్తయిన మరో వేయి మందికి గేట్‌పాస్‌లు ఇవ్వకుండా గాలిలో ఉంచింది. మరో రెండు వేల మందిని తీసేయడానికి ఏర్పాట్లు చేసుకుంది. దీనిని వ్యతిరేకిస్తూ కాంట్రాక్టు కార్మికులు ఈ నెల 20వ తేదీ నుంచి నిరవధిక సమ్మెకు దిగారు. అయితే యాజమాన్యం ఏదో ఒక కారణం చూపించి తమను తొలగించడానికి చూస్తున్నదని తెలుసుకున్న కొంతమంది సమ్మెకు దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. కార్మికుల సమ్మెతో ఉత్పత్తి బాగా తగ్గింది. ప్రతిరోజు రెండు బ్లాస్ట్‌ ఫర్నేస్‌ల ద్వారా 14 వేల టన్నుల హాట్‌ మెటల్‌ తయారవుతుండగా… శనివారం ఇది పది వేల టన్నులకు పడిపోయింది. కాంట్రాక్టు కార్మికుల సమ్మె ప్రభావం కనిపించకూడదని యాజమాన్యం ఇతర శాశ్వత ఉద్యోగులకు ఆఫీసర్లతో సహా 8 గంటలకు బదులు 12 గంటల విధులు నిర్వహించాలని ఆదేశించి… షిఫ్టులు వేస్తోంది. అయితే కాంట్రాక్టు కార్మికుల పనులను అధికారులు చేయలేకపోవడంతో ఉత్పత్తి తగ్గుముఖం పడుతోంది. దీనిని భరించలేని యాజమాన్యం సోమవారం రాత్రి మరో 1,480 మంది కాంట్రాక్టు కార్మికులను తొలగిస్తూ ఉత్తర్వులు తయారు చేసింది. అవి ఏ క్షణంలోనైనా బయటకు వచ్చే అవకాశం ఉంది. వారిలో గత ఐదు రోజులుగా సమ్మె చేస్తున్న వారితో పాటు వారికి నాయకత్వం వహిస్తున్న కార్మిక సంఘ నాయకులు కూడా ఉన్నారని తెలిసింది. మరోవైపు, గత నెలలో కాంట్రాక్టు కార్మికులను తొలగించినపుడు పెద్దఎత్తున ఆందోళన చేశారు. యాజమాన్యంతో చర్చలు జరిగాయి. మే నెల 20వ తేదీ వరకు కార్మికులను తొలగించబోమని స్పష్టమైన హామీ ఇచ్చింది. ఆ తరువాత తొలగింపునకు చర్యలు చేపట్టడంతో వారు సమ్మెకు దిగారు. తాజాగా సోమవారం నగరంలో కార్మిక శాఖ అధికారుల వద్ద రెండు వర్గాలకు చర్చలు జరిగాయి. ఇలా చర్చలు జరిగేటప్పుడు జనరల్‌ మేనేజర్‌ స్థాయి అధికారి హాజరవుతారు. సోమవారం మాత్రం మేనేజర్‌ స్థాయి కలిగిన జూనియర్‌ అధికారిని యాజమాన్యం పంపించింది. యాజమాన్యాన్ని ఒప్పించే స్థాయి ఆ అధికారికి లేదని గుర్తించిన కార్మిక శాఖాధికారి… ఆయనను వెనక్కి పంపించేశారు. దాంతో చర్చలు విఫలమయ్యాయి.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు