. ట్రంప్ వైఖరిపై స్పందించలేని మోదీ
. దేశంలో ఎమర్జెన్సీ తరహా పాలన
. పథకాలతో అధికారం రాదు
. సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ
. సూపర్ 6 హామీలు, ప్రజా సమస్యలపై ఉద్యమాలకు సిద్ధం: రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ
విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : దేశంలో ఎన్డీఏ కూటమికి ఇండియా ఐక్య సంఘటనే ప్రత్యామ్నాయమని… ఇండియా ఐక్య సంఘటన పటిష్టతతోనే మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించడం సాధ్యమవుతుందని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె.నారాయణ పునరుద్ఘాటించారు. ఆ దిశగా అన్ని రాష్ట్రాల ‘ఇండియా’ పార్టీలు ఐక్యతతో ముందుకు నడవాలని కోరారు. ఏపీలోనూ ఇండియా ఐక్య సంఘటనను బలోపేతం చేయవలసిన అవసరం ఉందని… అందుకోసం ప్రజా సమస్యలపై సమష్టిగా పోరాడాలన్నారు. సీపీఐ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సమితి సమావేశం విజయవాడ దాసరి భవన్లో బుధవారం కె.శివారెడ్డి అధ్యక్షతన జరిగింది. ఇటీవల అమరులైన వారికి రెండు నిమిషాల పాటు మౌనం పాటించి సమావేశం సంతాపం ప్రకటించింది. ఆగస్టు 23 నుంచి 25 వరకు ఒంగోలులో జరగనున్న సీపీఐ రాష్ట్ర 28వ మహాసభల ఆహ్వాన సంఘ కరపత్రాన్ని నారాయణ విడుదల చేశారు. అనంతరం ఆయన ప్రసంగిస్తూ ప్రస్తుతం దేశంలోని మోదీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తూ, కార్పొరేట్ శక్తులకు కొమ్ముకాస్తోందన్నారు. ఇరాన్, ఇజ్రాయిల్ మధ్య నెలకొన్న యుద్ధంలో అమెరికా ఆధిపత్యం కొనసాగిస్తోందని, దీనిపై ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం తన వైఖరిని స్పష్టం చేయలేదని అన్నారు. ఈ యుద్ధం వెనుక కీలకంగా ఉన్న అమెరికాతో ఎందుకు చర్చలు జరపలేకపోయారని నిలదీశారు. ఇరాన్ నుంచి మన దేశానికి చమురు నిక్షేపాలు వస్తున్న తరుణంలోను కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోలేకపోయిందని మండిపడ్డారు. పైపెచ్చూ ఇంతటి సంక్లిష్ట పరిస్థితుల్లో మోదీ… ఆంధ్ర ప్రదేశ్కు విచ్చేసి యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నారని ఎద్దేవా చేశారు. రాబోయే రోజుల్లో కమ్యూనిస్టు ఉద్యమ పంథాను మార్చాల్సిన అవసరముందన్నారు. శ్రీలంక, బంగ్లాదేశ్లో జరిగిన పరిణామాల గురించి ఆయన వివరించారు. 2026 నాటికల్లా మావోయిస్టులను అంతం చేస్తామంటూ కేంద్ర హోం మంత్రి అమిత్ షా వ్యాఖ్యానించడాన్ని తప్పుపట్టారు. మావోయిస్టుల సాకుతో అమాయక గిరిజనులను బలి తీసుకుంటున్నారని, అటవీ సంపద, మైనింగ్ను బడా కార్పొరేట్లకు అప్పజెప్పడమే దీని వెనుకున్న అసలు రహస్యమని అన్నారు. దేశంలో సంపద పెరుగుతుందంటూ ప్రభుత్వం లెక్కలు చెబుతోందని, వాస్తవంగా 1 శాతం ధనికుల చేతుల్లోనే 45 శాతం సంపద ఉంటోందని, అధిక శాతం ఉన్న పేదలకు సంపద దూరమవుతున్నదని విమర్శిం చారు. ఒకే భాష, ఒకే ఎన్నిక పేరుతో దేశంలో విచ్ఛిన్న రాజకీయాలకు పాల్పడుతున్నారని, ప్రజాస్వామ్య వ్యవస్థకే తీవ్ర ప్రమాదం తెచ్చేలా మోదీ విధానాలున్నాయని ధ్వజమెత్తారు. నాటి ఇందిరాగాంధీ హయాంలో విధించిన ఎమర్జెనీ తరహాగా దేశంలో పాలన కొనసాగుతోందన్నారు. జనగణనను 2029 నాటికల్లా పూర్తి చేయాల్సిం దేనని… దాంతో పాటు బీసీల కులగణనపై ఒక స్పష్టత తీసుకొచ్చి, వారికి జనాభా ప్రాతిపదికన చట్టసభల్లో సీట్లు కేటాయించేలా చట్టం తీసుకురావాలని నారాయణ డిమాండ్ చేశారు. రాబోయే రోజుల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అనాలోచిత విధానాలపై జరిగే పోరాటాల్లో విద్యార్థి, యువజన, మహిళా సంఘాలను భాగస్వామ్యులను చేయాలన్నారు. కేవలం సంక్షేమ పథకాలతోనే ప్రభుత్వాలు అధికారంలోకి రావని, అందుకు నిదర్శనంగా 2019లో చంద్రబాబు ప్రవేశపెట్టిన పసుపుకుంకుమ పథకంతో అధికారంలోకి రాలేకపోయారని గుర్తుచేశారు. అనంతరం అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రతి నెలా బటన్ నొక్కుతూ సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టినా అధికారానికి దూరమవ్వక తప్పలేదన్నారు. దీనినిబట్టి సంక్షేమం ఒక్కటే కాదనీ, రాజకీయంగా సక్రమమైన పరిపాలన చేయగలిగితేనే ప్రభుత్వాలు నిలవగలుగుతాయని సూచించారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ హయాంలో పాలనాపరమైన తప్పుల నుంచి ప్రస్తుత ఎన్డీఏ కూటమికి నేతృత్వం వహిస్తున్న చంద్రబాబు ఏడాది పాలన వరకు జరిగిన పరిణామాలను వివరించారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వానికి అధికార, ప్రతిపక్షాలు మద్దతివ్వడం సిగ్గుచేటన్నారు. నాడు జగన్ అధికారంలోకి వచ్చాక కనీసం ప్రతిపక్షాలు వినతులు ఇచ్చేందుకు కూడా అవకాశం ఇవ్వకపోడం, 3 రాజధానుల ప్రకటన, ప్రజా ఉద్యమాల అణచివేత వంటి నిర్ణయాలతోనే గద్దె దిగారన్నారు. ప్రధానంగా జగన్ అనుకూలం, వ్యతిరేకం అనే దిశగా 2024 ఎన్నికలు కొనసాగాయని విశ్లేషించారు. ఆయా అంశాలపై సీపీఐ ఎనలేని పోరాటాలు చేసిందని గుర్తుచేశారు. ప్రస్తుతం చంద్రబాబు ప్రభుత్వ ఏడాది పాలనలోను ప్రజలకిచ్చిన వాగ్దానాల అమలుపై స్పందన కొరవడిరదన్నారు. సూపర్ 6 తో పాటు మిగిలిన హామీలపై కదలికలేదని, వాటిపై ప్రజలను, పార్టీ శ్రేణులను చైతన్యవంతులను చేయాలని సూచించారు. సీపీఐ అధ్వర్యంలో పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్ల ఇళ్ల స్థలాల అంశాలపై పెద్ద ఎత్తున వినతుల స్వీకరణ, ఉద్యమాలు చేపట్టిందని, దీనిపై చంద్రబాబు మంత్రి మండలి సమావేశాల్లోనూ చర్చకు వచ్చిందన్నారు. చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా ప్రైవేటీకరణపై దృష్టి పెట్టిందని ధ్వజమెత్తారు. అధికారంలోకి వచ్చాక ఏపీ అంటే అమరావతి, పోలవరం అని చంద్రబాబు చెప్పి... ఇప్పుడు గోదావరి
బనకచర్ల అందుకున్నారని మండిపడ్డారు. రాయలసీమతో పాటు ఉత్తరాంధ్రలో అనేక జల ప్రాజెక్టులు పెండిరగ్లో ఉన్నాయని, వాటిని పూర్తి చేయకుండా, ఏకంగా రూ.82 వేల కోట్లతో బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణానికి సన్నద్ధమవ్వడం తగదని, భవిష్యత్లో ఈ ప్రాజెక్టు అంచనాలు రూ.2 లక్షల కోట్లకు చేరే ప్రమాదం ఉందని వివరించారు. అమరావతి రాజధానికి ఉన్న భూములు చాలక మరో 44 వేల ఎకరాలు తీసుకోవడం తగదన్నారు. ఇప్పటికే రూ.32 వేల కోట్లు రాజధాని పేరిట అప్పులు తెచ్చారని, మరో రూ.32 వేల కోట్లకు సిద్ధమయ్యారని, ఆ దిశగా చూస్తే మొత్తంగా ఒక్క అమరావతికే లక్ష కోట్ల రూపాయల అప్పులు తెచ్చే పరిస్థితి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. నాడు జగన్ 10 లక్షల కోట్ల అప్పులు తెచ్చి… రాష్ట్రాన్ని శ్రీలంకగా మార్చారంటూ విస్తృతంగా ప్రచారం చేసిన చంద్రబాబు ఇప్పుడు అదే విధంగా అప్పులు చేయడాన్ని తప్పుపట్టారు. చంద్రబాబు విజన్ 2047, పీ4 విధానాలతో ప్రయోజనం ఏమీలేదని తేల్చి చెప్పారు. పార్టీ శ్రేణులంతా సూపర్ 6 పథకాల అమలుతో పాటు పెంచిన విద్యుత్ చార్జీలు, ప్రజా సమస్యలపై ఉద్యమాలకు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు అక్కినేని వనజ, రాష్ట్ర సహాయ కార్యదర్శులు ముప్పాళ్ల నాగేశ్వరరావు, జేవీ సత్యనారాయణమూర్తి, రాష్ట్ర కార్యదర్శి వర్గ, కార్యవర్గ, సమితి సభ్యులు పాల్గొన్నారు.