. 116 ప్రాంతాల్లో అత్యధిక ఉష్ణోగ్రత
. నేడు కూడా ఇదే పరిస్థితి
. అప్రమత్తంగా ఉండాలి: విపత్తుల శాఖ
విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : రాష్ట్రంలో రోజురోజుకూ ఎండతీవ్రత పెరుగుతోంది. రోహిణీ కార్తె రాకముందే ఎండలు ఈ స్థాయిలో మండిపోతుండడంతో ప్రజలు బేంబేలెత్తుతున్నారు. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 116 ప్రాంతాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో ఉదయం నుంచే రోడ్లు నిర్మానుష్యంగా మారాయి. పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం కాకానిలో 43.7 డిగ్రీలు, బాపట్ల జిల్లా ఇంకొల్లులో 43.5, ప్రకాశం జిల్లా జువ్విగుంటలో 43.3, ఎన్టీఆర్ జిల్లా మొగులూరులో 43.1, తూర్పుగోదావరి జిల్లా చిట్యాల 42.8, ఏలూరులో 42.6 , విజయనగరం జిల్లా ధర్మవరంలో 42.5, తిరుపతి జిల్లా గూడూరు 42.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు తెలిపారు. ఒక్క పల్నాడు జిల్లాలోనే 21 ప్రాంతాల్లో, ఎన్టీఆర్ 15, ప్రకాశం 12, బాపట్ల 9, గుంటూరు 8 సహా ఇతర చోట్ల కలిపి 116 ప్రాంతాల్లో 41 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదైనట్లు విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. మంగళవారం కూడా ఇదే తీవ్రత కొనసాగుతుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు. అనేక ప్రాంతాల్లో 42 నుంచి 43.5 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందన్నారు. మండలాల వారీగా శ్రీకాకు ళం-4, విజయనగరం-2, పార్వతీపురం మన్యం-11, తూర్పుగోదావరి జిల్లా1, కాకినాడ జిల్లాలో మూడు మండలాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదు కానుండగా... తీవ్రవడగాలులు
21, మరో 32 మండలాల్లో వడగాలులు ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు తెలిపారు. అలాగే ఈనెల 14వ తేదీ 22 మండలాల్లో తీవ్ర, 36 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉండగా, 15వ తేదీ రాష్ట్రంలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఎండలో బయటకు వెళ్లేప్పుడు తలకు టోపీ ధరించాలని లేదా రూమాలు కట్టుకోవాలని, తెలుపురంగు గల కాటన్ వస్త్రాలను ధరించాలని సూచించారు. అదేవిధంగా కళ్ల రక్షణ కోసం సన్ గ్లాసెస్ ఉపయోగించాలని, చెవుల్లోకి వేడిగాలి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. గుండె సంబంధిత వ్యాధులు, షుగర్, బీపీ ఉన్నవారు ఎండలో తిరగకూడదని, శారీరక శ్రమతో కూడిన కఠిన పనులను ఎండలో చేయరాదని సూచించారు. రాయలసీమ జిల్లాల్లో మంగళవారం చెదురుమదురుగా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. పిడుగులు, ఈదురుగాలులు పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, హోర్డింగ్స్, చెట్ల క్రింద, శిథిలావస్థలో ఉన్న గోడలు, భవనాలు దగ్గర నిలబడవద్దని కూర్మనాథ్ సూచించారు.