భద్రతా బలగాలకు చిక్కిన ఉగ్ర కమాండర్?
శ్రీనగర్ : జమ్మూకశ్మీర్లో మరోసారి కాల్పుల మోత మోగింది. కుల్గామ్లో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య భీకరంగా ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. భారత్లోకి అక్రమంగా ప్రవేశించేందుకు ప్రయత్నించిన ఇద్దరు ఉగ్రవాదుల్ని భారత్ సైన్యం మట్టుబెట్టిన కొన్ని గంటలకే తంగ్మార్గ్ ప్రాంతంలో ఈ ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్లో ‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్’ కీలక కమాండర్ భద్రతా బలగాలకు చిక్కినట్లు సమాచారం. నిన్నటి పహల్గాం ఘటనకు పాల్పడిరది తామేనంటూ ‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్’ ప్రకటించుకున్న సంగతి తెలిసిందే. మరోవైపు నేటి తెల్లవారుజామున ఇద్దరు ఉగ్రవాదులు భారత్లోకి చొరబడేందుకు యత్నిస్తుండగా.. వారిని సైన్యం కాల్చి చంపింది. ఎన్కౌంటర్ అనంతరం భారీగా మందుగుండు సామగ్రి, ఆయుధాలు, పాకిస్థాన్ కరెన్సీ భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి.
ఉగ్రవాదుల జాడ తెలిపితే రూ.20 లక్షల బహుమానం
పహల్గాంలో దాడికి పాల్పడ్డ ఉగ్రవాదుల సమాచారం చెప్పిన వారికి జమ్మూకశ్మీర్ పోలీసులు రివార్డు ప్రకటించారు. ‘‘ఈ పిరికిపంద దాడికి పాల్పడిన ఉగ్రవాదులను మట్టుపెట్టడానికి దారితీసే సమాచారం ఇచ్చిన వారికి రూ. 20 లక్షల నగదు బహుమతిని ఇస్తాం’’ అని అనంత్ నాగ్ పోలీసులు ప్రకటించారు. ఇప్పటికే జమ్మూకశ్మీర్ వ్యాప్తంగా ఉగ్రవాదుల కోసం భద్రతా బలగాలు విస్తృతంగా గాలిస్తున్నాయి.