పుస్తకాలు చదవడం తగ్గుముఖం పడుతున్న ఈ తరుణంలో… ప్రజల మధ్యకే కవిత్వం తీసుకువెళ్ళాలన్న లక్ష్యంతో …‘ప్రేమ…శాంతి…జ్ఞానం’ అనే అంశాలపై ప్రజలలో అవగాహన కలిగించే రీతిలో రూపొందినదే ‘కవియాత్ర’. కరీంనగర్కు చెందిన కవి, పోలీస్ కానిస్టేబుల్ అయిన కారం శంకర్ ఊహకు పురుడుపోసుకున్న ఈ ‘కవియాత్ర’, గత ఎనిమిది సంవత్సరాలుగా తెలంగాణలో అనేక చారిత్రాత్మక ప్రదేశాలలో జనకూడళ్లలో ఘనంగా జరుగుతూ…సాగుతూ ఇప్పుడు…అంటే… ఈ ఏడు ఏప్రిల్ 20న ‘ఖమ్మం ఖిల్లా నుంచి నేలకొండపల్లి బౌద్ధారామం వరకు’ జనాల మధ్యన… జ్ఞాన సంపద కలిగిన కవులచే కవితా గానాలతో ప్రజల్ని ఆకర్షింపజేసే విధంగా, ఆలోచింపచేసే విధంగా సాగింది. ప్రముఖులు, వర్ధమాన కవులు అనే తారతమ్యం లేకుండా, అందర్ని ఒకే వేదికపైకి తెస్తూ, సుదూర ప్రాంతాల కవుల మధ్య స్నేహ పూర్వక అభిమానాలు, పరిచయాలు పెంపొందించే దిశను కలిగిస్తూ… సాహిత్యంపై అవగాహన కలిగించి… తద్వారా సమాజంలోని రుగ్మతలను రూపుమాపి మనిషిని మహోన్నతంగా తీర్చిదిద్దాలనే తలంపు గల ఈ కార్యక్రమ లక్ష్యం అణువణువునా కానవచ్చింది. ఈసారి ఖమ్మంలోని ‘వికాస వేదిక సాహిత్యసంస్థ’ వారి సంయుక్త సహకారంతో సాగిన ఈ ఖమ్మం ‘కవియాత్ర’కు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, చెన్నై, మహారాష్ట్ర రాష్ట్రాల నుంచి… కరీంనగర్, నిర్మల్, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్, వరంగల్ వంటి సుదూర తీరాల నుంచి స్థానిక కవుల వరకు దాదాపు 50మంది కవులు విచ్చేసి పాల్గొనడం విశేషం.
ఎక్కడ నుంచి ఎక్కడి వరకు: తొలుత ఖమ్మం ఖిల్లా వద్ద గుమిగూడిన కవులతో ప్రారంభమైన ఈ ‘కవియాత్ర’ బస్సుకు స్థానిక కవి, ప్రముఖ వైద్యులు డా.గిరిసింహరావు జెండా ఊపి ప్రారంభించారు. తరువాత ఖమ్మంలోని ముఖ్య కూడళ్లైన మయూరి సెంటర్ -ఖమ్మం జిల్లా గ్రంథాలయ ప్రాంగణం లోను, నయా బజార్ కాలవొడ్డు, సూర్యాపేట క్రాస్రోడ్డు, ముదిగొండ, గోకినేపల్లి, గువ్వలగూడెం, నేలకొండపల్లి ప్రకృతి చికిత్సాలయం, బౌద్ధారామం చారిత్రక ప్రదేశాల వరకు సాగింది. మధ్య మధ్యలో ప్రతి అరగంట నుంచి గంట కాలవ్యవధిలో కవులు చేసిన కవితాగానాన్ని అక్కడి స్థానిక ప్రజలు ఆసక్తిగా, విచిత్రంగా తిలకించడం అన్నది ఈ ‘కవియాత్ర’కు ఏవిధంగా ప్రయోజనం కలిగించిందో నిదర్శనంగా చెప్పవచ్చు. యుద్ధాలను వ్యతిరేకిస్తూ, ప్రజలకు శాంతి సందేశాలను వ్యక్తపరుస్తూ సాగిన ఈ కవియాత్రలో కవితా గానంతో పాటు … కవియాత్ర లక్ష్యాన్ని వివరిస్తూ సాగిన పాట బస్సుకు ఇరువైపులా కట్టి వున్న మైకుల ద్వారా హోరెత్తిస్తూ దారి పొడగునా ప్రజల్ని చైతన్యపరిచింది. అయితే ఈ కవితా గానంలో ఇటీవల మరణించిన వన ఉద్యమకారుడు పద్మశ్రీ డాక్టర్ దరిపల్లి రామయ్యపై రాసిన పాటలు, కవితలు ప్రత్యేక ఆకర్షణగా అనేకుల్ని ఆకట్టు కున్నాయి. యాత్ర మధ్యలో మధ్యాహ్నం విందు కోసం గువ్వల గూడెంలోని సాహిత్య అభిమాని నివాసం వద్ద ఏర్పాటు చేయగా, వచ్చిన ప్రతి వ్యక్తికి చక్కని భోజనం దగ్గరుండి వడ్డించడం… యాత్ర మధ్యమధ్యలో కవుల్లో కొందరు శీతలపానీయాలు అందించి కవులను సేదతీర్చడం అన్నవి ఈ యాత్రలో అపురూప తీపి జ్ఞాపకాల్ని కలగజేసాయి.
ముఖ్యంగా నేలకొండపల్లి సెంటర్లో జరుగుతున్న కవియాత్ర కవిగా గానం అక్కడి ప్రజలని ఆకర్షించడంతో పాటు అటుగా వెళుతున్న అడిషనల్ డిజిపి, నటులు శ్రీరాందాస్ తేజా కూడా ఈ యాత్రలో పాల్గొని కవులకు మంచి ఉత్తేజం, ఉత్సాహం కలిగించే రీతిలో ప్రసంగించడం స్థానికుల్ని సైతం ఆకర్షింపచేసింది. చివర్లో రామదాసు (కంచెర్ల గోపన్న) పుట్టిన ఊరిలో ఆయన శిలాప్రతిమకి పుష్పమాలాంకృతుల్ని చేసి ఆయనకు ఘన నివాళులర్పించారు. దాదాపు 30 కిలోమీటర్లు సాగిన ఈ ‘కవియాత్ర’ చివరికి నేలకొండపల్లి చారిత్రాత్మక కట్టడ స్థూపం బౌద్ధారామం వరకు సాగింది.
ముగింపు ఉత్సవం: ఈ కవియాత్ర ముగింపు ఉత్సవం నేలకొండపల్లి బౌద్ధారామం వేదిక కాగా, ప్రముఖ కవి సాధనాల వేంకట స్వామినాయుడు రచించిన ‘నీవే ప్రశ్న అయినచోట…?’ కవితాసంపుటిని ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘం ప్రధాన కార్యదర్శి చలపాక ప్రకాష్ ఆవిష్కరించారు. డా.దైత రామకోటేశ్వరరావు సంకలన పరిచిన ‘పాలేరు నుండి పర్ణశాల వరకు’ను కవియాత్ర వ్యవస్థాపకులు కారం శంకర్, పి.విజయబాబు, కొంపెల్లి రామయ్య రచించిన 2 సామాజిక గీతాల సి.డి.ల ఆవిష్కరణను వేదికమీద ఉన్న ఇతర ప్రముఖులు కావించారు. అలాగే ఇంకో విశేష సందర్భం ఏమంటే- సాధనాల వేంకటస్వామినాయుడు చిత్రాన్ని ముఖచిత్రంలో ప్రచురించుకున్న కవయిత్రి జన్ను లక్ష్మి రాసిన కవితాసంపుటి ‘నువ్వు- నేను- ఓ ప్రపంచం’ని సాధనాల వేంకటస్వామినాయుడునే ఆవిష్కరించు కోవడం అన్నది ఓ విచిత్ర సందర్భం. చివర్లో ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఉగాది పురస్కారం పొందిన చలపాక ప్రకాష్, ఎ.శేఖర్బాబు, పున్నయ్య, లతీఫ్లకు అభినందన సత్కారం చేశారు.
అలాగే ఈ కవియాత్రలో పాల్గొన్న ప్రతి ఒక్క కవిని ప్రశంసాపత్రం, శాలువాతో ఉచితరీతిన సత్కరించారు నిర్వాహకులు. ఉదయం నుంచి సాయంత్రం దాకా నిట్టనిలువు ఎండను సైతం లెక్కచెయ్యకుండాసాగిన ఈ కవియాత్రను, అత్యంతరీతిలో విజయ వంతం చేయడంలో సహకరించారు ప్రతి ఒక్కరూ. ఈ కార్యక్రమాలన్నిటినీ తమ భుజం మీద వేసుకొని చేసిన కవియాత్ర జాతీయ ప్రధాన కార్యదర్శి డా. బి.వెంకట్, వికాస వేదిక సాహిత్య సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు సాధనాల వేంకటస్వామినాయుడు, ప్రధాన కార్యదర్శి లెనిన్ శ్రీనివాస్, ఆ సంస్థ సభ్యులు తమ సహకారాన్ని అందించగా… సుదూర ప్రాంతాలను నుంచి చలపాక ప్రకాష్, ఎస్.ఎం.సుభాని, నానా, కుడికాల జనార్ధన్, డా. సీదెళ్ళ సీతాలక్ష్మీ, బుక్కా సత్యనారాయణ, మండాది గోపీనాధ్, అంగోతు జయవాసు, రాజేష్,.. రాజేందర్, నల్ల కృష్ణ వీరభద్రం, జహీరుద్దీన్, గుమ్మడి పుల్లయ్య, శైలజా శ్రీనివాస్, సంధ్య, చిలకబత్తిన వీరబాబు, కృష్ణారావు, మద్దం రమణమూర్తి, పంజాల ఐలయ్య, కట్టెకోల చిన్న నర్సయ్య, గాజుల భారతి, కొత్త శంకర్రెడ్డి, తులసిదాస్ తదితర ప్రముఖ, వర్ధమాన కవులు పాల్గొన్నారు.
– చలపాక ప్రకాష్, 9247475975