హెలికాప్టర్ కూలి పైలట్ సహా ఆరుగురి దుర్మరణం
ఏపీ నుంచి వెళ్లిన ఇద్దరు: ఒకరి మృతి, మరొకరి పరిస్థితి విషమం
డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్, గంగోత్రికి బయల్దేరిన భక్తుల హెలికాప్టర్ కూలిపోయింది. పైలట్ సహా ఆరుగురు చనిపోయారు. తీవ్ర గాయాలతో ఒకరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఈ దుర్ఘటన ఉత్తరకాశి జిల్లాలో గురువారం జరిగింది. ఎయిరో ట్రాన్స్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ (వీటీఓఎక్స్ఎఫ్) సంస్థ నడిపే హెలికాప్టర్... డెహ్రాడూన్లోని సహస్త్రధార హెలిప్యాడ్ నుంచి ఖర్సాలీ హెలిపాడ్కు బయల్దేరింది. గంగోత్రికి వెళ్లే మార్గంలో ప్రమాదానికి గురైంది. రిషికేశ్
గంగోత్రి జాతీయ రహదారి వద్ద ఉదయం 8.45 గంటలప్పుడు కూలిన హెలికాప్టర్ 200`250 మీటర్ల లోతైన లోయలోకి పడిపోయింది. ఈ మేరకు సహాయక చర్యలు చేపట్టిన ఎస్డీఆర్ఎఫ్ తెలిపింది. ఆరుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మరణించినట్లు జిల్లా మెజిస్ట్రేట్ మెహర్బాన్ సింగ్ బిస్త్ తెలిపారు. భక్తుల్లో ఆంధ్రప్రదేశ్కు చెందిన ఎం.భాస్కర్ (51) తీవ్రంగా గాయపడగా, ఆయనను ఎయిర్ లిఫ్ట్ చేసి రిషికేశ్ ఎయిమ్స్లో చేర్చారు. ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్లిన మరొకరు మృతిచెందారు. మృతులను ముంబైకు చెందిన కళా చంద్రకాంత్ సోని (61), విజయ రెడ్డి (57), రుచి అగర్వాల్ (56), యూపీకి చెందిన రాధా అగర్వాల్ (79) ఏపీకి చెందిన వేదవతి కుమారి (48), గుజరాత్కు చెందిన కెప్టెన్ రాబిన్ సింగ్ (60)గా గుర్తించారు. ఈ ఘటనపై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దర్యాప్తునకు ఆదేశించారు. గాయపడిన వారికి అవసరమైన సహాయం అందించాలన్నారు. అధికారుల నుంచి ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకున్నారు. ఈ ప్రమాదంపై విమాన దుర్ఘటనల దర్యాప్తు బ్యూరో (ఏఏఐబీ) విచారణ చేపడుతుందని అధికారులు వెల్లడిరచారు.