Sunday, June 1, 2025
Homeసాహిత్యంగిడుగును మరిచిపోదామా?

గిడుగును మరిచిపోదామా?

కొలకలూరి ఇనాక్‌ ‘మిత్రసమాసం’ పై భాషాశాస్త్ర పరిశీలన

డా॥ కొప్పరపు నారాయణమూర్తి
7671909759

ఇప్పుడు ఈ విషయం ఎందుకు పునశ్చరణ చేసుకోవలసి వచ్చిందంటే ేకొంతమంది సాహిత్యవేత్తలు గ్లోబలైజేషన్‌ నేపథ్యంలో ఇటీవల తెలుగు వ్యవహారిక భాష విస్తృతి విషయమై కొన్ని ప్రతిపాదనలు చేసుకొస్తున్నారు. అందులోఒకటి ఆచార్య కొలకలూరిఇనాక్‌ రాసిన ‘మిత్రసమాసం(2018). ఆచార్య కొలకలూరి ఇనాక్‌ రాసిన ఈ పుస్తకం ఇంచుమించు పైవిషయానికి సంబంధించినదే. అయితే ఏకారణానో ఆయన భద్రిరాజు వారి ‘ఆధునిక భాషగా తెనుగు’ (1977) ప్రసంగం కొనసాగింపుగా తన ఈ పరిశోధన సాగించినట్టు కనబడదు. అలా చేయాలనే నియమమూ లేదు. వేరువేరుగా చేసి ఒకే అభిప్రాయానికి రావచ్చు. లేక భిన్నాభిప్రాయాలు వెలువరచవచ్చు. కాకపొతే ఒక విషయంలో పరిశోధన చేసే ముందు పూర్వ పరిశోధనలను పరిశీలించడం పరిశోధనా పద్ధతుల్లో ఆనవాయితీ. ఒక్కోసారి తమ ముందరి పరిశోధకుల అభిప్రాయాలతో విభేదిస్తుంటే ఎందుకు విభేదిస్తున్నామో కూడా కొందరు పరిశోధకులు ముందుగానే ప్రకటించే సందర్భాలున్నాయి. ప్రాచీన సాహిత్యకారులు, పరవస్తు చిన్నయసూరి మొదలు తెలుగు వ్యాకరణవేత్తలు వ్యవహరించిన వ్యాకరణాంశం ‘వైరిసమాసం’, ‘దుష్టసమాసం’ వంటి పద నిర్మాణాలు. వీటిని తిరస్కరిస్తూ, అన్య దేశ్య పదాలతో తెనుగు పదాల సంయోగం ‘మిత్రమే కాని ‘వైరి’ కాదని ఈ పుస్తకం ద్వారా నిరూపించే ప్రయత్నం చేశారు ఆచార్య ఇనాక్‌ ఈ పరిశోధనలో. అన్య దేశ్యాలను/పర భాషా పదాలను తెలుగుకు అతికి, వ్యావహారికభాష విస్తృతి పెంచేందుకు శాస్త్రీయ ప్రాతిపదికలను రూపొందించే ప్రయత్నంలో భాగంగా రాసినదే ఈ పరిశోధనా గ్రంధం.
ఆశ్చర్యమేమంటే ఆచార్య ఇనాక్‌ ఈ పరిశోధన 1979 ప్రాంతాలలోనే చేశారు. పైగా ఆయన పుస్తకంలోని ‘పూర్వరంగం’ అధ్యాయంలో ఆయన సంప్రదించిన గ్రంథాలను రాసిన వారు అనేక మంది భాషాకోవిదులు, భాషాశాస్త్రవేత్తలు. గిడుగు రామమ్మూర్తి, చిలుకూరి నారాయణరావు, గంటి జోగిసోమయాజి, వజల చినసీతారామస్వామి, ఇనాక్‌ పరిశోధనా గురువు కోరాడ మహాదేవశాస్త్రి, అమరేశం రాజేశ్వరశర్మ, బూదరాజు రాధాకృష్ణ, టి.భాస్కరరావు, బొడ్డుపల్లి పురుషోత్తం వంటి వారు కొందరు నాటి ప్రముఖులు. ఏకారణానో ఈ పరిశోధనాంశంపై భద్రిరాజు వారి ప్రస్తావన పుస్తకం మొత్తం మీద కనపడదు. అప్పటికే భద్రిరాజు వారు ఈ‘ఆధునిక భాష వ్యవహారశైలుల’కు నాయకత్వం వహిస్తున్నారు (నాడు ఈ వ్యాస రచయిత,పి.సూర్యనారాయణ, డెక్కన్‌ క్రానికల్‌, భద్రిరాజు వారి వద్ద ‘ప్రసారమాధ్యమాలు, పత్రికల్లో ఆధునిక భాషగా తెనుగు -ప్రామాణీకరణ’పై పనిచేసున్నాము). అంతేగాక, సంప్రదాయ వైయాకరణులైనవారు ‘వైరిసమాసం’ ను ఎందుకు పరిమితంచేయాలో వివరించే గ్రంథాల చిట్టా(లిస్ట్‌) కూడా ఆచార్య ఇనాక్‌ ఈ పరిశోధనలో పేర్కొన్నారు. ఒకవేళ వారు భద్రిరాజు వారి వ్యాసం చూసి ఉంటే ఈ వ్యాసం వేరుగా రాసి ఉండేవారు.
పుస్తకారంభంలోనే కొలకలూరి ఇనాక్‌ తన పరిశోధనను ఒక్క ముక్కలో చెప్పి చూపించారు ‘‘వైరి సమాసం అనటం తప్పు, మిత్రసమాసం’ అనటం ఒప్పు’ అని. ఇది వారు 1979లో ప్రతిపాదించిన లఘు సిద్ధాంతగ్రంథం. నాడు ప్రచురించనిది సుమారు నాలుగు దశాబ్దాల తరువాత ప్రచురించారు. ఈ పుస్తక లక్ష్యం ఏమిటనేది వారి మాటల్లోనే- ‘ఇంతాచేస్తే నేను ఇందులో చెప్పింది, అర్ధవంతమైన భిన్న భాషల, విభిన్న పదాలకు ఏకార్ధీభావం సాధించండి అని మాత్రమే!’ 2018లో అచ్చయినా ఈ పుస్తక విమర్శనాత్మక సమీక్ష తొలిసారి 2024లోనే అచ్చయింది.
ఈ పుస్తక పూర్తిపాఠం చదివాక భద్రిరాజు కృష్ణమూర్తి 1977 ప్రసంగంలోపైన ఉదహరించిన వాక్యాలు కొలకలూరి ఇనాక్‌ దృష్టికి రాలేదేమో ననిపిస్తుంది. అందువల్లే వాటిని ఇక్కడ ఉటంకించాను. ఈ ప్రసంగంలో భద్రిరాజు వారు తొమ్మిది రకాల అన్య భాషా పద సమూహాలు, వాటి అర్ధాలు, వాటిని మనం ఎలా అన్వయించుకొంటున్నాము, వీటికి వ్యాకరణం అవసరమా, భాష విస్తృతి అవుతున్న కొద్దీ తరగతిలో పిల్లలకు బోధించే తెలుగు వ్యవహార భాషా పరిణామాలకు దగ్గరగా ఎలా ఉండాలి, సంప్రదాయ వ్యాకరణాలు నేర్పితే దాని ప్రయోజనం ఏ మేరకు పరిమితం వంటివి స్థూలంగా చర్చించారు. పైన పేర్కొన్న ఆంధ్రపత్రిక వ్యాసాన్ని భద్రిరాజువారు ‘భాష, సంస్కృతీ, సమాజం’ వ్యాస సంపుటి (2000) లో ‘ఆధునిక భాషగా తెలుగు’ అనే పేరుతో చేర్చారు.
ఇక కొలకలూరి వారి ‘మిత్రసమాసం’ మాటకొస్తే ఈ పుస్తకానికి విమర్శనా సమీక్ష రాస్తూ రాచపాళెంచంద్రశేఖరరెడ్డిగారు -‘ఆయన (ఇనాక్‌) భాషా పరిశోధకుడన్న సంగతి అందరికీ తెలియదు. పరిశోధకులనగానే మనకు భద్రిరాజు కృష్ణమూర్తి, జిఎన్‌. రెడ్డి, చేరా, బూదరాజు రాధాకృష్ణ, చిలుకూరి నారాయణరావు వంటి వాళ్లు తలపుకొస్తారు. సాహిత్య సృజనకారులు పరిశోధకులైతే సాహిత్య పరిశోధకులవుతారు. వాళ్లు సాధారణంగా భాషా పరిశోధకులు కారు. కొలకలూరి సృజన రచయితేగాక, సాహిత్య పరిశోధకుడేగాక, భాషా పరిశోధకుడు కూడా కావడం అరుదైన అంశం. ఆయన భాషా పరిశోధనగ్రంథమే ‘మిత్రసమాసం’ అని పేర్కొన్నారు.
సంప్రదాయ వైయాకరణులు సృష్టించిన ‘వైరిసమాసం’ అనే భావనను తిరస్కరించి కొలకలూరి ‘మిత్రసమాసం’ అనే భావనను సృష్టించారు. ‘వైరి సమాసం’ అభివృద్ధికరమని, దాని వాడుక విస్తృతం కావాలని వారి భావన. వీరి పుస్తకంలో పూర్వరంగం, ‘జన వ్యవహారంబు దృష్టంబు గ్రాహ్యంబు’, భిన్న నామాలతో వైరి పదం, వైరి సమస వ్యవస్థ, లాక్షణిక దృక్పథం కవుల ప్రయోగాలు, వ్యవహారంలో అన్య భాషాపద సమాసాలు, ఆధునిక కవిత్వంలో మిత్రసమాసం, వాస్తు వృత్తి పదకోశంలో మిత్రసమాసం, నామవాచకాలలో మిత్రసమాసం, సినిమా భాషలో మిత్రసమాసం, సైనుబోర్డులలో మిత్రసమాసం, ప్రకటనల్లో మిత్రసమాసం వంటి అధ్యాయాలు ఉన్నాయి.
పుస్తకం చివరలో ఒక చిరు పరిశోధనా పత్రం కనిపిస్తుంది. ‘కొన్ని సంయోగ పద నిర్మాణాలు’ (సం కాంపౌండ్‌ ఫార్మేషన్స్‌ ఇన్‌ తెలుగు) అనే ఈ వ్యాసంలో తెలుగుతో పోర్చుగీస్‌, ఉర్దు, ఆంగ్ల సంయోగాలు ఏర్పడ్డ పధ్ధతి చర్చించారు. ఇందులో తెలుగు పదం తొలిపదంగా ఎరువువచ్చిన అన్య దేశ్యంగా పోర్చుగీస్‌, ఉర్దు, ఆంగ్లపదాలు ఉంటాయి. దీనికిపూర్తి వ్యతిరేకంగా తొలి పదం అన్యదేశ్యం, జత కలిసే తెలుగుపదం ఇవ్వటం జరిగింది. ఇక మూడవరకం పద సంయోగాలు తెలుగుకు సంబంధం లేనివి. కానీ, మనం నిత్యంవాడేవి (ఉదా:అసలు ఫాయిదాలు, అసలు కిలాడి, లాయర్నోటీసు, మిలిటరీహోటల్టీ, కప్పులు, రశీదుబుక్కు, రహదారి బంగ్లా, మొ.) ఇనాక్‌ సాహిత్య శోధనలో శ్రీనాధుని కాలంనుంచే ఎక్కువ సంఖ్యలో పరదేశీ భాషా పదాలు తెలుగులో చేరటం మొదలైందని పేర్కొన్నారు. వైరి సమాసాలు శ్రీనాథ విరచిత‘పల్నాటి వీరచరితం’లో కూడా కనిపిస్తాయని ఆచార్య బిరుదు రాజు రామరాజు పేర్కొనటాన్ని ఉటంకించారు ఆచార్య ఇనాక్‌. ఉదాహరణకు ‘కులపగ’, ‘కులతప్పెటలు’. ఇలాంటి పద బంధాలు కాటమరాజుకథలలో, బాలనాగమ్మ, కాంభోజరాజు కథలలో కనిపిస్తాయని బిరుదురాజు రామరాజు చూపెట్టారు. ‘ఆంగ్లాది ఆదాన పదాలు ఆంధ్రపదంతో సమసించటం వలన పూర్వోత్తర స్థితులలో ఏదైనా పొందవచ్చు. అవి ఒకప్పుడు తత్సమ రూపాలుగా, ఇంకొకప్పుడు తద్భవ రూపాలుగా సమాస స్థితి పొందుతాయి. అవి తెలుగులో సమసించేటప్పుడు లాక్షణిక సంప్రదాయానుసారంగా ఉండకపోవచ్చును. ఉదా:బత్తాయిచెట్టు, బలందామల్లె, ఆంగ్ల ప్రభుత్వం మొ.’ అని ఇనాక్‌ విశ్లేషించారు.
‘ప్రాచీన కావ్యాలలో లక్షణ విరుద్ధ ప్రయోగాలను దోషాలుగా నిరూపించ టానికి లాక్షణికులు కృషిచేశారు. కానీ, అలాంటి ప్రయత్నం ఆంగ్ల, ఉర్దూ పదాలతో ఏర్పడ్డ సమాసాల విషయంలో జరగలేదు. దానివల్ల ఇది అసాధ్యం అవటమే గాదు. అవసరం కావటం కూడా తెలిసి వచ్చింది’ అని ఇనాక్‌ అభిప్రాయపడ్డారు. ‘నిజానికి ఇది అవసరమా?’ అన్నది పెద్ద ప్రశ్ననే.
ఈ క్రమంలో ఎనిమిదవ అధ్యాయంలో తెలుగు, సంస్కృతం పదాలతో పూర్వ, పరంగా చేరిన అన్య దేశ్య పదాలను (ఉర్దూ, పోర్చుగీసు, ఇంగ్లీషు) చూపిస్తూ కొన్ని పద సంయోగాలను పేర్కొన్నారు. ఉదా: ఓడకప్తాను, పచ్చికిలాడి, నమ్మకహరాం, చెప్పులషాపు, పిండిమిషను, మొ.కాకపొతే సమస్య ఏమిటంటే ఇలా పేర్కొనటంలో ఆయన తెలుగుతో అన్య భాషాపదాలు పూర్వాపరంగా సమసించటం వరకు పరిమితం కాలేదు. తెలుగు లిపిలో ఉండే సంస్కృత -ఆంగ్ల, సంస్కృత -ఉర్దు, సంస్కృత పోర్చుగీసు పద సంయోగాలను ఇదేగాటన ఎలాచేర్చారో తెలియటం లేదు. నిజానికి తెలుగుతోకాకుండా మరే ఇతరభాష (ఆఖరుకు అది సంస్కృతమైనా) తో మరే అన్య భాష సమసించినా అది తెలుగుభాష, దాని సమాస పరిధిలోకి రాదు కదా? అలాంటివి కేవలం ‘ అన్య దేశ్య పద సంయోగాలే’ అవుతాయి కానీ ‘సమాసాలు’ ఎలా అవుతాయి. ఈ ‘పద సంయోగాల’ను ‘సమాసం’అని ‘తెలుగు సమాసం’ గాటన కట్టేయడం ఖచ్చితంగా ఆక్షేపణీయమే.
తెలుగు ప్రధానంగా ద్రవిడభాష. సంస్కృతం, పోర్చుగీస్‌, ఉర్దూ ద్రవిడ భాషలు కాదు.వీటన్నింటిని ఒకటే గాట కట్టేయటం ఎలా సబబు? ఆంగ్లం-తెలుగు పద సంయోగాలు సమసించటం వరకూ ఎంతైనా అర్ధం చేసికోగలం. అంత మాత్రాన వాటినైనా సమాసాలు అనవచ్చా? సమాసాలంటే విగ్రహా వాక్యాలు, కర్మధారయాలు చెప్పగలిగి ఉండాలికదా! కానీ పరభాష, మరో పరభాష సంయోగాల విషయం అటువంటిది కాదు. ఇక్కడ కేవలం తెలుగు లిపి మాత్రమే వాడుతున్నాం. ఉదా: రైలుపెట్టె. నిజానికి ‘రైలు’ అనేది సరికాదు. ‘రైలు’ అనేది పట్టాలకు సంబంధించిన ఆంగ్ల పద తెలుగు రూపాంతరం. అయితే దీనిని ‘ట్రైను’ కు సమానార్థకంగా వాడుతున్నారు.
పైన చెప్పినట్లు ఉరుదు ఉరుదు, ఉరుదు – ఆంగ్లం, ఆంగ్లం -ఉరుదు, ఆంగ్లం – ఆంగ్లం కలిసి ఏర్పడే పదాలను ‘సమాసాలని’ ఎలా అనగలం? అవి తెలుగు(ద్రావిడ)పదాలే కానప్పుడు తెలుగు సమాసాలుగా ఎలా వింగడిస్తాం, వివరిస్తాం? కాకపొతే అలాంటి పదాలు, పద సంయోగాలు తెలుగు వ్యవహారంలో ఉన్నాయి. అన్య జాతులు వచ్చి తెలుగు భాషతో సంపర్కం చేయటం వలన ఇలాంటి వాటి విషయంలో భద్రిరాజు వారు సవిస్తార చర్చ జరిపారు. ‘ఉదాహరణకు పోస్ట్‌ ఆఫీసులో వాడే వేనికి తెలుగు పదాలు లేవు. ఆంగ్లపదాలనే తెలుగు లిపిలో వాడుతున్నాం. పోస్ట్‌కార్డ్‌, టెలిగ్రామ్‌, రిజిస్టర్డ్‌పోస్ట్‌, మొ॥ అలాగే రెవిన్యూ, కోర్టు వ్యవహారాల్లో అనేక ఆంగ్ల, ఉర్దూ పదాలు తెలుగులో అలాగే ఉండిపోయాయి.’ అని ఆచార్య భద్రిరాజు కృష్ణమూర్తి పేర్కొన్నారు.
కాబట్టి ఇటువంటి ‘పద సంయోగాలు’, ‘పదాలు’ తెలుగు లిపిలో తెలుగులోని ఇతర వాక్యాలతో కలిసిపోవటం వలన వాటిని ‘వైరిసమాసాలు’ అనో, ‘మిత్రసమాసాలు’ అనో భావించనక్కరలేదు. అందుకే వ్యాకరణ వ్యవహర్తలు వీటిపై ఎటువంటి వ్యాకరణ చర్చా జరపలేదు. అసలు వ్యవహార భాషకు వ్యాకరణం లేదు. ఉండటం కూడా కష్టమే. ఈ విషయం ఆచార్య ఇనాక్‌ కూడా గ్రహించారు. అయితే వాటిని ‘మిత్రసమాసాలు’గా పరిగణించమని, వాటిని అధికంగా తెలుగు సాహిత్యంలో వాడుతున్న కొద్దీ భాష విస్తృతి పెరిగి భాషాభ్యుదయానికి దోహదపడుతుందని ఆచార్య ఇనాక్‌ కోరుకొంటున్నారు.
మాండలిక వృత్తిపద ప్రయోగకోశాల నిర్మాణాలలో ఒకటిగా ‘వాస్తుపదకోశమ్‌’అని (ఆర్కిటెక్చర్‌) ఒకదానిని తెలుగు అకాడమీ వారు 1968లో వెలువరించారు. దానికి సంపాదకులుగా డా॥బూదరాజు రాధాకృష్ణ వ్యవహరించారు. దానికి ముందుమాట ఆచార్య భద్రిరాజుకృష్ణమూర్తి ఆంగ్లంలో రాశారు. అంతే గాకుండా ఈ సంకలన నిర్మాణంలో జరిగిన కృషిని సమీక్షించే బాధ్యతను ఆచార్య జిఎన్‌రెడ్డి, ఆచార్య తూమాటి దోణప్పలు నిర్వహించారు. ఆచార్య భద్రిరాజు కృష్ణమూర్తి పర్యవేక్షించారు. అయితే ఆచార్య ఇనాక్‌ ఈ సమీక్షలో రెడ్డిగారు, దోణప్పగారు రాసిన వాక్యాలలో కొన్నిటి నుంచి ప్రేరణ పొందినట్టు కనిపిస్తుంది. ఎందుకంటే ఈ పదకోశంలో కొన్ని సంస్కృతంతో ఆంగ్లం, ఇంగ్లీషుతో ఉరుదు, ఇంగ్లీష్‌ -ఇంగ్లీష్‌ పదబంధాలు ఉన్నాయి. వాటిని ఇతర తెలుగు,సంస్కృత, అన్య భాషా పదబంధాలతో ఒకేచోట ఏకరువు పెడుతున్న సందర్భంలో ‘అన్య దేశ్య పదసంయోగాల’ నటం బదులు ‘సమాసాలు’గానే పేర్కొన్నారు. ‘అందువల్ల ఈ సమాసం గ్రాంధికాంధ్రంలో ఎలాఉన్నా మాండలికంగా తప్పనిసరి. వృత్తి పదాలలో అనివార్యం’ అని వారు రాసినట్టు ఇనాక్‌ ఉటంకించారు.
ఆచార్య ఇనాక్‌ ఈ వ్యాసం మొదట్లో చెప్పినట్టే ఈ ‘మిత్రసమాసం’ పరిశోధన అంతిమ లక్ష్యం అన్య భాషాపదాలను తెలుగు వ్యవహారికంలో, సాహిత్యంలో విస్తృతంగా వాడాలని, తద్వారా భాష విస్తృతి మరింత పెరగాలని ఇది వారి ఆకాంక్ష. కానీ, భాషా శాస్త్రం చెప్పేది వేరు. ఇప్పుడు సాహిత్యంలోనూ, వ్యవహారంలోనూ వాడుతున్న అన్య భాషా పదాలు విద్యావంతులు, పత్రికలలో వాడుతున్నవి. ఇవి సాధారణ జానపదుల జీవితాలలోకి పోయినప్పుడే అవి కలకాలం మనగలుగుతాయి. కేవలం విద్యావంతులు, పత్రికలూ, సినిమాలు వాడినంత మాత్రాన అవి జనాలలోకి చొచ్చుకుపోయి శాశ్వతత్వం పొందుతాయనేమి నియమంలేదు. మరొకటి ఏమిటంటే తిక్కన, అన్నమయ్యల కాలంనాడు అచ్చ తెలుగుపదాలు ఎన్నో సాహిత్యంలోకి వచ్చాయి. అవన్నీ ఒకప్పుడు జనుల నోట్లోని మాటలే. కానీ, కాలక్రమంలో నేటినాగరికత వాటిని విస్మరించి, వాటి స్థానంలో అన్యదేశ్యాలకు ప్రవేశం కలిపించాయి. ఈ మార్పు ఇప్పుడు విద్యావంతుల స్థాయిలోనే కనపడుతోంది. ఇవి గ్రామీణ జీవితాలలోకి, అల్ప విద్యాస్థాయి జనులలోకి వెళ్ళాలి. అప్పుడే ఈ ఆకాంక్షకు మనుగడ. ఈ ఆకాంక్షల విషయంలో ఆచార్య భద్రిరాజు వారు డార్విన్‌ సిద్ధాంతం అయిన ‘సర్వైవల్‌ఆఫ్ఫిట్టెస్ట్‌’ ను ప్రయోగించారు. ఏ ‘పద నిర్మాణాలు కాల పరిణామాలను తట్టుకొని నిలబడతాయో అవి ఉంటాయి. ఏవి నిలబడవో అవి రాలిపోతాయి’అని.
అన్నింటికీ మించి మరొక విశేషమేమంటే ‘గిడుగు వారి ఆత్మ ఈ ఆకాంక్షను ఏమంటుంది?’ అని. సంస్కృతం వదిలించుకొని ముందుకు పోనిద్దాం అన్న ‘తెలుగు వ్యవహార ఉద్యమమం’, మరో రూపంలో ఆంగ్ల, ఫ్రెంచ్‌, డచ్‌, పోర్చుగీస్‌, ఉర్దూ భాషా పదాలను కలుపుకొని ఒక వాక్యంలో తెలుగు పదాల కన్నా అన్య భాషా పదాలే ఎక్కువ వుండే పరిస్థితికి మారుతుండటం గిడుగు వారి ఆత్మ అంగీకరిస్తుందా? గిడుగు వారి ఆత్మ కేమవుతుంది?

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు