. న్యాయ సమీక్షలో రద్దయిన జీవో 3 పునరుద్ధరణ
. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకనుగుణంగా చర్యలు
. గిరిజన సంక్షేమ శాఖ సమీక్షలో సీఎం చంద్రబాబు
విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : ఏజెన్సీ ప్రాంతాల్లో స్థానిక గిరిజనులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో నూరు శాతం రిజర్వేషన్లు కల్పించేం దుకు కట్టుబడి ఉన్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయడు అన్నారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థానిక గిరిజనులకు 100 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ఉమ్మడి రాష్ట్రంలో 2000 సంవత్సరంలో జీవో నంబర్ 3 తెచ్చామని సీఎం గుర్తు చేశారు. న్యాయ సమీక్షలో రద్దయిన ఆ జీవో పునరుద్ధరణకు తీసుకోవల్సిన చర్యలపై అధికారులతో సమీక్ష చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాలు, మార్గదర్శకాలు పాటిస్తూనే… 2020లో రద్దయిన జీవో 3 పునరుద్ధరణకు గల అవకాశాలపై అధ్యయనం చేయాలని అధికారులను సీిఎం ఆదేశించారు. సచివాలయంలో గిరిజన సంక్షేమ శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం సమీక్ష చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ 1986లో వచ్చిన జీవో ప్రకారం ఏజెన్సీలో స్థానిక గిరిజనులకు టీచర్ పోస్టుల్లో 100 శాతం రిజర్వేషన్లు తీసుకువచ్చాం. దీనిపై న్యాయపరమైన చిక్కులు రావడంతో మళ్లీ పెరిగిన మహిళా రిజర్వేషన్ల శాతాన్ని పరిగణనలోకి తీసుకుని 2000లో జీవో 3 తెచ్చామని గుర్తు చేశారు. దీన్ని అమలు చేయడం ద్వారా సుమారు 4,626 టీచర్ ఉద్యోగాలు ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనులకు దక్కాయి. అయితే జీవో నెంబర్ 3పై 2002లో కొందరు కోర్టును ఆశ్రయించగా… వివిధ స్థాయిల్లో విచారణ అనంతరం 2020లో ఈ ఉత్తర్వులను సుప్రీంకోర్టు రద్దు చేసింది. అయితే గత ప్రభుత్వం దీనిపై రివ్యూ పిటిషన్ వేయడంలో తీవ్ర నిర్లక్ష్యం పాటించింది. దీంతో రివ్యూ పిటిషన్ను కూడా సుప్రీం కోర్టు కొట్టేసింది. ఈ కారణంగా గిరిజనులు జీవో నంబర్ 3 ద్వారా లభించే లబ్ధిని కోల్పోయారని సీఎం అధికారులకు వివరించారు. దీనిపై ఎన్నికల సమయంలో గిరిజనులకు హామీ ఇచ్చినందున ఏజెన్సీలోని ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థానిక గిరిజనులకు నూరుశాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ఉన్న అవకాశాల గురించి, చట్టపరంగా ఉన్న వివిధ అనుకూలతలు, అడ్డంకుల గురించి సీఎం చర్చించారు. జీవో నంబర్ 3 పునరుద్ధరిచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై గిరిజనుల, గిరిజన సంఘాల నుంచి అభిప్రాయాలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఈ నేపథ్యంలో ఈ ఉత్తర్వుల ద్వారా లభించే లబ్ధిని గిరిజనులకు తిరిగి అందించేందుకు ఉన్న అవకాశాలు పరిశీలించాలని, ఇందులో భాగంగా న్యాయపరమైన అంశాలు, సుప్రీంకోర్టు తీర్పు, గిరిజన హక్కుల పరిరక్షణకు చేపట్టాల్సిన చర్యలను అధ్యయనం చేయాలని సీఎం ఆదేశించారు.
సీఎం ముందు మూడు ప్రతిపాదనలు
జీవో నంబర్ 3 పునరుద్ధరణపై ప్రస్తుతం ఉన్న మూడు అవకాశాల గురించి అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. మొదటి ఆప్షన్గా ఏజెన్సీ గిరిజన ప్రాంతాల్లో 100 శాతం రిజర్వేషన్లు స్థానిక గిరిజనులకు కల్పించడం, రెండవ ఆప్షన్గా స్థానిక గిరిజనులకు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు ఇవ్వడం, మూడవ ఆప్షన్గా సుప్రీంకోర్టు సూచించినట్టు 50 శాతం మించకుండా స్థానిక గిరిజనులకే రిజర్వేషన్లు కల్పించి వారి హక్కులు పరిక్షించడం వంటి అవకాశాలను అధికారులు సీిఎం దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై ముఖ్యమంత్రి మాట్లాడుతూ ‘గిరిజన ప్రాంతాల్లో పూర్తిస్థాయిలో గిరిజనుల హక్కులకు కట్టుబడి ఉన్నామని, ఎన్నికల సమయంలో చెప్పినట్లు జీవో నంబర్ 3 పునరుద్ధరించడం లేదా అదేస్థాయిలో గిరిజనులకు న్యాయం చేయడానికి మనకున్న ఏ ఒక్క అవకాశాన్ని వదులుకునే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఈ సమీక్షలో మంత్రి గుమ్మడి సంధ్యారాణి, ఆ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.