మావోయిస్టు అగ్రనేత సుధాకర్ మృతి
విశాలాంధ్ర – చింతూరు : మావోయిస్టు అగ్రనాయకుడు నంబాల కేశవరావు ఎన్కౌంటర్ జరిగిన నెలరోజుల్లోపే ఆ పార్టీకి మరో భారీ ఎదురు దెబ్బ తగిలింది. చత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు తెంటు లక్ష్మీ నరసింహాచలం(65) మృతిచెందాడు. అతడు సుధాకర్గా పార్టీలో ప్రసిద్ధి చెందాడు. అతడికి గౌతమ్, ఆనంద్, చంటి, బాలకృష్ణ, రామరాజు, సోమన్న అనే మారుపేర్లు ఉన్నాయి. ఆయన స్వస్థలం ఏలూరు జిల్లా చింతలపూడి మండలం ప్రగడవరం. 40 ఏళ్లుగా మావోయిస్టు ఉద్యమంలో ఉన్న సుధాకర్పై రూ.50 లక్షల రివార్డు ఉంది. 2004లో ప్రభుత్వంతో జరిగిన శాంతి చర్చల్లో ఆయన పాల్గొన్నారు. ఇంద్రావతి టైగర్ రిజర్వ్లో మావోయిస్టు సీనియర్ నాయకులు ఉన్నట్లు భద్రతా దళాలకు పక్కా సమాచారం అందడంతో… డీఆర్జీ, ఎస్టీఎఫ్ దళాలు ఆ ప్రాంతాన్ని దిగ్బంధించి తనిఖీలు చేపట్టాయి. ఈ క్రమంలో గురువారం తెల్లవారుజామున దళాలు-మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు మొదలయ్యాయి. ఈ ఆపరేషన్లో కేంద్ర కమిటీ సభ్యుడు సుధాకర్ నేలకొరిగాడు. బీజాపూర్ ఎస్పీ డాక్టర్ జితేంద్ర యాదవ్ ఎన్కౌంటర్ను ధ్రువీకరించారు. బీజాపూర్ అడవుల్లో గాలింపు చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఎన్కౌంటర్ జరిగిన స్థలం నుంచి పెద్దమొత్తంలో ఆయుధాలను స్వాధీనం చేసుకొన్నారు. ఆరునెలల వ్యవధిలో మావోయిస్టు కేంద్ర కమిటీకి చెందిన ముగ్గురు నాయకులను ఎన్కౌంటర్ చేయడం గమనార్హం. అలాగే, తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు, మావోయిస్ట్ పార్టీ మాజీ ప్రెస్ ఇంఛార్జి బండి ప్రకాశ్, స్పెషల్ జోన్ కమిటీ సీనియర్ నేత పాపారావు కూడా అక్కడే ఉన్నట్లు తమకు సమాచారం అందిందని బస్తర్ ఐజీ పి.సుందర్ రాజు ప్రకటన జారీ చేశారు. ప్రకాశ్ మావోయిస్టుల నియామకాలు, ప్రచారం, దక్షిణ బస్తర్లో కార్యకలాపాల పర్యవేక్షణ బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. ఇతడిపై రూ.25 లక్షల రివార్డు ఉంది. పాపారావు గెరిల్లా యుద్ధతంత్ర నిపుణుడు. ఉచ్చులు పన్నడంలో దిట్టగా పేరుంది. చాలా ఐఈడీ, ఇతర దాడుల్లో అతడు మోస్ట్వాంటెడ్గా ఉన్నాడు. అతడిపై రూ.20 లక్షల రివార్డు ఉంది. వీరిద్దరికి సంబంధించిన సమాచారం వెల్లడి కాలేదు. కేవలం మూడు వారాల వ్యవధిలో మావోయిస్టులకు మరో భారీ ఎదురు దెబ్బ తగిలింది.