16న హైకోర్టులోనే పిటిషన్ వేయాలని సూచన
విశాలాంధ్ర బ్యూరో`అమరావతి: ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించి డీఎస్సీ వ్యవహారం మళ్లీ సుప్రీం చెంతకు చేరింది. డీఎస్సీ పరీక్షలపై స్టే ఇవ్వాలంటూ పిటిషన్ వేయగా… అందుకు అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది. ప్రభుత్వ పాఠశాలల్లో 16,347 బోధనా పోస్టులను భర్తీ చేసేందుకు సీఎం చంద్రబాబు నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ ప్రక్రియ అంతా ఏకపక్షంగా ఉందని, పారదర్శకంగా లేదని, అందుకే భారత రాజ్యంగం కింద ఆర్టికల్ 14, 15 ప్రకారం హక్కులను ఉల్లంఘింస్తుందని పిటిషనర్ తరపు న్యాయవాది వాదించారు. ఈనెల 16న ప్రారంభంకానున్న ఏపీ హైకోర్టులోనే పిటిషన్ దాఖలు చేసుకోవాలని, ఇప్పుడు మెగా డీఎస్సీని నిలిపివేయడం సాధ్యం కాదంటూ స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ కేసులో ఏపీ హైకోర్ట్ను ఆశ్రయించాలని పిటిషనర్కు ధర్మాసనం సూచించింది. ఈనెల16 నుంచి హైకోర్టు పునః ప్రారంభమైన తరువాత అక్కడే పిటిషన్ దాఖలు చేయాలని సుప్రీం తెలిపింది. మెగా డీఎస్సీ ఇప్పటికే ప్రారంభమైనందున వాటిని నిలిపివేయలేమని జస్టిస్ పీకే మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం తేల్చిచెప్పింది. పరీక్షలు ప్రారంభమైన తరువాత మధ్యలో ఎలా ఆపేస్తామని జస్టిస్ మన్మోహన్ ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్పీ రాజు వాదనల్లో…మెగా డీఎస్సీ పరీక్షకు లక్షలాది మంది ఆశావాహులు ఇప్పటికే హాజరయ్యారని, పరీక్షలు జరుగుతున్నాయని, ఈ దశలో వాటిని నిలిపివేస్తే చాలా మందికి అన్యాయం చేసినట్లు అవుతుందని, వారి ప్రాథమిక హక్కులను హరించినట్లు అవుందన్నారు. దీనిపై ఏపీ హైకోర్టును పిటిషనర్ ఎందుకు ఆశ్రయించలేదని జస్టిస్ పీకే మిశ్రా ప్రశ్నించగా…హైకోర్టుకు సెలవులు ఉన్నందునే అదనపు పత్రాలతో సుప్రీంకోర్టును ఆశ్రయించినట్లు పిటిషనర్ తరపు న్యాయవాది వివరించారు. దీంతో ఈనెల 16న ఏపీ హైకోర్టు తిరిగి ప్రారంభమవుతుందని అవసరమైతే అక్కడే పిటిషన్ దాఖలు చేయవచ్చని సుప్రీం స్పష్టం చేసింది. ప్రస్తుతం ఈనెలాఖరు వరకు ఆన్లైన్ విధానంలో పరీక్షలు జరుగుతున్నాయి. దాదాపు 5.72 లక్షల మంది అభ్యర్థులు నెల రోజు పాటు ఈ పరీక్షలను రాయనున్నారని… ఈ దశలో పరీక్షలను నిలిపివేయడం సాధ్యంకాదని సుప్రీం తేల్చిచెప్పింది.