. త్వరలో బనకచర్లకు టెండర్లు
. డిసెంబరు కల్లా పోలవరం డయాఫ్రంవాల్ పూర్తి
. జల వనరుల శాఖ సమీక్షలో సీఎం చంద్రబాబు
విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : కృష్ణా, గోదావరి డెల్టాలో పంటల సాగు వెంటనే చేపట్టేందుకు వీలుగా తక్షణమే నీటి విడుదలకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. తుఫాన్ల కంటే ముందుగానే పంటలు చేతికొచ్చేలా పంటల సాగు కాలంలో మార్పులు తీసుకురావాలని సూచించారు. భూగర్భ జలాలు పెంచడం, రిజర్వాయర్లు నింపడం, జలవనరుల సమర్ధ వినియోగం వంటి అంశాలపై అధికారులు ప్రధానంగా దృష్టి పెట్టాలన్నారు. 365 రోజులు భూమి పచ్చగా ఉండేలా మూడు పంటలు నిరంతరం పండిరచేలా చూడాల న్నారు. భూగర్భ జలాల వివరాలు తెలుసుకునేందుకు ఉపయోగించే పిజియో మీటర్లు, ఇంకా ఏడబ్ల్యూఎస్ సెన్సర్లు రాష్ట్రంలో కొన్ని చోట్ల పని చేయకపోవడంపై ముఖ్యమంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. తక్షనం నూతన పరికరాలు కొనుగోలు చేసేందుకు రూ.30 కోట్లు విడుదల చేయాలని ఆర్థిక శాఖాధికారులకు ఆదేశాలు ఇచ్చారు. నిర్వహణా లోపాలు సరిచేసుకుని వాటర్ ఆడిట్ శాస్త్రీయంగా చేపట్టాలని, రాయలసీమ, ఉత్తరాంధ్ర సహా రాష్ట్రంలో నిర్మించాల్సిన అన్ని ప్రాజెక్టులను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. శుక్రవారం సచివాలయంలో జలవనరుల శాఖ అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జల వనరుల లభ్యతను బట్టి నీటి సమర్ధ వినియోగం జరగాలి. బేసిన్లు, జిల్లాల వారీగా, సెంట్రల్-లోకల్ బులిటెన్లు రిలీజ్ చేయాలి. రాష్ట్రంలో సగటు భూగర్భ జలాలు పెరిగేలా చర్యలు తీసుకోవాలి. సీలేరు నీరు కృష్ణా డెల్టాకు వినియోగించే అంశాన్ని పరిశీలించాలి. హంద్రీ-నీవా మెయిన్ కెనాల్ వెడల్పు చేసే పనుల్లో వేగం పెంచాలి. వెలిగొండ స్టేజ్ 1 పనులు 2026 జూన్ కల్లా పూర్తి కావాలి. శ్రీశైలం ప్రాజెక్టు ప్లంజ్ పూల్ మరమ్మతులకు తక్షణ చర్యలు చేపట్టండి. బుడమేరు ప్రవాహానికి అడ్డంకులు లేకుండా పూడికతీత, ముళ్ల కంపలు తొలగించాలని ఆదేశించారు.
పోలవరం-బనకచర్లకు త్వరలో టెండర్లు
పోలవరం-బనకచర్ల ప్రాజెక్టుకు సంబంధించి అటవీ, పర్యావరణ అనుమతులు, డీపీఆర్ ఆమోదం తదితరాలు అన్నీ అనుకున్న సమయానికల్లా జరగాలని, భూసేకరణకు కూడా సిద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. హైబ్రీడ్ యాన్యుటీ విధానంలో పోలవరం-బనకచర్ల అనుసంధానం ప్రాజెక్టును చేపట్టాలని చెప్పారు. అలాగే, టెండర్లకు సంబంధించిన రాష్ట్ర స్థాయి సాంకేతిక కమిటీతో డ్రాఫ్ట్ డాక్యుమెంట్ రూపొందించడం, సాంకేతిక నిపుణల పర్యవేక్షణ అనంతరం టెండర్లు పిలవడం ఈ నెలాఖరు కల్లా పూర్తి కావాలని ముఖ్యమంత్రి నిర్దేశించారు. జలహారతి కార్పొరేషన్ కింద పోలవరం-బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టు నిర్మాణం చేపడుతుండగా, దీనికోసం స్పెషల్ పర్పస్ వెహికల్ (ఎస్పీపీ) ఇప్పటికే ఏర్పాటు చేశారు. ప్రాజెక్టు నిర్మాణానికి ఆర్థిక వనరుల సమీకరణ కోసం కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రం ప్రతిపాదనలు పంపించింది. మొత్తం ప్రాజెక్టు నిర్మాణానికి అయ్యే రూ.81,900 కోట్ల వ్యయంలో 50 శాతం అంటే రూ.40,950 ఈఏపీ రుణంగా పొందాలని నిర్ణయించారు. అలాగే కేంద్ర ప్రభుత్వ గ్రాంట్గా 20 శాతం నిధులు రూ.16,380 కోట్లు సమకూర్చుకోవాలని, రాష్ట్ర ప్రభుత్వ ఈక్విటీగా 10 శాతం నిధులు రూ.8,190 కోట్లు, హ్యామ్ విధానంలో మరో 20 శాతం నిధులు రూ.16,380 కోట్లు ఖర్చు చేయనున్నట్లు సీఎం వెల్లడిరచారు.
ఈ ఏడాది చివరికల్లా పోలవరం డయాఫ్రమ్ వాల్ పూర్తి
మరోవైపు పోలవరం ప్రాజెక్టు సివిల్ నిర్మాణం పనులు ఇప్పటివరకు 81.70 శాతం పూర్తయ్యాయి. గత ప్రభుత్వ హయాంలో ఐదేళ్లలో కేవలం 3.84 శాతం పనులు మాత్రమే చేయగా, 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 11 నెలల కాలంలో 5.93 శాతం పనులు జరగడం విశేషం. డయాఫ్రమ్ వాల్ 64 శాతం, బట్రెస్ డ్యామ్ 91 శాతం, ఇసుక గట్టి పరిచే వైబ్రో కంప్రాక్షన్ పనులు 54 శాతం పూర్తయ్యాయి. ఈ ఏడాది డిసెంబరు చివరి నాటి కల్లా డయాఫ్రమ్ వాల్ నిర్మాణం పూర్తి కానుంది. మరోవైపు, పోలవరం ప్రాజెక్టు పనులు అనుకున్న సమయానికి పూర్తయ్యేలా కాంట్రాక్టర్లతో చర్చించాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. ఈ సమీక్షా సమావేశంలో మంత్రి నిమ్మల రామానాయుడు, జల వనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్, పంచాయితీ రాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి శశి భూషణ్, వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్, సీఎం కార్యదర్శి రాజమౌళి, ఐటీ శాఖ కార్యదర్శి కాటమనేని భాస్కర్, సీసీఎల్ఏ జయలక్ష్మి పాల్గొన్నారు.