. రూ.3,500 కోట్లతో నిర్మాణం
. సుదీర్ఘ సముద్ర తీరం ద్వారా పోర్ట్ ఆధారిత ఎకానమీ
. ప్రతి 50 కి.మీలకు ఒక పోర్ట్ లేదా ఫిషింగ్ హార్బర్ ఏర్పాటు లక్ష్యం
. సీఎం చంద్రబాబు
విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : కేంద్ర ప్రభుత్వ సహాయంతో తిరుపతి జిల్లా దుగరాజపట్నంలో రూ.3,500 కోట్లతో నౌకా నిర్మాణ కేంద్రం ఏర్పాటు కానుంది. ప్రాథమిక అంచనాల ప్రకారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో 2 వేల ఎకరాల్లో షిప్ బిల్డింగ్ సెంటర్ ఏర్పాటు చేయనున్నారు. దుగరాజపట్నంలో నౌకా నిర్మాణం, మరమ్మతుల క్లస్టర్, గ్రీన్ఫీల్డ్ పోర్ట్తో కలిపి అభివృద్ధి చేస్తారు. 4 డ్రై డాక్లు, అవుట్ ఫిటింగ్ జెట్టీలు, షిప్ లిఫ్ట్ సౌకర్యం కలిగిన నౌకా నిర్మాణ కేంద్రం ఇక్కడ వస్తుంది. షిప్ బిల్డింగ్ పరిశ్రమకు 1000 ఎకరాలు, అనుబంధ పరిశ్రమలకు మరో 1000 ఎకరాలు భూమి అవసరం ఉంటుంది. ఈ ప్రాజెక్టు చేపట్టడానికి కేంద్రం దాదాపు రూ.3,500 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ చేపడుతుంది. భూసేకరణతో పాటు పరిశ్రమకు అనువైన ప్రాంతంగా దీన్ని తీర్చిదిద్దుతారు. తరువాత స్పెషల్ పర్మస్ వెహికిల్ ఏర్పాటు చేసి ప్రపంచ స్థాయి సంస్థలను ఆహ్వానించి ఇక్కడ షిప్ బిల్డింగ్ పరిశ్రమను ఏర్పాటు చేస్తారు. నౌకా నిర్మాణ కేంద్రం ద్వారా దాదాపు రూ.26 వేల కోట్ల పెట్టుబడులు వస్తాయి. ప్రత్యక్షంగా 5 వేల మందికి, పరోక్షంగా 30 వేల మందికి ఈ ప్రాజెక్టు ద్వారా లబ్ది చేకూరుతుంది. రాష్ట్రంలో తీర ప్రాంతాల్లో చేపట్టే ప్రాజెక్టులు, పోర్టులపై మంగళవారం సచివాలయంలో సమీక్ష చేసిన సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ ప్రాజెక్టు విషయాన్ని వెల్లడిరచారు. ఈ సమావేశానికి కేంద్ర ప్రభుత్వ పోర్ట్స్, షిప్పింగ్, వాటర్ వేస్ శాఖ సెక్రటరీ టి.కె. రామచంద్రన్ తో పాటు మరికొందరు కేంద్ర రాష్ట్ర అధికారులు హాజరయ్యారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న పోర్టులు, కొత్తగా నిర్మాణం అవుతున్న పోర్టుల స్థితిగతులపై సీఎం చర్చించారు. ఏపీకి ఉన్న సుదీర్ఘ సముద్ర తీరం ద్వారా రాష్ట్రంలో పోర్ట్ ఆధారిత ఎకానమీని సాధించేందుకు ప్రణాళికతో పనిచేస్తున్నామని ముఖ్యమంత్రి చెప్పారు. రాష్ట్రంలో 1000 కి.మీ పైగా ఉన్న సముద్ర తీరాన్ని పూర్తి స్థాయిలో ఉపయోగించుకుని మారిటైం ప్రాజెక్టులు నెలకొల్పుతామని చెప్పారు. తీర ప్రాంతంలో ప్రతి 50 కిలోమీటర్లకు ఒక పోర్ట్ లేదా ఫిషింగ్ హార్బర్ నిర్మించాలనే ఆలోచనతో తాము ఉన్నామని సీఎం కేంద్ర ప్రభుత్వ అధికారులకు తెలిపారు. రాష్ట్ర విభజన సమయంలో నెల్లూరు జిల్లా దుగరాజపట్నంలో పోర్ట్, ఆధారిత పరిశ్రమల ఏర్పాటుకు నాడు కేంద్రం అంగీకరించిందని, కొత్త జిల్లా ఏర్పాటుతో తిరుపతి జిల్లా పరిథిలోకి వచ్చిందని సీఎం తెలిపారు.
ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకువెళ్లేందుకు అధికారులకు సీఎం కొన్ని సూచనలు చేశారు. దీనికి అవసరమైన కార్యాచరణ వెంటనే సిద్ధం చేయాలని చంద్రబాబు అధికారులను ఆదేశించారు. రాష్ట్రానికి తలమానికంగా ఉన్న విశాఖ పోర్టులో మరింత చౌకగా సరుకు రవాణాకు అవకాశం కల్పించాలని సీఎం కేంద్ర అధికారులను కోరారు. అదే విధంగా రాష్ట్రంలో క్రూయిజ్ టూరిజం ప్రాజెక్టులకు ఉన్న అవకాశాలను కూడా ఈ సమావేశంలో అధికారులు వివరించారు. పోలవరం, శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాంతాల్లో రివర్ క్రూయిజ్ సర్క్యూట్స్ ను అభివృద్ది చేసే అంశంపై అధ్యయనం చేయాలని అధికారులకు సీఎం సూచించారు. సమీక్షలో మంత్రి బి.సి.జనార్థన్ రెడ్డితో పాటు, ఆ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.