ముందే ఖరారైన పర్యటనలో భాగంగానే విడిచిపెట్టానన్న మాల్యా
న్యాయమైన విచారణకు హామీనిస్తే భారత్కు వస్తానని హామీ
ఎయిర్లైన్స్ పతనానికి 2008 నాటి ఆర్థిక సంక్షోభమే కారణమని వెల్లడి
సుమారు రూ. 9,000 కోట్లకు పైగా మోసం, మనీలాండరింగ్ ఆరోపణలతో భారత్లో వాంటెడ్గా ఉన్న వ్యాపారవేత్త విజయ్ మాల్యా మరోసారి వార్తల్లోకి ఎక్కారు. పారిశ్రామికవేత్త రాజ్ షమానీతో నాలుగు గంటల పాటు సాగిన ఒక పాడ్కాస్ట్ సంభాషణలో ఆయన తనపై ఉన్న కేసులు, వివాదాస్పద రీతిలో భారత్ విడిచి వెళ్లడం, చట్టపరమైన పోరాటాలు, కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ పతనం, తనను దొంగ అని పిలవడం వంటి అంశాలపై స్పందించారు. మార్చి (2016) తర్వాత భారత్ కు వెళ్లనందుకు నన్ను పరారీలో ఉన్న వ్యక్తి అనొచ్చు. నేను పారిపోలేదు, ముందే ఖరారైన పర్యటనలో భాగంగానే భారత్ నుంచి బయటకు వెళ్లాను. సరే, నేను సరైనవని భావించే కారణాల వల్ల తిరిగి రాలేదు, కాబట్టి మీరు నన్ను పరారీలో ఉన్న వ్యక్తి అని పిలవాలనుకుంటే పిలవండి, కానీ ఃదొంగః అనే మాట ఎక్కడి నుంచి వస్తోంది? అసలు ఃదొంగతనంః ఎక్కడ జరిగింది?ఁ అని మాల్యా పాడ్కాస్ట్ లో ప్రశ్నించారు.
2016 నుంచి యూకేలో నివసిస్తున్న మాల్యా విదేశాల్లో ఉండటం వల్ల తన న్యాయపరమైన చిక్కులు మరింత తీవ్రమయ్యాయా అనే అంశంపైనా వ్యాఖ్యానించారు. ఁభారత్ లో నాకు న్యాయమైన విచారణ, గౌరవప్రదమైన ఉనికి లభిస్తుందన్న హామీ ఉంటే మీరు చెప్పింది నిజమే కావచ్చు, కానీ నాకు ఆ హామీ లేదుఁ అని ఆయన అన్నారు.
న్యాయబద్ధమైన విచారణకు హామీ ఇస్తే భారత్ కు తిరిగి వస్తారా? అని ప్రశ్నించగా ఁనాకు అలాంటి హామీ లభిస్తే కచ్చితంగా దాని గురించి ఆలోచిస్తానుఁ అని మాల్యా బదులిచ్చారు. అప్పగింత కేసులో యూకే హైకోర్ట్ ఆఫ్ అప్పీల్ ఇచ్చిన తీర్పును ఆయన ఉటంకిస్తూ భారతీయ జైళ్లలోని పరిస్థితులు యూరోపియన్ మానవ హక్కుల కన్వెన్షన్లోని ఆర్టికల్ 3ను ఉల్లంఘిస్తున్నాయని తేలిందని చెప్పారు. ఁఅందువల్ల వారిని వెనక్కి పంపలేరుఁ అని పేర్కొంటూ తనకు కూడా అలాంటి ఆందోళనలు ఉన్నాయని పరోక్షంగా పేర్కొన్నారు. ఈ ఇంటర్వ్యూలో మాల్యా చేసిన వ్యాఖ్యలపై భారత ప్రభుత్వం ఇప్పటివరకు స్పందించలేదు.
కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ సంక్షోభం
కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ పతనం గురించి మాల్యా మాట్లాడుతూ 2008 నాటి ప్రపంచ ఆర్థిక సంక్షోభం ఇందుకు ఒక ప్రధాన కారణమని తెలిపారు. ఁమీరు లెమాన్ బ్రదర్స్ గురించి విన్నారా? ప్రపంచ ఆర్థిక సంక్షోభం గురించి విన్నారు కదా? అది భారత్ పై ప్రభావం చూపలేదా? కచ్చితంగా చూపిందిఁ అని షమానీతో అన్నారు. ఁప్రతి రంగం దెబ్బతింది. డబ్బు ఆగిపోయింది. భారత రూపాయి విలువ కూడా దెబ్బతిందిఁ అని ఆయన వివరించారు.
ఁనేను శ్రీ ప్రణబ్ ముఖర్జీ వద్దకు వెళ్లి నాకు ఒక సమస్య ఉందని చెప్పాను. కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ కార్యకలాపాలు తగ్గించుకోవాలి, విమానాల సంఖ్యను తగ్గించాలి, ఉద్యోగులను తొలగించాలి, ఎందుకంటే ఈ కుంగిపోయిన ఆర్థిక పరిస్థితుల్లో కార్యకలాపాలు కొనసాగించలేనుఁ అని చెప్పారు. అయితే, కార్యకలాపాలు తగ్గించవద్దని, బ్యాంకులు మద్దతు ఇస్తాయని ఆయన తనకు సలహా ఇచ్చారని గుర్తు చేసుకున్నారు.
న్యాయపరమైన చిక్కులు
మాల్యాకు న్యాయపరమైన చిక్కులు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ ఏడాది ఏప్రిల్ 9న భారతీయ స్టేట్ బ్యాంక్ సహా భారతీయ రుణదాతల కన్సార్టియంకు చెల్లించాల్సిన రూ. 11,101 కోట్ల రుణానికి సంబంధించి లండన్ హైకోర్టు జారీ చేసిన దివాలా ఉత్తర్వులపై చేసిన అప్పీల్ను ఆయన కోల్పోయారు.
ఈ ఏడాది ఫిబ్రవరిలో మాల్యా కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. వాస్తవంగా చెల్లించాల్సిన రూ. 6,200 కోట్లకు బదులుగా బ్యాంకులు ఇప్పటికే రూ. 14,000 కోట్లు రాబట్టుకున్నాయని తన న్యాయవాది ద్వారా వాదించారు. రాబట్టుకున్న మొత్తానికి సంబంధించిన వివరణాత్మక లెక్కలను అందించాలని రుణదాతలను ఆదేశించాలని ఆయన కోర్టును అభ్యర్థించారు. ఈ పిటిషన్పై జస్టిస్ ఆర్. దేవదాస్ నేతృత్వంలోని ధర్మాసనం సంబంధిత బ్యాంకులకు, రుణ రికవరీ అధికారులకు నోటీసులు జారీ చేసింది.
అయినప్పటికీ 2012లో కార్యకలాపాలు నిలిపివేసిన కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్కు సంబంధించిన ఆర్థిక నేరాలకు గాను విచారణ ఎదుర్కోవడానికి మాల్యాను తీసుకొచ్చేందుకు భారత అధికారులు తమ ప్రయత్నాలను కొనసాగిస్తున్నారు.