Wednesday, June 4, 2025
Homeపేదలకు ఇళ్లస్థలాలు, సూపర్‌ సిక్స్‌ హామీల అమలుపై ఊరూర ఉద్యమం

పేదలకు ఇళ్లస్థలాలు, సూపర్‌ సిక్స్‌ హామీల అమలుపై ఊరూర ఉద్యమం

. రాష్ట్రవ్యాప్తంగా సీపీఐ శ్రేణుల ధర్నాలు, నిరసన ర్యాలీలు
. పట్టణాల్లో రెండు, గ్రామాల్లో 3సెంట్ల ఇళ్ల స్థలాలివ్వాలి
. గృహ నిర్మాణాలకు రూ.ఐదు లక్షలు కేటాయించాలి
. హామీలు అమలు చేసేదాకా పోరు ఆగదు
. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ హెచ్చరిక

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : పేదలకు ఇంటి స్థలాలు, సూపర్‌ సిక్స్‌ ఎన్నికల హామీల అమలుకై సీపీఐ రాష్ట్రవ్యాప్త పిలుపు మేరకు సోమవారం రాష్ట్రవ్యాప్తంగా పార్టీ శ్రేణులు పెద్దఎత్తున ఆందోళనలు నిర్వహించారు. పేద ప్రజలకు పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు ఇళ్ల స్థలాలివ్వాలని, గృహ నిర్మాణాలకు ఐదు లక్షల రూపాయలు కేటాయించాలని, సూపర్‌ సిక్స్‌ హామీలను తక్షణమే అమలు చేయాలని నినాదాలు చేశారు. జిల్లా కలెక్టరేట్‌లు, తహసీల్దార్‌ కార్యాలయాలు ఎదుట ధర్నాలు నిర్వహించారు. డిమాండ్స్‌తో కూడిన ప్లకార్డులు ధరించి ఆందోళనకారులు పట్టణాల్లో భారీ ప్రదర్శనలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించింది. ఈ కార్యక్రమంలో భాగంగా నంద్యాలలో టేక్కే మార్కెట్‌ యార్డ్‌ నుండి ఎంఆర్‌ఓ కార్యాలయం వరకు నిర్వహించిన భారీ ర్యాలీలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన సూపర్‌ సిక్స్‌ హామీలను అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. జూన్‌ 12వ తేదీ నాటికి ప్రస్తుత ప్రభుత్వం సంవత్సర కాలం పూర్తి చేసుకుంటున్నా, ఇచ్చిన హామీలను ఇంతవరకు అమలు చేయకపోవడం శోచనీయమన్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి తక్షణమే హామీల అమలుకు చర్యలు తీసుకోవాలని, లేకుంటే వామపక్ష పార్టీలతో పాటు కలిసి వచ్చే అన్ని పార్టీలతో కల్సి ఉద్యమం తీవ్రతరం చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. గత వైసీపీ ప్రభుత్వం కేవలం సెంటు, సెంటున్నర ఇంటి స్థలాలు 30లక్షల మందికి ఇస్తామని చెప్పి ఎవరికీ ఇవ్వ లేదని గుర్తు చేశారు. కేబినెట్‌లో ఇళ్ల పట్టాల పంపిణీపై తీర్మానం చేసి నెలలు గడుస్తున్నా ఇంతవరకు ఆచరణకు నోచుకోకపోవడం దారుణమన్నారు. దాదాపు ఆరు లక్షల మంది నిరుద్యోగులు డీఎస్సీ కోసం ఎదురు చూస్తుంటే 16,000 టీచర్‌ పోస్టులు మాత్రమే భర్తీ చేస్తున్నారని, తల్లికి వందనం పేరిట ప్రతి ఇంట్లో ఇద్దరు, ముగ్గురు పిల్లలున్నా ఒక్కొక్కరికి రూ.15వేలు ఇస్తామని చెప్పి ఇంతవరకు ఒక్కరికి కూడా ఇవ్వలేదన్నారు. అలాగే ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు రేపు, మాపు అంటూ ఊరిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఇంట్లో ఉన్న ప్రతి మహిళకు నెలకు రూ.15వేలు వేస్తానన్న హామీ విషయంపై చంద్రబాబు మరిచినట్లున్నారని, ఇంతవరకు ఆ హామీ ఊసే ఎత్తడం లేదన్నారు. అలాగే నిరుద్యోగ భృతి నెలకు రూ.3వేలు ఇస్తామన్నారని, అది కూడా ఇంతవరకు అమలు చేయాలేదన్నారు. వీటన్నిటిపై ప్రభుత్వాన్ని సీపీఐ పక్షాన నిలదీస్తామన్నారు. రేషన్‌ బియ్యం పక్కదారి పడుతున్నాయంటూ బియ్యం వాహనాలను నిలిపివేసి తిరిగి రేషన్‌ షాపుల్లోనే బియ్యం వేస్తున్నారని, రేషన్‌కు బదులు డబ్బులు ఇవ్వడం మంచి పద్ధతికాదని, తెలంగాణలో మాదిరి రాష్ట్రంలో కూడా రేషన్‌ షాపుల్లో సన్నబియ్యం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. సీపీఐ జిల్లా కార్యదర్శి ఎన్‌.రంగనాయుడు , సహాయ కార్యదర్శి బాబాఫక్రుద్దీన్‌, పట్టణ కార్యదర్శి ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.
గృహ నిర్మాణం కోసం
రూ.5లక్షల ఇవ్వాలి: రామచంద్రయ్య
పేదలకు పట్టణ ప్రాంతాల్లో రెండుసెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్ల స్థలతో పాటు గృహనిర్మాణం కోసం రూ.5 లక్షలు ఇవ్వాలని సీపీఐ రాష్ట్రకార్యదర్శి వర్గ సభ్యులు పి.రామచంద్రయ్య డిమాండ్‌ చేశారు. సీపీఐ రాష్ట్ర సమితి ఇచ్చిన పిలుపు మేరకు కర్నూలు జిల్లాలో తహశీల్దార్‌ కార్యాలాయాల ఎదుట ధర్నాలు నిర్వహించారు. పత్తికొండలో సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆవుల శేఖర్‌, సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నక్కి లెనిన్‌బాబు పాల్గొన్నారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని, టిడ్కో గృహాలను కూడా పంపిణీ చేయాలని డిమాండ్‌ చేశారు.
హామీల అమల్లో ప్రభుత్వం
వైఫల్యం: హరినాథరెడ్డి
ఎన్నికల హామీల అమలులో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పి.హరినాథ్‌ రెడ్డి విమర్శించారు. తిరుపతి ఆర్డీవో కార్యాలయం ఎదుట, సీపీఐ నాయకులు, పేదలు, కార్మికులు, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో పెద్దఎత్తున ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమం లో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కె శివారెడ్డి,నగర కార్యదర్శి జల్లా విశ్వనాథ్‌,నగర కార్యవర్గ సభ్యులు ఎన్‌ శివా,ఎన్‌ డి రవి,కే వై రాజ,పద్మ నాభరెడ్డి,రామక్రిష్ణ,బలరాం,రత్నమ్మ.శ్రిరాములు,శివ,విజయ, రామముర్తి,కాలయ్య,మునిశ్వర్‌,ప్రమీల,వెంకటేష్‌,బాష తదితరులు పాల్గొన్నారు.
మాట నిలబెట్టుకోండి: ఈశ్వరయ్య
ఎన్నికల హామీ మేరకు నగరాల్లో రెండు సెంట్లు, గ్రామాల్లో మూడు సెంట్ల స్థలం ఇచ్చి ఇంటి నిర్మాణానికి ఐదు లక్షలు ఇవ్వాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గసభ్యులు జి.ఈశ్వరయ్య డిమాండ్‌ చేశారు. సీపీఐ పిలుపుమేరకు ఒంగోలు పార్టీ కార్యాలయం నుండి తహసిల్దార్‌ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి ఆఫీస్‌ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ ధర్నా కార్యక్రమానికి ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కొత్తకోట వెంకటేశ్వర్లు అధ్యక్షత వహించగా, జిల్లాకార్యదర్శి వర్గ సభ్యులు ఆర్‌. వెంకట్రావు, జిల్లా కార్యవర్గం సభ్యులు ఆర్‌. రామకృష్ణ, యం విజయ, ఒంగోలు నగర కార్యదర్శి శ్రీరామ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
ఏరుదాటాక తెప్ప తగలేసిన చందంగా ఉంది: జంగాల
ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను అధికారం చేపట్టి సంవత్సరం కావస్తున్నా అమలు జరుపకుండా ఏరు దాటాక తెప్ప తగలేసిన చందంగా వ్యవహరిస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జంగాల అజయ్‌కుమార్‌ మండిపడ్డారు. ఎన్నికల ముందు వాగ్ధానాలు చేయడం… ఎన్నికలు ముగిశాక వాటిని విస్మరించడం ప్రభుత్వాలకు పరిపాటిగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరు తూర్పు తహశీల్థార్‌ కార్యాలయం వద్ద అర్జీదారులతో కలిసి సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ సీనియర్‌ నాయకులు నూతలపాటి వెంకటేశ్వరరావు, నగర కార్యవర్గ సభ్యులు ఆకిటి అరుణ్‌కుమార్‌, రావుల అంజిబాబు, తదితరులు పాల్గొన్నారు.
ఎన్టీఆర్‌ జిల్లాలో…
సూపర్‌ సిక్స్‌ హామీలు అమలు చేయడంతో ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందిందని ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సీహెచ్‌ కోటేశ్వరరావు విమర్శించారు. విజయవాడ రూరల్‌ మండల సీపీఐ, వ్యవసాయ కార్మిక సంఘాలు ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్‌ జిల్లా సహాయ కార్యదర్శి బుడ్డి రమేష్‌, ఆంధ్రప్రదేశ్‌ మహిళా సమాఖ్య ఎన్టీఆర్‌ జిల్లా అధ్యక్షురాలు సీహెచ్‌ దుర్గా కోటేశ్వరరావు, పార్టీ రూరల్‌ మండల కార్యదర్శి ఉప్పెన నరసింహరావు తదితరులు పాల్గొన్నారు. మైలవరం, జి కొండూరు, ఇబ్రహీంపట్నం, రెడ్డిగూడెం తదితర మండలాల్లో ధర్నాలు చేపట్టారు.
విజయవాడలో…
కూటమి ప్రభుత్వం వెంటనే ఎన్నికల హామీలను అమలు చేయాలని సీపీఐ ఎన్టీఆర్‌ జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్‌ డిమాండ్‌ చేశారు. సీపీఐ పిలుపు మేరకు విజయవాడ 56వ డివిజన్‌ పాత రాజరాజేశ్వరి పేటలో నిరుపేదలు ఇచ్చిన అర్జీ పత్రాలను ఆయన పూర్తి చేశారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు సయ్యద్‌ బాషా ,హకీం బేగ్‌ , బాబు భాష ,మహిళా సమాఖ్య నాయకులు దిల్షాద్‌ బేగం, షేక్‌ కుర్షిదా, పఠాన్‌ మస్తాన్‌ ఖాన్‌ తదితరులు పాల్గొన్నారు.
తూర్పుగోదావరి జిల్లాలో…
ఎన్నికల హామీలు అమలు చేసిన తర్వాతే సుపరిపాలన సంబరాలు జరుపుకోవాలని సీపీఐ తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి తాటిపాక మధు డిమాండ్‌ చేశారు. తూర్పుగోదావరి జిల్లా కలెక్టరేట్‌ వద్ద ధర్నా నిర్వహించి 1200 ఇళ్ళ స్థలాల వ్యక్తిగత అర్జీలు అందజేశారు. అంతకుముందు ప్రదర్శన నిర్వహించారు. ఈధర్నాలో సీపీఐ నగర కార్యదర్శి వి. కొండలరావు, సహాయ కార్యదర్శి సప్ప రమణ తదితరులు పాల్గొన్నారు.సామర్లకోటలో జరిగిన ధర్నాలో సీపీఐ జిల్లా కార్యదర్శి కామిరెడ్డి బోడకొండ, తోకల ప్రసాద్‌, పెద్దిరెడ్ల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
ఏలూరు జిల్లాలో…
అందరికీ ఇళ్లు అంటూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీఓ నంబరు 23 తక్షణమే అమలు చేసి పేదల సొంతింటి కల నెరవేర్చాలని సీపీఐ పశ్చిమ గోదావరి జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు డిమాండ్‌ చేసారు. తాడేపల్లిగూడెం తహసీల్దార్‌ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించిన ధర్నాలో ఇళ్ళ స్థలాల వ్యక్తిగత అర్జీలను తహసీల్దార్‌ ఎం.సునీల్‌ కుమార్‌ కు అందజేశారు. మండల నాగేశ్వరరావు, వడ్డాది మేరి తదితరులు ధర్నాలో పాల్గొన్నారు.
కృష్ణాజిల్లాలో…
మచిలీపట్నం తహశీల్దార్‌ కార్యాలయం ఎదుట సీపీఐ పిలుపులో భాగంగా ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి లింగం ఫిలిప్‌, దేవభక్తుల నిర్మల, కె.గగన్‌, ఓడుగు రత్నకుమారి, యర్రంశెట్టి ఈశ్వరరావు, నీలం దేవి కల, ఇంద్ర కుమారి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు