తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి వినియోగించే నెయ్యిలో జంతు కొవ్వులు, చేప నూనె వంటివి కల్తీ అయిన ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ కేసు దర్యాప్తు ప్రస్తుతం మరింత వేగవంతమైంది. టీటీడీ ఉన్నతాధికారులు, నెయ్యి సరఫరా చేసిన సంస్థలే ప్రధాన లక్ష్యంగా ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) తమ విచారణను ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా తాజాగా టీటీడీ మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పీఏ అప్పన్నకు నోటీసులు ఇచ్చింది. రెండు రోజులుగా ఆయన్ను అధికారులు ప్రశ్నిస్తున్నారు. అప్పన్నతో పాటు మరో ఆరుగురు టీటీడీ ఉద్యోగులను సిట్ విచారిస్తోంది. ఇక, తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడిన కేసులో ఇప్పటికే 15 మందిని అరెస్ట్ చేశారు. అరెస్టైన వారిలో టీటీడీకి నెయ్యి సరఫరా చేసిన డెయిరీ యజమానులు, ఉద్యోగులు ఉన్నారు. ఈ కుంభకోణంలో భాగంగా 2025 ఫిబ్రవరిలో నలుగురు వ్యక్తులను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) అదుపులోకి తీసుకుంది. తమిళనాడుకు చెందిన ఏఆర్ డెయిరీ మేనేజింగ్ డైరెక్టర్, ఉత్తరాఖండ్లోని భోలే బాబా డెయిరీకి చెందిన ఇద్దరు ప్రతినిధులు, శ్రీకాళహస్తికి చెందిన వైష్ణవి డెయిరీకి చెందిన ఒక ఎగ్జిక్యూటివ్ అరెస్టయిన వారిలో ఉన్నారు.
వీరు నకిలీ పత్రాలు సృష్టించి, టీటీడీ టెండరింగ్ ప్రక్రియలో అవకతవకలకు పాల్పడినట్లు దర్యాప్తులో వెల్లడైంది. నిందితులు సరఫరా చేసిన నెయ్యిలో మాంసాహార కొవ్వులు ఉన్నాయని తేలడంతో భక్తులు, ప్రజల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తును సిట్ నిర్వహిస్తోంది. కేవలం అరెస్టయిన నిందితులకే పరిమితం కాకుండా, టీటీడీలోని కొందరు అంతర్గత వ్యక్తుల ప్రమేయంపైనా సిట్ దృష్టి సారించింది.
సరఫరాదారులకు తగినంత ఉత్పత్తి సామర్థ్యం లేనప్పటికీ, టెండర్ ప్రక్రియలో అవకతవకలతో కొందరు టీటీడీ అధికారులు వారికి కాంట్రాక్టులు కట్టబెట్టడంలో కీలక పాత్ర పోషించి ఉంటారని అనుమానిస్తున్నారు. ఈ కేసులో భాగంగా సేకరణ నుంచి లడ్డూ తయారీ పదార్థాల వరకు వివిధ అంశాలతో సంబంధం ఉన్న 11 మందిని సిట్ ప్రశ్నించింది. వీరిలో టీటీడీ అధికారులు, సరఫరాదారులు కూడా ఉన్నారు.
ఇటీవల, ఈ కేసులోని ప్రధాన నిందితుల్లో ఇద్దరైన పోమిల్ జైన్ (భోలే బాబా డెయిరీ), అపూర్వ చావ్డా (వైష్ణవి డెయిరీ)లను తదుపరి విచారణ నిమిత్తం సిట్ తిరిగి కస్టడీలోకి తీసుకుంది. ఈ విచారణ ద్వారా ఉన్నతాధికారుల ప్రమేయంపై మరింత స్పష్టత వస్తుందని అధికారులు భావిస్తున్నారు. టెండరింగ్ ప్రక్రియలో ఇప్పటికే తీవ్రమైన లోపాలను గుర్తించిన సిట్, ఈ కల్తీకి సహకరించిన లేదా నిర్లక్ష్యం వహించిన కీలక టీటీడీ సిబ్బందిని గుర్తించి, వారిపై అభియోగాలు నమోదు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.
ఈ ఘటన తిరుపతి లడ్డూ ప్రసాదం పవిత్రతపై భక్తుల నమ్మకాన్ని తీవ్రంగా దెబ్బతీయడమే కాకుండా, టీటీడీ సేకరణ విధానాల్లో సంస్కరణలు తీసుకురావాలని, ఆలయ కార్యకలాపాలపై మరింత కఠినమైన పర్యవేక్షణ ఉండాలనే డిమాండ్లకు దారితీసింది.