. ఇప్పుడు ఎన్నికలొస్తే ఎవరికి ఓటేస్తారు?
. కూటమి వర్సెస్ వైసీపీ
విశాలాంధ్ర బ్యూరో-అమరావతి : రాష్ట్రంలో అధికార, ప్రతిపక్షాలు ఐవీఆర్ సర్వేలో నిమగ్నమయ్యాయి. ఎన్డీఏ కూటమి ప్రభుత్వ పాలన ఎలా ఉంది?, వైసీపీ పరిస్థితేమిటనే సందేశాలతో వాయిస్ మెసేజ్ల హడావుడీ నెలకొంది. రాష్ట్రంలో టీడీపీ అధినేత చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం కొలువుదీరి ఈ నెల 12వ తేదీకి ఏడాది కావస్తుంది. జూన్ 4న ఎన్నికల ఫలితాలు వెల్లడయిన రోజు కావడంతో కూటమి పాలన ఏడాది పూర్తి అయినట్లుగా వైసీపీ భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ 6తో పాటు 143 హామీలను నెరవేర్చలేదని, ప్రజలను కూటమి నేతలు మోసం చేశారంటూ వెన్నుపోటు దినోత్సవం పేరిట… వైసీపీ ఈ నెల 4న రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టింది. ఎన్నికల్లో అనూహ్య మెజార్టీతో విజయం సాధించిన కూటమి పార్టీలు ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా ఈ నెల 12న భారీగా వేడుకలు జరుపుకునేందుకు సిద్ధమవుతున్నాయి. జనసేన అధ్వర్యంలో ప్రత్యేక డిజిటల్ క్యాంపెయిన్ ఇప్పటికే ప్రారంభించింది. ‘సుపరిపాలన మొదలై ఏడాది`పీడ విరగడై ఏడాది’ అనే కార్యక్రమాన్ని పార్టీ అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పిలుపుతో ఆ పార్టీ శ్రేణులు నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో అధికార విపక్షాల మధ్య ఏడాది పాలన విషయంలో మాటల యుద్ధం జరుగుతోంది. ఎన్నికల హామీలను గాలికి వదిలివేసి ప్రజలకు వెన్నుపోటు పొడిచారని వైసీపీ ఆరోపిస్తుంటే, ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని అధికార పక్షం బదులిస్తోంది. మరోపక్క తాజాగా ఏపీలో రెండు రకాల ఐవీఆర్ఎస్ సర్వేలు జరుగుతుండటం చర్చనీయాంశంగా మారింది. ఈ సర్వేల ప్రశ్నావళి చూస్తే ఎవరెవరు ఇది నిర్వహిస్తున్నారో రాజకీయ అవగాహన ఉన్న ప్రతి ఒక్కరికీ అర్థం అవుతోంది. కూటమి ప్రభుత్వ పాలన ఎలా ఉందని ఒకటి… ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే ఎవరికి ఓటు వేస్తారనే దిశగా మరొకటి ఐవీఆర్ఎస్ సర్వే జరుగుతోంది. కూటమి ప్రభుత్వ పాలనపై ప్రశ్నిస్తూ మూడు ఆప్షన్లు ఇస్తున్నారు. అందులో 1.బాగుంది 2.ఫర్వాలేదు 3 బాగోలేదు అన్న విధంగా సమాధానాలున్నాయి. దీనిపై ఐవీఆర్ఎస్ ద్వారా ప్రజాభిప్రాయాలను తెలుసుకుంటున్నారు. అలానే మరో పక్క ఇప్పటికిప్పుడు ఏపీలో ఎన్నికలు జరిగితే ఏ పార్టీకి ఓటు వేస్తారనే అంశంపై మరో ఐవీఆర్ఎస్ సర్వే జరుగుతోంది. ఈ వాయిస్ కమాండ్కు కూడా మూడు ఆప్షన్లు ఇస్తున్నారు. దీనికి సమాధానాలుగా 1.వైసీపీ 2.ఇతరులు 3.తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిగా పేర్కొంటున్నారు. ప్రజలు ఈ సర్వేలో పాల్గొని తమ అభిప్రాయాలను చెబుతున్నారు. వాస్తవానికి రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు వచ్చే పరిస్థితి లేదు. కానీ కూటమి పాలనపై ప్రజలు ఏమనుకుంటున్నారు, వ్యతిరేకత ఎంత ఉందనేది తెలుసుకోవడం కోసమే ప్రతిపక్ష పార్టీ ఈ సర్వే చేస్తోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్రంలో టీడీపీ 135, జనసేన 21, బీజేపీ 8 స్థానాలతో ఎన్డీఏ కూటమి సర్కార్ తమకు ఎదురులేనట్లుగా ఉంది. వైసీపీ 11 సీట్లకే సరిపెట్టుకోవాల్సి రావడంతో ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా దక్కలేదు. ప్రతిపక్ష హోదా ఇవ్వలేదనే సాకుతో శాసన సభ సమావేశాలకే దూరంగా ఉండాలని వైసీపీ నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. ఆ పార్టీ అధినేత జగన్ సహా 11 మంది ఎమ్మెల్యేలు శాసన సభ సమావేశాలకు దూరంగా ఉంటూ వచ్చారు. శాసన మండలిలో ప్రతిపక్ష హోదా ఉండటంతో వైసీపీ ఎమ్మెల్సీలు మాత్రం సమావేశాలకు హజరవుతున్నారు. ప్రభుత్వాన్ని వివిధ సమస్యలపై గట్టిగా నిలదీస్తున్నారు. ఇక ఐవీఆర్ఎస్ సర్వే విషయానికి వస్తే ప్రజలు తమ అభిప్రాయాలను స్పష్టంగా వెల్లడిస్తారని అనుకుంటే పొరబాటే అవుతుంది. ఎందుకంటే కూటమి ప్రభుత్వ పనితీరు బాగోలేదని ఎవరైనా అభిప్రాయం వ్యక్తం చేస్తే సదరు సెల్ ఫోన్ నంబర్ ద్వారా అతని వివరాలు ప్రభుత్వ పెద్దలు తెలుసుకుని భవిష్యత్లో ఎటువంటి ప్రభుత్వ పథకాలు రాకుండా అడ్డుకుంటారనే భయం ఉంటుంది. దీంతో తన అభిప్రాయాన్ని నిర్మోహమాటంగా చెప్పే పరిస్థితి ఉండదు. మరోపక్క ఏ పార్టీకి ఓటు వేస్తారనే… ఐవీఆర్ఎస్ సర్వేని కొందరు తప్పుబడుతున్నారు. ఓటు అనేది రహస్యం. ఇలాంటి సర్వే చేయకూడదు. ప్రజలను ఎవరికి ఓటు వేస్తారో అడిగే హక్కు ఎవరికీ లేదు. ప్రజలు తమకు నచ్చిన పార్టీకి ఓటు వేసుకుంటారు. ఎవరికి ఓటు వేసారనేదీ చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఆ వివరాన్ని కూడా ఎవరూ అడగకూడదు. దీనికి భిన్నంగా ఈ సర్వేలో నేరుగా ఏ పార్టీకి ఓటు వేస్తారు అన్న వాయిస్ కమాండ్తో ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం ఇలా రెండు రకాల ఐవీఆర్ఎస్ సర్వేలు కొనసాగడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అయింది.