Friday, June 6, 2025
Homeబనకచర్ల రచ్చ !

బనకచర్ల రచ్చ !

ఆంధ్రా వర్సెస్‌ తెలంగాణ

. ముదిరిన జల ప్రాజెక్టు వివాదం
. రూ.80 వేల కోట్లతో ఏపీ ప్రభుత్వ ప్రణాళికలు
. కేంద్రానికి సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
. వ్యతిరేకించిన తెలంగాణ ప్రభుత్వం
. కేంద్రం చేతిలోనే కీలక నిర్ణయం

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : బనకచర్ల ప్రాజెక్టు ప్రతిపాదనతో తెలుగు రాష్ట్రాల్లో జల వివాదం మళ్లీ ఉత్కంఠ రేపుతోంది. రెండు రాష్ట్రాల మధ్య విభేదాలకు తెరలేపే పరిస్థితి కల్పించింది. ఇప్పటికే ఉన్న సమస్యల పరిష్కారానికే దిక్కులేని పరిస్థితిలో మరో కొత్త వివాదాన్ని తెచ్చినట్లు విమర్శలున్నాయి. నదులు, జలాశయాల అనుసంధానం ద్వారా ఆంధ్ర ప్రదేశ్‌ మొత్తం పొడవునా సాగు నీరు అందించే లక్ష్యంతో ప్రతిష్ఠాత్మక గోదావరి-బనకచర్ల ప్రాజెక్టు సీఎం చంద్రబాబు నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం… బనకచర్ల ప్రాజెక్టుకు సంకల్పించింది. ప్రస్తుతం ఉన్న పెండిరగ్‌ నీటి ప్రాజెక్టులను పూర్తి చేయకుండా భారీ వ్యయంతో బనకచర్లను ప్రతిపాదించడాన్ని రాజకీయ, ప్రజా సంఘాలు, రైతు సంఘాలు, వ్యవసాయ రంగ నిపుణులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అటు బనకచర్ల ప్రాజెక్టును అడ్డుకుని తీరుతామంటూ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రకటించడంతో వివాదం ముదిరింది. తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి, మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి సైతం ప్రాజెక్టును అడ్డుకుంటామనే సంకేతాలిచ్చారు. ఆంధ్ర ప్రదేశ్‌ పునర్విభజన అనంతరం తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న ఒప్పందాలు, ఆర్థిక సమస్యలను పరిష్కరించేందుకు సానుకూల వాతావరణం నెలకొన్న తరుణంలో తాజాగా బనకచర్ల ప్రాజెక్టు వ్యవహారం చిచ్చురేపేలా మారింది. బనకచర్ల పనులను వేగంగా పూర్తి చేసే దిశగా సీఎం చంద్రబాబు ప్రభుత్వం దృష్టి సారించింది. గోదావరి నదికి వరద పోటెత్తే క్రమంలో నీరు సముద్రం పాలవుతోంది. ఆ నీటిని ప్రజా ప్రయోజనాల కోసం మళ్లించాలని ఏపీలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ఆ ప్రాజెక్టు నిర్మాణం ద్వారా వరద నీటిని రాయలసీమతో పాటు ఉమ్మడి నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు మళ్లించాలని ప్రభుత్వం భావించింది. తద్వారా తాగు, సాగు నీటి అవసరాలు తీర్చవచ్చనే ఆలోచనలో ఉంది. ఈ ప్రాజెక్టును మూడు దశల్లో చేపట్టేలా ప్రణాళికలు రూపొందించారు. మొదటి దశలో గోదావరి నీటిని పోలవరం ప్రాజెక్టు నుంచి కృష్ణా బేసిన్‌కు తీసుకువస్తారు. అక్కడి నుంచి బొల్లాపల్లి రిజర్వాయర్‌కు నీటిని సరఫరా చేస్తారు. అక్కడి నుంచి బనకచర్లకు నీటిని తీసుకువస్తారు. బనకచర్ల నీరు చేరిన తర్వాత, నెల్లూరు, ప్రకాశం జిల్లాలతో సహా మొత్తం రాయలసీమ జిల్లాలకు సాగు నీరు అందడమే లక్ష్యంగా నిర్ధారించారు.
రాయలసీమకు ముఖద్వారంగా బనకచర్ల
సముద్రంలోకి వదులుతున్న కనీసం 300 టీఎంసీల నీటిని మళ్లిస్తే రాష్ట్రాన్నిపూర్తిగా మార్చే ఈ గేమ్‌-ఛేంజర్‌ ప్రాజెక్ట్‌ సాధ్యమవుతుందనే ఆశయంతో చంద్రబాబు ఉన్నారు. గోదావరి-బనకచర్ల ప్రాజెక్టును ‘రాయలసీమకు ముఖద్వారం’గా అభివర్ణిస్తూ, ఈ కలల ప్రాజెక్టును సాకారం చేయడానికి రూ.80,112 కోట్ల పెట్టుబడిని కేటాయిస్తున్నట్లు సీఎం ఇటీవల ప్రకటించారు. బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణంతో కలిగే లాభాలను సైతం వివరిస్తూ కేంద్రానికి సీఎం చంద్రబాబు లేఖ రాయడం, దానిపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకుంటామని ప్రకటన చేసింది. రాయలసీమలోని 80 లక్షల మందికి తాగునీటితో పాటు కొత్తగా మూడు లక్షల హెక్టార్ల ఆయకట్టుకు నీరందించడం, నాగార్జున సాగర్‌ కుడి కాలువ, వెలిగొండ, తెలుగు గంగ, గాలేరు నగరి, కేసీ కెనాల్‌ కింద 22 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ లక్ష్యంతో ఈ ప్రాజెక్టును ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ మేరకు కేంద్ర జల శక్తి శాఖకు ఏపీ ప్రభుత్వం నివేదిక ఇచ్చింది. దానికి ప్రధాన మంత్రి కృషి సింఛాయ్‌ యోజన (పీఎంకేఎస్‌వై)-అక్సిలిరేటెడ్‌ ఇరిగేషన్‌ బెనిఫిట్స్‌ ప్రోగ్రాం (ఏఐబీపీ) కింద సహాయం అందించాలని కోరుతూ చంద్రబాబు కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ఇంట్రా స్టేట్‌ లింక్‌ (రాష్ట్ర పరిధిలో అనుసంధానం) ప్రాజెక్టు కింద నిధులివ్వాలని, ఆ దిశగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తోను సీఎం చర్చించారు. ఈ విషయాలను కేంద్రానికి రాష్ట్ర అధికారులు వివరించారు. ఆంధ్ర ప్రదేశ్‌ విభజన చట్టం హామీలు చూస్తే… 11 ఏళ్లుగా పూర్తిగా అమలుకు నోచుకోలేదు. కేంద్రంలోను, రాష్ట్రంలోను ఎన్డీఏ ప్రభుత్వాలు అధికారంలో ఉన్నప్పటికీ అవి వేగవంతం కావడం లేదు. ఏపీకి ప్రత్యేక హోదాతో పాటు వెనుకబడిన జిల్లాలకు బుందేల్‌ ఖండ్‌ తరహా ప్యాకేజీ ఇవ్వలేదు. బనకచర్ల ప్రాజెక్టును ప్రభుత్వం ప్రతిపాదించడంతో ఏపీకి ప్రమాదం ఉందన్న వాదనలున్నాయి. ఉత్తరాంధ్ర, రాయలసీమలో నిలిచిన ప్రాజెక్టులకు నిధులు కేటాయించి, తక్షణమే వాటిని పూర్తి చేయాలని, పోలవరం ఎత్తు 45.72 మీటర్లపై సీఎం చంద్రబాబు స్పష్టమైన ప్రకటన చేయాలన్న డిమాండ్లు ఉదయిస్తున్నాయి.
బనకచర్లపై తెలంగాణ ప్రభుత్వ వాదనలివీ…
ఏపీ ప్రతిపాదించిన గోదావరిబనకచర్ల ప్రతిపాదిత ప్రాజెక్టును తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఆ ప్రాజెక్టు ఆంధ్ర ప్రదేశ్‌ పునర్విభజన చట్టానికి వ్యతిరేకమని ఆరోపిస్తోంది. గోదావరిబనకచర్ల ఆనుసంధాన ప్రాజెక్టులో భాగంగా నాగార్జున సాగర్‌ను వినియోగించడాన్ని ప్రధానంగా తెలంగాణ తప్పు పడుతోంది. ఇప్పటికే ఆ రాష్ట్ర సీఎం రేవంత్‌ రెడ్డి ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించి… గోదావరి, కృష్ణా బోర్డులతో పాటు కేంద్ర జలశక్తి శాఖ, కేంద్ర జలవనరుల సంఘం దృష్టికి తెలంగాణ అభ్యంతరాలు తీసుకెళ్లారు. బనకచర్ల ప్రాజెక్టు విషయంలో ముందుకు వెళ్లకుండా నిరోధించాలని, టెండర్లు పిలవకుండా చర్య తీసుకోవాలని కోరాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు, జల్‌శక్తి మంత్రి సీఆర్‌ పాటిల్‌కు తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి లేఖలు రాశారు. సెంట్రల్‌ వాటర్‌ కమిషన్‌, గోదావరి నదీ యాజమాన్య బోర్డులు ఈ ప్రాజెక్టుకు ఆమోదం తెలపకుండా చూడాలని ఆయన కోరారు. ఇదే వివాదంపై న్యాయ పోరాటం చేస్తామని, అవసరమైతే సుప్రీంలో పిటిషన్‌ వేస్తామని బీఆర్‌ఎస్‌ నేత, మాజీ మంత్రి హరీష్‌రావు వ్యాఖ్యానించారు. అటు గోదావరి వరద నీటిని బనకచర్లకు తరలిస్తే తెలంగాణాకు ఎలాంటి నష్టం లేదని ఏపీ సీఎం చంద్రబాబు చెబుతున్నారు. నదీ ప్రవాహానికి సంబంధించినంత వరకూ ఏపీకి తెలంగాణ ఎగువ రాష్ట్రం… గోదావరిపై తెలంగాణ రాష్టం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించినప్పుడు తాము అభ్యంతరం చెప్పలేదని చంద్రబాబు గుర్తు చేస్తున్నారు. అన్నీ అనుకూలిస్తే డీపీఆర్‌ పూర్తి చేసి రెండు, మూడు నెలల్లో టెండర్లు పిలిచే ఆలోచనలో ఏపీ ప్రభుత్వం ఉండగా… దాన్ని అడ్డుకునే దిశగా తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. మొత్తంగా బనకచర్ల ప్రాజెక్టు ప్రతిపాదనతో ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాల మధ్య జల వివాదాలు సృష్టించే దశకు చేరింది. దీనిపై కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేదీ ఉత్కంఠగా మారింది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు