ఏడుగురు మృతి
డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో బుధవారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. రాయవరం సమీపంలోని బాణసంచా తయారీ పరిశ్రమలో పేలుడు సంభవించింది. దీంతో ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఏడుగురు దుర్మరణం చెందారు. ప్రమాదం జరిగిన వెంటనే ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందగా.. మరొకరు ఆస్పత్రికి తరలిస్తుండగా ప్రాణాలు కోల్పోయారు. అలాగే ఈ ఘటనలో మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు సమచారం.అయితే రాయవరం బాణసంచా దుర్ఘటనలో శ్రీ గణపతి గ్రాండ్ ఫైర్ వర్క్స్ యజమాని వెలుగుబంట్ల సత్యనారాయణమూర్తి మృతి చెందినట్లు గుర్తించారు. ఈ అగ్నిప్రమాదానికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
సంఘటనా స్థలికి అనపర్తి ఎమ్మెల్యే
మరోవైపు ప్రమాద సమాచారం తెలిసిన వెంటనే అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అక్కడకు చేరుకుని ఘటనా స్థలాన్ని సందర్శించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తూర్పుగోదావరి, కోనసీమ జిల్లాలు సరిహద్దులో ఈ ఘటన జరిగిందన్నారు. 70 సంవత్సరాలుగా బాణాసంచా తయారీలో శ్రీ లక్ష్మీ గణపతి ఫైర్ వర్క్స్ వెలుగుబంట్ల సత్యనారాయణమూర్తికి అనుభవం ఉందన్నారు. ఆయన కూడా ప్రమాదంలో మృతి చెందడం బాధాకరమన్నారు. కాసేపట్లోనే హోంమంత్రి వంగలపూడి అనిత ఘటనా స్థలానికి చేరుకుంటారని తెలిపారు. నిబంధనలన్నీ కచ్చితంగా పాటించారని ఇటీవల అధికారుల తనిఖీల్లో వెల్లడయిందన్నారు. అయినప్పటికీ ఇలాంటి ఘటన జరగడం బాధాకరమని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు.


