సీపీఐ ప్రకాశం జిల్లా మహాసభలో రామకృష్ణ
విశాలాంధ్ర-దర్శి: ప్రధాని మోదీకి ఈవెంట్ మేనేజర్గా ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ విమర్శించారు. చంద్రబాబు అయితే కార్యక్రమాన్ని బాగా నిర్వహిస్తారని మోదీ గుర్తించారు కాబట్టే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కాకుండా ‘యోగాంధ్ర’కు హాజరయ్యారని ఎద్దేవా చేశారు. విశాఖపట్నంలో ‘యోగాంధ్ర’ విజయవంతం కావాలని సీఎంతో పాటు రాష్ట్ర యంత్రాంగం మొత్తం నెల రోజులుగా నిమగ్నమైందని రామకృష్ణ అన్నారు. ప్రజా సమస్యలను వదిలేసి యోగాంధ్రతో గిన్నిస్ రికార్డు లక్ష్యంగా అధికారులు, ప్రజా ప్రతినిధులు పనిచేశారన్నారు. రామకృష్ణ శనివారం సీపీఐ ప్రకాశం జిల్లా మహాసభల ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఆరోగ్యకర జీవనం కోసం ప్రతి ఒక్కరు యోగా చేయాలన్నారు. యోగా అనేది ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే కాదు దేశమంతటా చేస్తారన్నారు. అనుభవజ్ఞుడైన చంద్రబాబు కేవలం మోదీ మెప్పు కోసం కష్టపడ్డారా అని ఎద్దేవాచేశారు. మాజీ సీఎం బాటలోనే కూటమి ప్రభుత్వం నడుస్తోందని విమర్శించారు. ఇచ్చిన ఏ హామీ నెరవేర్చలేదని చంద్రబాబునుద్దేశించి అన్నారు. కూటమి ప్రభుత్వ ధోరణి మారకపోతే సీపీఐ అధ్వర్యంలో ప్రజా పోరాటం తప్పబోదని రామకృష్ణ హెచ్చరించారు. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టవద్దని హితవు పలికారు. ఒంగోలులో ఆగస్టు 23, 24, 25 తేదీలలో జరగబోయే సీపీఐ రాష్ట్ర మహాసభల జయప్రదానికి రామకృష్ణ పిలుపునిచ్చారు. కాగా, సీపీఐ ప్రకాశం జిల్లా మహాసభల ప్రారంభంలో అరుణ పతాకాన్ని సీనియర్ నాయకుడు అందే నాసరయ్య ఆవిష్కరించారు. మహాసభల అధ్యక్ష వర్గంగా యాసిన్, లక్ష్మి, రమేశ్ వ్యవహరించారు. సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు, కార్యదర్శివర్గ సభ్యుడు గుజ్జుల ఈశ్వరయ్య, ప్రకాశం జిల్లా కార్యదర్శి ఎంఎల్ నారాయణ, కార్యవర్గ సభ్యులు ఆర్ వెంకట్రావు, వడ్డే హనుమారెడ్డి, వీరారెడ్డి, శ్రీనివాస్, విజయ, రావమ్మ, రామకృష్ణ, నల్లూరి మురళి పాల్గొన్నారు.