Friday, May 16, 2025
Homeరక్షణ బడ్జెట్‌కు మరో50 వేల కోట్లు

రక్షణ బడ్జెట్‌కు మరో50 వేల కోట్లు

మోదీ సర్కారు యోచన

న్యూదిల్లీ: భారత్‌-పాక్‌ ఉద్రిక్తతల వేళ రక్షణరంగం విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఆ రంగానికి రూ.50 వేల కోట్ల మేర బడ్జెట్‌లో అదనపు కేటాయింపులు చేపట్టవచ్చని తెలుస్తోంది. ఆపరేషన్‌ సిందూర్‌ నేపథ్యంలో ప్రభుత్వం ఈ దిశగా సన్నాహాలు చేస్తుందని సంబంధిత వర్గాలు వెల్లడిరచాయి. ఈ ఏడాది రక్షణశాఖ కేటాయింపులు రూ.6.81 లక్షల కోట్లుగా ఉన్నాయి. తాజా పెంపునకు పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల్లో ఆమోదం లభించే అవకాశాలున్నాయి. దాంతో రక్షణ రంగానికి కేటాయించిన నిధులు రూ.7 లక్షల కోట్లు దాటుతాయని ఆ వర్గాలు తెలిపాయి. చైనా, పాకిస్థాన్‌ నుంచి భద్రతా సవాళ్లు ఎదురవుతున్న నేపథ్యంలో రక్షణరంగాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌లో కేటాయింపులను ప్రభుత్వం పెంచిన సంగతి తెలిసిందే. ఈ పద్దు కింద రూ.6,81,210 కోట్లను ప్రతిపాదించింది. 2024-25 బడ్జెట్‌ కేటాయింపుల(రూ.6.22 లక్షల కోట్లు)తో పోలిస్తే ఇది 9.53 శాతం అధికం. సవరించిన అంచనాల(రూ.6.41 లక్షల కోట్ల)తో పోలిస్తే 6.2 శాతం ఎక్కువ. తాజా కేటాయింపుల్లో కొత్త ఆయుధ వ్యవస్థల కొనుగోలుకు పెద్దపీట వేశారు. స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)లో రక్షణ కేటాయింపులు 1.91 శాతంగా ఉన్నాయి. రూ.50 వేల కోట్ల అనుబంధ బడ్జెట్‌లో నిధులను పరిశోధన, ఆయుధాలు, అవసరమైన పరికరాల కొనుగోలుకు ఉపయోగించే అవకాశాలున్నాయి. 2014-15 ఆర్థిక సంవత్సరానికి ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో రక్షణ రంగానికి కేటాయింపులు రూ.2.29 లక్షల కోట్లుగా ఉన్నాయి. మొత్తం వార్షిక పద్దులో 13 శాతం రక్షణకే కేటాయించారు. ఏప్రిల్‌ 22న జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంకు దగ్గర్లో ఉన్న ప్రముఖ పర్యాటక ప్రాంతం బైసరన్‌ లోయలో ఉగ్రవాదులు మారణహోమానికి పాల్పడిన సంగతి తెలిసిందే. సైనిక దుస్తుల్లో వచ్చినవారు పర్యాటకులను అతి సమీపం నుంచి కాల్చి చంపారు. ఈ ఘటనలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. దానికి ప్రతిగా పీఓకే, పాక్‌లోని ఉగ్రస్థావరాలను ఆపరేషన్‌ సిందూర్‌ పేరిట భారత్‌ ధ్వంసం చేసింది. అది జీర్ణించుకోలేని పాక్‌ తర్వాత రెచ్చగొట్టే చర్యలకు పాల్పడటంతో రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు తారస్థాయికి చేరాయి. అయితే భారత్‌ ధాటిని తట్టుకోలేని పాక్‌ వెనక్కి తగ్గటంతో కాల్పులు విరమణ ఒప్పందం కుదిరింది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు