. 9 రోజుల్లోనే రైతు ఖాతాల్లో రూ.9 వేల కోట్లు
. ఇది ప్రజాప్రభుత్వం ఘనత
. నేడు మండల కేంద్రాల్లో సంబరాలు: భట్టి
విశాలాంధ్ర- హైదరాబాద్: తెలంగాణలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని, రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనట్లుగా కేవలం తొమ్మిది రోజుల్లోనే రూ.తొమ్మిది వేల కోట్లతో రైతు భరోసా అందజేసినట్టు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్గ తెలిపారు. గాంధీ భవన్లో సోమవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ… మహిళలకు ఉచిత బస్సు, రైతులకు రూ. రెండు లక్షల రుణమాఫీ, ఉచిత విద్యుత్, సబ్సిడీ గ్యాస్ సిలండర్, పేదలకు సన్నబియ్యం వంటి ఎన్నో పథకాలను ప్రజల దరికి చేరుస్తున్నట్టు పేర్కొన్నారు. సీజన్ మొదలు కాగానే ఎకరాకు గతంలో రూ. 10 వేలుంటే.. రెండువేలు జోడిరచి రూ. 12 వేలు ఇచ్చినట్టు చెప్పారు. 1,49,39,111 ఎకరాలకు రైతు భరోసా ఇస్తున్నట్టు తెలిపారు. కేవలం తొమ్మిది రోజుల్లోనే రైతు ఖాతాల్లో నగదు జమ చేసినట్టు తెలిపారు. రైతు వేదికల వద్ద రైతులను సమావేశ పరుస్తామన్నారు. సచివాలయం ఎదురుగా ఉన్న రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద ముఖ్యమంత్రి, మంత్రులు సందేశాన్ని ఇస్తారన్నారు. తొమ్మిది రోజుల్లో కోటిన్నర ఎకరాలకు రైతు భరోసా నిధులు అందించిన విషయాన్ని వివరించాలన్నారు. ఇది ప్రజాప్రభుత్వం ఘనత అన్నారు. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాలలో మంగళవారం సాయంత్రం పెద్ద ఎత్తున సంబరాలు చేట్టాలని సూచించారు. పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్, కాంగ్రెస్ వ్యవహారాల రాష్ట్ర ఇంఛార్జి మీనాక్షి నటరాజన్, ఏఐసీసీ కార్యదర్శి చల్లా వంశీచంద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.